ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్ టౌన్, జూన్ 20 : సీఎం కేసీఆర్ మక్తల్ పట్టణానికి 150పడకల ప్రభుత్వ దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రూ.36 కోట్లతో వైద్య ఆరోగ్యశాఖ నుంచి 150 పడకల ప్రభుత్వ దవాఖానను మంజూరు చేశారన్నారు.
ప్రస్తుతం మక్తల్ పట్టణంలో 30పడకల దవాఖాన ఉందని, నియోజకవర్గం ప్రజల దృష్ట్యా దవాఖాన స్థాయి పెంచుతున్నట్లు తెలిపారు. 100 పడకల సాధారణ పడకలు, 50 పడకల మెటర్నిటీ, చైల్డ్ హెల్త్ సర్వీస్తో కర్ని రోడ్డులో దవాఖాన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇకనుంచి ప్రభుత్వ దవాఖానలో గర్భిణితోపాటు వచ్చిన ముగ్గురు సభ్యులకు భోజనం సదుపాయం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.