అచ్చంపేట, అక్టోబర్ 26: ఉద్యమనేత, అభివృద్ధి ప్రదాత, జనహృదయనేత సాక్షాత్తు.. సీఎం కేసీఆర్ రావడంతో అచ్చంపేటకు పండుగొచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అశేష ప్రజానీకంతో అచ్చంపేట పట్టణంలో గురువారం గులాబీ జాతర సాగింది. అచ్చంపేట నలువైపులా ఎటుచూసిన జనం.. గులాబీ ప్రభంజనాన్ని తలపించింది. అచ్చంపేట పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం సమీపంలో శ్రీశైలం వెళ్లేరోడ్డులో గురువారం నిర్వహించిన అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభకు అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, ఉప్పునుంతల, వంగూరు, చారగొండ మండలాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 11:30 గంటల నుంచి అచ్చంపేటకు ప్రారంభమైన జనం రాక మధ్యాహ్నం 3:30 గంటల వరకు రావడం కనిపించింది. బతుకమ్మ, కొలాటం, డప్పులు, పటాకులు పేలుస్తూ ర్యాలీగా పోటీపడి తరలివచ్చారు. అచ్చంపేట పట్టణం మొత్తం జనసంద్రాన్ని తలపించింది. లారీలు, డీసీఎంలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో యువకుల నుంచి వృద్ధుల వరకు సీఎం కేసీఆర్ను కంటితో చూసి దీవించేందుకు తరలివచ్చారు. పల్లెలు, పట్టణం తేడా లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 80వేల నుంచి లక్షమంది వరకు జనం తరలివచ్చారు. లెక్కకు మించి జనం తరలిరావడంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. అచ్చంపేట దారులన్నీ చీమలదండును తలపించింది. ఎండను లెక్కచేయకుండా జనం గంటలపాటు సీఎం కేసీఆర్ను చూసేందుకు ఓపికతో ఈలలు, కేకలు, డ్యాన్స్ చేస్తూ, కేరింతలతో హోరెత్తించారు. జై కేసీఆర్, జైజీబీఆర్, జైతెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం ప్రసంగానికి సభీకుల నుంచి పెద్దఎత్తున జోష్ లభించింది. బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించిన ప్రతిసారి పెద్దఎత్తున జనం నుంచి మద్దతు లభించింది. అచ్చంపేట చరిత్రలో ఇంతపెద్ద సభ ఇప్పటివరకు జరుగలేదు. సీఎం కేసీఆర్ సభను దిగ్విజయం సేందుకు గువ్వల బాలరాజు జనాన్ని పెద్దఎత్తున తరలించి నియోజకవర్గంలో గులాబీదండు సైన్యాన్ని మరోమారు చూపించారు. సభకు వచ్చిన జనం ద్వారానే అచ్చంపేటలో గులాబీ పార్టీమరోసారి గెలుపుఖాయమైందని చర్చించుకున్నారు.
అచ్చంపేటలో సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నీ తానై వ్యవహరించారు. సీఎం కేసీఆర్తోపాటు ఎమ్మెల్యే బాలరాజుపై ప్రత్యేకంగా పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘అచ్చంపేటలో దోపిడి దొంగల భరతం బట్టిండే.. మా అన్న బాలరాజన్నా.. ప్రజల కోసమే పనిచేస్తూ మన మధ్యలకొచ్చిండే మన అన్న బాలరాజన్నా’ అంటూ తనదైన శైలిలో పాటనందుకున్నారు.
సీఎం కేసీఆర్ సభలో జానపద గాయకురాలు లక్ష్మక్క పాట సభికులను హోరెత్తించింది. కల్వకుర్తి మండలం తాండ్రకు చెందిన కొమ్ము లక్ష్మక్క ‘గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క..’ అంటూ పాడిన పాటకు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. సభలో ఆమె పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.