మహబూబ్నగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరులో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతమైంది. జిల్లాకేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారమే జిల్లాకు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్తో చేరుకున్న కేసీఆర్కు జడ్చర్లలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి ఘన స్వాగతం పలికారు.
అక్కడినుంచి సీఎం కాన్వాయ్లో మహబూబ్నగర్కు వారు చేరుకున్నారు. కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యాలయంలో పూజ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి చాంబర్లోకి వెళ్లి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సీటులో కుర్చోబెట్టారు. పార్టీ మీటింగ్ హాల్లోకి వెళ్లిన సీఎం కొద్దిసేపు ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. అక్కడి నుంచి బస్సులో వన్టౌన్, భగీరథకాలనీ మీదుగా సమీకృత కలెక్టరేట్కు చేరుకున్నారు.
అట్టహాసంగా ప్రారంభోత్సవాలు
నూతన సమీకృత కలెక్టరేట్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు కలెక్టర్ వెంకట్రావు సతీసమేతంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టరేట్ ప్రారంభోత్సవ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్లో మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రావును కుర్చీలో కుర్చోబెట్టి పూలబోకే ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎంను కలెక్టర్ వెంకట్రావు శాలువాతో సన్మానించి వేంకటేశ్వరస్వామి ఫొటోను బహూకరించారు. సమీకృత భవనం నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను సీఎం సన్మానించారు. కార్యాలయం మీటింగ్హాల్లో కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి స్మితాసబర్వాల్తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతిని వివరించారు. అ క్కడినుంచి మొదటి అంతస్తులో మంత్రి చాంబర్ను ప్రా రంభించారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలతో కలి సి సీఎం భోజనం చేసి జిల్లా స్థితిగతులపై చర్చించారు.
ముఖ్యమంత్రి పర్యటన సక్సెస్
పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఇదే వేదిక మీదుగా సమరశంఖం పూరించారు. మళ్లీ అదే వేదికపై స్వరాష్ట్రం సాధించుకున్న తీరు.. జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు జనం భారీగా చేరుకున్నారు. గులాబీ జెండాలు పట్టుకున్న టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్, కళాకారుడు సాయిచంద్ పాటలకు డ్యాన్స్లు చేశారు. సాయంత్రం సభ ప్రారంభం కాగానే జనంతో మైదానం కిక్కిరిసిపోయింది. ఇంకా చాలామంది బయటనే ఉండిపోయారు. ఎండను సైతం లెక్కచేయకుండా సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఈలలు వేశారు. జాతీయ రాజకీయాల్లో వెళ్దామా..? వెళ్దామా..? అంటూ ప్రశ్నిస్తే జనం గట్టిగా వెళ్దామంటూ నినదించారు. కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు జనం ఆసక్తిగా ప్రసంగాన్ని విన్నారు. యూట్యూబ్లో లైవ్లు చూడడం కనిపించింది. కొందరు సభా ప్రాంగణంలో సెల్ఫీలు దిగారు.