భూత్పూరు బల్దియా సుందరం.. సుమధురంగా తీర్చిదిద్దబడింది. శుభ్రత.. స్వచ్ఛతకు మారుపేరుగా మున్సిపాలిటీ నిలిచింది. క్లీన్ అండ్ గ్రీన్ తరహాలో రహదారులు.. ఆహ్లాదపర్చుతున్న హరితహారం మొక్కలు.. ఇలా 90 అంశాల్లో మెరిసింది. దీంతో కేంద్రం ‘స్వచ్ఛ్ సిటీ’ అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. 1వ తేదీన దేశ రాజధానిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ సత్తూరు బస్వరాజ్గౌడ్ అవార్డును అందుకున్నారు. మున్సిపాలిటీ కేంద్ర అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ‘పుర’ చైర్మన్, అధికారులకు అభినందనలు తెలిపారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ వచ్చాక పట్టణాల రూపురేఖలు మారాయి. మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు. బల్దియాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడంతో నగరాల సరసన నిలుస్తున్నాయి. తా జాగా కేంద్రం స్వచ్ఛత పురస్కారాలు అందించ గా.. రాష్ట్రంలో 17 మున్సిపాలిటీలకు అవార్డు లు వచ్చాయి. అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భూత్పూర్ బల్దియాకు ఈ గౌరవం దక్కింది. కరోనా సమయంలో కూడా పాలకవ ర్గం, అధికారులు ప్రజలకు కావాల్సిన సౌకర్యా లు కల్పించారు. విలీన గ్రామాల్లోనూ రహదారులు పచ్చదనం పరుచుకున్నాయి. పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచాయి. కేంద్ర బృందం 90 అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 1వ తేదీన కేంద్ర మంత్రులు, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ సత్తూరు బస్వరాజ్గౌడ్ ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. కాగా, భూత్పూర్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచింది.
పదో వార్డులో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం
పచ్చదనం పరుచుకున్న రహదారులు..
భూత్పూర్ మున్సిపాలిటీ 44వ జాతీయ ర హదారిపై ఉంటుంది. ఇటు హైదరాబాద్-బెంగళూరు, అటు శ్రీశైలం-మహబూబ్నగర్కు జంక్షన్గా మారింది. ప్రధాన రహదారులు పచ్చదనం పరుచుకున్నాయి. మహబూబ్నగర్ వెళ్లే దారిలో మున్సిపాలిటీ పరిధి ముగిసే వరకు నాలుగులైన్ల రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. డివైడర్ మధ్యలో పచ్చని మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వీటిని చూస్తే పెద్ద పట్టణానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. రోడ్లపై చెత్త కనిపించకుండా మున్సిపల్ సిబ్బంది నీట్గా ఉంచుతున్నారు. నాగర్కర్నూల్ వైపు వెళ్లే రహదారిని సైతం నాలుగు లైన్లుగా మార్చి డివైడర్ మధ్యలో స్ట్రీట్లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ పనులు పూర్తయితే భూత్పూర్ రూపురేఖలు మారిపోతాయి. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూత్పూర్ మున్సిపాలిటీకి రూ.కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటితో భూత్పూర్, విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఐఎఫ్ఐడీసీ నిధుల కింద రూ.21 కోట్లు మంజూరయ్యాయి. రూ.కోటి వ్యయంతో క్రిమిటోరియం, వెజిటేబుల్ మార్కెట్కు రూ.2 కోట్లు, 12 విలీన తండాల్లో సీసీ రోడ్లు, భూత్పూర్లో రహదారి పొడవునా సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, వాటిపై మొక్కలు పెంచారు. మున్సిపాలిటీ పరిధిలో 288 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉమ్మడి జిల్లాలో ఏ బల్దియా సాధించని రికార్డును సృష్టించారు. రూ.36 లక్షలతో మునిరంగ స్వామి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మించారు. మున్సిపాలిటీ అవసరాలకు అనుగుణంగా కొత్త వాటర్ ట్యాంకు నిర్మించి తాగునీటి ఎద్దడి లేకుండా చేశారు. ప్రతి ఇంటికీ నిత్యం 130 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరందిస్తున్నారు.
హరితహారంలో వందశాతం సక్సెస్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఉత్తమ ము న్సిపాలిటీగా స్టేట్ అవార్డు సాధించింది. భూ త్పూర్ పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ స మీకృత భవనానికి రూ.5కోట్లు కావాలని మం త్రి కేటీఆర్ను ఎమ్మెల్యే ఆల కోరగా.. వెంటనే మంజూరు చేశారు. కొత్త స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. క్రీడా ప్రాంగణాన్ని అం దుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి వార్డులో పార్కులు ఏర్పాటు చేశారు. రూ.3.50లక్షలతో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టారు. పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. కరోనా సమయం లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకున్నారు.
అవార్డు రావడం గర్వకారణం..
దేవరకద్ర నియోజకవర్గంలో భూత్పూర్ మున్సిపాలిటీకి కేంద్ర స్వచ్ఛ్ అవార్డు రావడం గర్వకారణం. గతంలో స్టేట్ అవార్డు కూడా వచ్చింది. మున్సిపాలిటీ చేయాలని మంత్రి కేటీఆర్కు ప్రతిపాదించగానే ఒప్పుకుని రూ.21 కోట్లు మంజూరు చేశారు. వీటితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పాలక వర్గంలో ఉత్సాహవంతులు ఉండడంతోనే వేగంగా అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర అవార్డు అందుకున్నందుకు మున్సిపల్ చైర్మన్కు, అధికారులకు అభినందనలు. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన వెంటనే కేంద్ర అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణం.
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో..
కేంద్ర, రాష్ట్ర అవార్డులు సొంతం చేసుకోవడం గర్వకారణంగా ఉంది. కరోనా సమయంలో ఏడాదిపాటు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. టైం వృథా అయింది. అధికారుల సహకారంతో అనుకున్న విధంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేశాం. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీకి అనేక నిధులు వచ్చాయి. కేంద్ర అధికారులు వచ్చి బల్దియాలో జరిగిన అభివృద్ధికి మెచ్చి స్వచ్ఛ్ సిటీ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రజలు, అధికారుల సమన్వయంతో ఈ అవార్డు దక్కింది. మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం.
– సత్తూరు బస్వరాజ్గౌడ్, మున్సిపల్ చైర్మన్, భూత్పూర్