అచ్చంపేట, ఫిబ్రవరి 28: రైతులకు యాసంగి కలిసొచ్చింది. యాసంగిలో సాగుచేసిన వేరుశనగ పంట దిగుబడి భారీగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్, అమ్రాబాద్, పదర, లింగాల, వంగూరు, చారకొండ మండలాల పరిధిలో రైతులు యాసింగిలో వేరుశనగ సాగుచేశారు. రైతులకు ఆశించిన దిగుబడి రావడంతో సంబురపడుతున్నారు. పత్తి ఆశించిన దిగుబడి రాక దిగులుతో ఉన్న రైతాంగానికి వేరుశనగ కాస్త ఊపిరిపోసింది.
ఈసారి పత్తి రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. అనుకున్న దిగుబడి రాక వచ్చిన కొద్దిపాటి పత్తికి సరైన ధర లేక రైతులు నష్టపోయారు. అయితే యాసంగినైనా ఆదుకుంటుందనే ఆశతో రైతులు బోర్లు, కాల్వల కింద వేరుశేనగ పంటను సాగుచేశారు. ఉప్పునుంతల మండలంలో అధికంగా పండింది. రైతులకు పుష్కలంగా నీళ్లు, కరెంట్తోపాటు పెట్టుబడి సాయం రైతుబంధు సకాలంలో చేతికి అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులను తెలంగాణ సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతులకు మేలు చేకూరుస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
గతంలో కాల్వ నీళ్లు లేక కేవలం వానకాలం పంట సాగుచేసేవారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు కేఎల్ఐ నీళ్లు కాల్వ నిండా పారుతుండగా రెండు పంటలు పుష్కలంగా సాగుచేస్తున్నారు. మంగళవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్కు ఒక్కరోజే 649మంది రైతులు 6,710 క్వింటాళ్ల వేరుశనగ విక్రయించేందుకు తీసుకొచ్చారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణం వేరుశనగ రాశులతో కళకళలాడుతున్నది. సీజన్ ప్రారంభమై 20రోజులు కావస్తున్నా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో రైతులు వేరుశనగ తీసుకొస్తున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియ కొసాగిస్తున్నట్లు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బలుస అరుణాశ్రీనివాసులు తెలిపారు. ప్రతిరోజూ మార్కెట్లో విక్రయానికి వేరుశనగ తెచ్చిన రైతులను కలిసి సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అచ్చంపేట, వనపర్తికి చెందిన వ్యాపారస్తులు టెండర్ల విధానం ద్వారా వేరుశనగ కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం అచ్చంపేట మార్కెట్లో క్వింటాకు గరిష్ఠ ధర రూ.7,811, కనిష్ట ధర రూ.5,336 కొనుగోలు చేశారు. యాసంగి రైతులకు కలిసిరావడంతో వేరుశనగ రాశులతో మార్కెట్ సందడిగా మారింది.
90బస్తాలు తీసుకొచ్చాను..
ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఇంకా ఎకరన్నర అలాగే ఉంది. 90బస్తాలు విక్రయించేందుకు తెచ్చాను. ఈసారి యాసంగిలో వేరుశనగ బాగా దిగుబడి వచ్చింది. కాల్వలు, బోర్లలో నీళ్లు నిండుగా ఉన్నాయి. కరెంట్కు ఇబ్బంది లేదు. పెట్టుబడికి రైతుబంధు వస్తున్నది. రైతులకు సీఎం కేసీఆర్ వచ్చినంక ఎలాంటి సమస్య లేదు. అన్నీ బాగా చేస్తున్నడు. మార్కెట్లో వేరుశనగ రాశులతో నిండిపోయింది. రెండు పంటలు ఫుష్కలంగా పండుతున్నాయి. ధర బాగానే ఉంది. కానీ, ఇంతకుముందు ఇంకా ఎక్కువ ధర ఉన్నది. ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది. ధర కొద్దిగా పెంచితే బాగుండేది. ఈసారి పత్తికి ధర తగ్గింది. కానీ, వేరుశనగకు ధర వచ్చింది.
– లక్ష్మయ్య, రైతు, ఉప్పునుంతల
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. కొన్ని రోజులుగా మార్కెట్కు వేరుశనగ అధికంగా వస్తోంది. వ్యాపారస్తులు టెండర్ వేసి కొనుగోలు చేసేలా ఎప్పటికప్పుడు మాట్లాడి చర్యలు తీసుకుంటున్నాము. చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు భారీగా పంటను విక్రయించేందుకు వస్తున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మంచి దిగుబడి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– అరుణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, అచ్చంపేట