జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 5 : విదేశీ కరెన్సీ సగం ధరకే ఇస్తామని సినీఫక్కీలో మోసం చేసిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, బాధితుల కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన ఖాజాసిరాజొద్దీన్ దుబాయి నుంచి ఏడాదిన్నర కింద వచ్చి జిల్లాకేంద్రంలో ఆఫ్టికల్షాపు నిర్వహిస్తున్నాడు. రెండు వారాల కిందట ముస్తఫా అనే వ్యక్తి వచ్చి దుకాణంలో కండ్లద్దాలు కొన్నాడు.
యజమానితో మాటలు కలిపాడు. తన వద్ద దుబాయి కరెన్సీ ఉందని.. అక్కడి రూపాయి ధర విలువ ఇండియా కరెన్సీలో రూ.22 పలుకుతుందని నమ్మబలికాడు. కావాలంటే మీకు సగం ధరకే ఇస్తామని, జడ్చర్లకొస్తే అక్కడే చూయిస్తానని ముస్తఫా చెప్పి అతడి ఆధార్కార్డు, ఫోన్నెంబర్ ఇచ్చి వెళ్లాడు. అతడి మాటలు నమ్మిన ఖాజాసిరాజొద్దీన్ రెండ్రోజుల కిందట అతడి భార్యతో కలిసి జడ్చర్లకు వెళ్లి రైల్వేగేట్ వద్ద ముస్తఫాను కలిశాడు. అతడి బ్యాగులో ఉన్న దుబాయి కరెన్సీని చూపించాడు. నిజమేనని నమ్మి మొదట రూ.5లక్షలు ఇండియన్ కరెన్సీ ఇస్తాం.. అందుకు సరిపడా దుబాయి కరెన్సీ ఇవ్వాలని కోరాడు.
ఇందుకు సరేనన్న మోసగాడు ఆదివారం తెల్లవారుజామున తిరిగి జడ్చర్ల రైల్వే గేటు వద్దకు వస్తే ఇస్తాను.. మొత్తం డబ్బు తీసుకురావాలని సూచించాడు. దీంతో ఖాజాతోపాటు అతడి భార్య బ్యాంకు నుంచి రూ.5లక్షలు డ్రా చేసి ఉదయమే జడ్చర్లకు చేరుకున్నాడు. ముస్తఫా వచ్చి ఇక్కడ జనసంచారం ఉందని, సమీపంలోనే మా బంధువు ఇంటి వద్ద దుబాయి కరెన్సీ ఉందని వారిని గ్రంథాలయ భవనం వీధిలోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న నలుగురితోపాటు ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగులో కరెన్సీ ఉందని నమ్మబలికారు. బాధితుల నుంచి రూ.5లక్షలకు సంబంధించిన ఇండియన్ కరెన్సీ బ్యాగును తీసుకొని అతడి వద్ద ఉన్న బ్యాగును అందజేశాడు.
సగం ధరకే దుబాయి కరెన్సీ వచ్చిదంటూ ఖాజా దంపతులు సంబురపడుతూ వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక ఇచ్చిన బ్యాగు తెరిచి చూడగా బ్యాగులో పాత న్యూస్పేపర్లు ఉండడంతో బాధితులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై డబ్బులు అందజేసిన ప్రాంతానికి వెళ్లగా.. అప్పటికే వారు డబ్బుతో అక్కడినుంచి పరారయ్యారు. మోసపోయామని తెలుసుకొని లబోదిబోమన్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ రమేశ్బాబు, ఎస్సై లెనిన్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరిపారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపాడు.