దేవరకద్ర, ఫిబ్రవరి 17 : కారణజన్ముడు కేసీఆర్, అలుపెరగని పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి.. నాటి ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని మంగళవారం దేవరకద్ర పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటీగా నిలిచి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రదాత కేసీఆర్ అని పేర్కొన్నారు. పదేండ్ల పాలనలో తెలంగాణను సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెట్టించారన్నారు. ఆయన నిండునూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జెట్టి నర్సింహారెడ్డితోపాటు మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.