అయిజ, డిసెంబర్ 10 : కోరిన కోర్కెలు తీర్చే వరాహాంజనేయస్వామిని భక్తులు తమ ఇంటి దైవంగా నిత్యం కొలుస్తుంటారు. ప్రతిఏటా కార్తీక అమావాస్య నుంచి నాలుగు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం గ్రామ ఆచారంగా వస్తోంది. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చి వరాహాంజనేయస్వామికి మొక్కులు చెల్లించుకోనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లను చేసింది. రాత్రి 8గంటలకు నందికోళ్ల సేవ, 9గంటలకు ప్రభోత్సవం, బుధవారం రాత్రి 7గంటలకు గంగపూజ, 9 గంటలకు పంచామృతాభిషేకం, రాత్రి 11గంటలకు వరాహాంజనేయస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ సకల ఏర్పాట్లను చేసింది. బ్రహ్మోత్సవాల వేళ ఆలయాన్ని రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించనున్నారు. భక్తులకు కావాల్సిన సదుపాయాలను సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కల్పిస్తున్నారు.
కొత్తపల్లి వరాహాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన అంతర్రాష్ట్ర న్యూ కేటగిరి విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి వృషభరాజములు తరలిరానున్నాయి. బండలాగుడు పోటీల్లో గెలుపొందిన వృషభరాజముల విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మొదటి బహుమతి 40,116, రెండో బహుమతి 30,116, మూడో బహుమతి 20,116, నాలుగో బహుమతి 10,116లు అందజేయనున్నారు. 15న అంతర్రాష్ట్ర ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.30,116, రెండో బహుమతి రూ. 20,116, మూడో బహుమతి రూ. 10,116, నాల్గో బహుమతి 5,116 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. స్లోబైక్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ. 3,116, రెండో బహుమతి రూ. 2,116లు అందజేయనున్నారు.