నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పిలుపు మేరకు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించేందుకు సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) పేర్కొన్నారు.
సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ( BRS ) పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించిందని గుర్తు చేశారు. కానీ ఆ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందన్నారు.
ప్రతి గ్రామంలో ప్రజలకు వాస్తవాలు, నిజాలు అధికారిక గణాంకాలను ఆధారంతో సహా వివరించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో, ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలుంటాయని వివరించారు. నాయకులు, కార్యకర్తల సమన్వయం చేసుకొని గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలకు కృషి చేయాలన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలతో కలిసి గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామం నుంచి మండల స్థాయి వరకు గుర్తించాలన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై విద్యార్థులు, యువతతో చర్చలు నిర్వహించి అవసరమైన చోట ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశమై రైతు బంధు. రైతు రుణమాఫీ, సాగునీరు, ఎరువులు, విత్తనాల లభ్యత, కరెంట్ వంటి అంశాలను గుర్తించి ప్రభుత్వ వైఫల్యాలను రైతుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో అన్ని గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.