చారకొండ, ఏప్రిల్ 28 : నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లి గ్రామానికి చెందిన తాళ్ల రవీందర్ మాతృభూమి డెవలపర్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. మాతృ భూమి సంస్థ యజమాని శ్రీపతిరావు నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 120, 121, 122లో 12 ఎకరాలను కొనుగోలు చేశాడు. సదరు భూమిని 12 మందికి విక్రయించగా.. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఫిబ్రవరి 7న రవీందర్ స్లాట్ బుక్ చేశాడు. రిజిస్ట్రేషన్ చేయాలని అదే నెల 14వ తేదీ వరకు తాసీల్దార్ నాగమణిని సంప్రదించాడు. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు రూ.25 వేల చొప్పున రూ.3 లక్షలు ఇవ్వాలని తాసీల్దార్ డిమాండ్ చేసింది. మొదటి విడుతలో నాలుగు డాక్యుమెంట్లను ఫిబ్రవరి 20వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. వాటికి సంబంధించిన రూ.లక్ష ఇవ్వాలని తాసీల్దార్ డిమాండ్ చేయడంతో బాధితుడు రవీందర్ ఫిబ్రవరి 24న మహబూబ్నగర్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో రవీందర్.. శుక్రవారం రూ.75 వేలు తీసుకొని తాసీల్దార్ వద్దకు వెళ్లాడు. కాగా, రూ.75వేలను వీఆర్ఏ వందన భర్త వెంకటయ్యకు ఇచ్చి.. మిగతా రూ.25వేలను ధరణి ఆపరేటర్ రాజుకు ఇవ్వాలని చెప్పింది. రవీందర్ డబ్బును వెంకటయ్యకు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పంచనామా చేసి తాసీల్దార్ నాగమణి, వీఆర్ఏ భర్త వెంకటయ్య, ధరణి ఆపరేటర్ రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.
జడ్చర్ల, ఏప్రిల్ 28 : చారకొండ మండలంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో తాసీల్దార్ నాగమణికి జడ్చర్ల పట్టణంలో సొంత ఇల్లు ఉండగా.. శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. తాసీల్దార్కు చెందిన స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారం వివరాలను నమోదు చేసుకున్నారు.