మహబూబ్నగర్, జులై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరువు నేలన.. జలసవ్వడి సంతరించుకున్నది . పాలమూరు జిల్లా వరప్రదాయిని దుందుభీ నదిపై జలదృశ్యం ఆవిష్కృతమైంది.పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నది పరవళ్లు తొక్కుతున్నది.దీంతో మొత్తం 27 చెక్డ్యాంలు నిండుకుండను తలపిస్తూ మత్తడి దుంకుతున్నాయి. ఒక్కో అడ్డుకట్ట పరిధిలో వందల ఎకరాలఆయకట్టుతో మొత్తం 25 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పంట చేలతో పచ్చని అందాలు పర్చుకున్న నదీ తీరప్రాంతంనయనమనోహరంగా కనిపిస్తున్నది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సంకల్పం ఫలించింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయించి చెక్డ్యాంలు నిర్మింపజేశారు. దీంతో నేడు సాగు సంబురంగా సాగుతుంటే.. మత్స్య సంపద పెరిగింది. ఇలా జిల్లాతో దుందుభీకి విడదీయని బంధం ఏర్పడింది.
పాలమూరు జిల్లా వరప్రదాయిని దుందుభీ నది పరవళ్లు తొక్కుతున్నది. వారం రోజులుగా కురిసిన వర్షాలతో వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల ప్రవాహం దుందుభీలో సంగమిస్తున్నది. దీంతో మహబూబ్నగర్-నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో నిర్మించిన డిండి ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. కృష్ణానదికి ఉపనది దుందుభీ జలసవ్వడిని సంతరించుకున్నది. దీంతో జడ్చర్ల నియెజకవర్గంలో అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కృతమవుతున్నది.
27 చెక్డ్యాంలు మత్తడి
దుందుభీ నది ఉప్పొంగుతుండడంతో ఏకంగా 27 చెక్డ్యాంలు నిండి అలుగుపారుతున్నాయి. ఇది ఉమ్మడి జిల్లా చరిత్రలోనే రికార్డు. నవాబ్పేట, రాజాపూర్, బాలానగర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలంలోని అన్ని చెక్డ్యాంలు పూర్తిగా నిండాయి. గుట్టకాడిపల్లి వద్ద చెక్డ్యాంకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయడంతో తిమ్మాజిపేట మండలం ఆవంచ చెరువుతోపాటు గొలుసుకట్టు చెరువులను నింపుతున్నారు. నవాబ్పేట మంలం లోకేరేవు, ఇప్పటూరు, కారూర్, దొండ్లపల్లి, చెన్నవెల్లి, రాజాపూర్ మండలం కుచ్చరకల్, రాజాపూర్, నందిగామ, ఈర్లపల్లి, జడ్చర్ల మండలం లింగంపేట, నెక్కొండ, అల్వాన్పల్లి, గుట్టకాడిపల్లి, దోనూరు, వస్పుల, వల్లభరావుపల్లి, వాడ్యాల, మిడ్జిల్ మండలం మున్ననూరు, అయ్యవారిపల్లి, మిడ్జిల్, కొత్తూరుతోపాటు బాలానగర్ నుంచి వచ్చే వాగుపై బాలానగర్, గుండేడ్, గౌతాపూర్, బోడజానంపేట, ఆగ్రహారం పొట్లంపల్లి, ఈద్గాన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాంలన్నీ మత్తడి దుంకుతున్నాయి. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలసవ్వడిని సంతరించుకున్నది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు చోట్ల నీటి వృథాకు చెక్ పెట్టేందుకు నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జడ్చర్ల మండలం కోడ్గల్, మిడ్జిల్ మండలం భైరంపల్లి వద్ద చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. చెక్డ్యాంలు అలుగు పారడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుందుభీ నది తీరం వెంట ఎటుచూసినా వరి కరిగెట్లు కనిపిస్తున్నాయి. నిండిన చెక్డ్యాంలతోపాటు చెరువులకు లింక్ కెనాల్ను ఏర్పాటు చేయడంతో అవి కూడా ఒడిఒడిగా నిండుకుండలా మారుతున్నాయి.
ఫలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంకల్పం
వాగులపై చెక్డ్యాంలు ఏర్పాటు చేయాలన్న సంకల్పం మాత్రం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిది. 2006లో దుందుభీ నదిలో వృథాగా పోతున్న వరదను చూసి అడ్డుకట్ట వేసి వ్యవసాయానికి ఊతం ఇవ్వాలనే సంకల్పించారు. ఈ విషయాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే నదిపై అడ్డుకట్టలు వేయడానికి అప్పటి ఇరిగేషన్ శాఖాధికారులు ఒప్పుకోలేదు. అక్కడక్కడ చెక్డ్యాంలు నిర్మిస్తే ఎక్కడికక్కడే నీళ్లు నిలిచి సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ఉంటుందని పట్టుబట్టి సాధించారు. భూగర్భ జలాలు పెరగడంతోపాటు బోర్లు రీచార్జ్ అవుతాయని వివరించడంతో అల్వాన్పల్లి, గుట్టకాడిపల్లి వద్ద రెండు చెక్డ్యాంలు నిర్మించింది. ఏటా నీటితో నిండుతుండటంతో నదీ పరీవాహక ప్రాంతాలకు సాగు, తాగునీటికి ఢోకా తీరింది. తెలంగాణ వచ్చాక ఏకంగా ఎక్కడికక్కడే చెక్డ్యాంలు పునరుద్ధరించడంతో నదీ మొత్తం చెక్డ్యాంలకు కేరాఫ్గా మారింది. దీంతో తీర ప్రాంత గ్రామాలు పంటలతో కళకళలాడుతున్నాయి. ముందుచూపుతో వ్యవహరించి దుందుభీ నదిపై నిర్మించిన 27 చెక్డ్యాంలు నేడు నిండి సత్ఫలితాన్నిస్తున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంత్రాంగం ఫలించడంతో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. తాగునీటికీ ఇబ్బందులు తీరాయి. సమీప బోర్లు, బావుల్లో నీళ్లు బావుల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి.
దుందుభీకి పాలమూరుకు విడదీయని బంధం..
నాడు పాలమూరు కరువు రక్కసిని పారదోలిన దుందుభీకి జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. జిల్లాలోని నవాబ్పేట మండలం పురుసంపల్లి కొండల్లో పుట్టే దుందుభీ మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల నుంచి నల్లమల అడవుల్లోకి ప్రవహించి నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇటు రాజాపూర్, అటు బాలానగర్ నుంచి వస్తున్న వాగులన్నీ దుందుభీలో సంగమించి మిడ్జిల్ మండలం నుంచి నాగర్కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించి, డిండి ప్రాజెక్టులో కలుస్తాయి.
దుందుభీ తీరంలో ఆధ్యాత్మిక పరవళ్లు
రెండు ఉమ్మడి జిల్లాల్లో దుందుభీ నదికి ఎంతో ప్రాశస్థ్యం ఉన్నది. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి వద్ద నదీ తీరాన ఉన్న లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాన్ని దుందుభీ క్షేత్రంగా కూడా పిలుస్తారు. జడ్చర్ల మండలం మీనాంబరం వద్ద పరుశవేదీశ్వర లింగం ఎంతో ప్రసిద్ధి చెందింది. నది ప్రాముఖ్యతపై గంగాపురం హనుమాశ్చర్యులు గొప్ప కావ్యం కూడా రాశారు. ఎందరో కవులు పాటల రూపంలో గొప్పదనాన్ని వివరించారు.
సాగు సంబురం
దుందుభీ నది పరవళ్లు తొక్కుతుండటంతో నదీతీర ప్రాంతం అంతా వ్యవసాయం జోరందుకున్నది. వానకాలం పంటల సాగుకు ఢోకా లేదని రైతులు చెబుతున్నారు. కిలోమీటర్ల పొడవునా వాగులో జలసిరి సంతరించుకున్నది. తీర ప్రాంతాల రైతులు వరి కరిగెట్ల వేస్తుండడంతో భూమికి పచ్చానీ రంగేసినట్లు సీన్ కనిపిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. నదీతీర ప్రాంతం పచ్చదనాన్ని పర్చుకున్నది. కర్షకులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు చెక్డ్యాంల వద్ద యువకులు చేపలను ఉత్సాహంగా పడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించిన చేప పిల్లలు నేడు రిజర్వాయుర్లు, చెరువుల్లో విడుదల చేయగా.. నేడు పెద్దయ్యాయి. ఇవన్నీ వాగులోకి చేరడంతో చేపల వేట కొనసాగుతున్నది. కాగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో..ఇటీవల నది దాటుతో ఇద్దరు మైనర్లు మృతి చెందిన సంఘటనతో అధికారులు చేపల వేటను నిషేధించారు.