మహబూబ్నగర్ సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరువు, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్ జిల్లా పరిస్థితులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్కాకతీయ, వాన నీటి సంరక్షణ కార్యక్రమాలు, హరితహారం వల్ల భూగర్భజలాలు పెరిగాయి. 2014కు పూర్వం జిల్లాలో భూగర్భజలాలు భూమి నుంచి 13మీటర్ల లోతులో ఉండేవి. మిడ్జిల్, రాజాపూర్, సీసీకుంట, హన్వాడ, జడ్చర్ల, మహబూబ్నగర్ తదితర మండలాల్లో 20మీటర్లకుపైగా లోతున నీరు ఉండేది. ఈ మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఎడారిలాగా డార్క్ మండలాలుగా గుర్తింపు పొందాయి. 2014-21 మధ్యకాలంలో జిల్లాలో వివిధ పథకాల కింద 342చెక్డ్యాంలు, 338 ఊటకుంటలు, 656 వాననీటి సంరక్షణ కట్టడాలను నిర్మించారు. మిషన్కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులో పూడికతీసి కట్టలను వెడల్పు చేసి పటిష్టం చేశారు. తద్వారా వర్షపునీటిని పూర్తిస్థాయిలో ఒడిసి పట్టుకొని భూగర్భజలాలు పెరిగేందుకు దోహదంచేశాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కూడా సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు సహకరించింది. హరితహారం ద్వారా రాష్ట్రంలో 10శాతం పచ్చదనం పెరిగిందంటే మార్పును అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా పెద్ద ఎత్తున మిషన్భగీరథ పేరున ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చెరువులు, ట్యాంకులలో నీటిని నిల్వచేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల బోర్లు, బావులు రీఛార్జ్ అయ్యి భూగర్భజలాలు పెరిగిపోయాయి. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తవ్వడం కూడా భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడింది.
రెండు మీటర్లలో భూగర్భజలాలు
ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాల వల్ల 2021 నాటికి పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు జిల్లాలో కేవలం 2,3 మీటర్లలోపే భూగర్భజలాలు ఉంటున్నాయి. ఇప్పుడు 20మీటర్ల తర్వాత నీరుండే మండలాలు జిల్లాలో ఏవీ లేవు. అన్నీ 5నుంచి 10 మీటర్ల లోపు భూగర్భజలాలున్న మండలాలే ఉన్నాయి. ముఖ్యంగా భూత్పూర్, కోయిల్కొండ, మహమ్మదాబాద్, నవాబ్పేట వంటి మండలాల్లో 5మీటర్లలోపే నీళ్లుంటున్నాయి. 2014 నుంచి 2021 ఆగస్టు వరకు 6.60 మీటర్ల మేర భూగర్భజలాల పెరుగుదల నమోదయింది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు బోర్ల ద్వారా జిల్లాలో వానకాలం, యాసంగిలో వరిపంట రికార్డ్స్థాయిలో పండింది. సాగునీరు, తాగునీటితోపాటు ఎటు చూసినా ధాన్యపు రాశులతో పాలమూరు జిల్లా కళకళలాడుతున్నది. గతేడాది వానకాలంలో లక్షా 14,232 ఎకరాలలో వరి పండగా, యాసంగిలో 1,21,031 ఎకరాల్లో, ఈ వానకాలంలో 1,72,518 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ వానకాలంలో మహబూబ్నగర్ జిల్లాలోనే 4లక్షల 33వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. గతంలో జిల్లా నుంచి లక్షల సంఖ్యలో బతుకుదెరువుకు వెళ్లిన పరిస్థితులు.. నేడు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా నుంచి కూలీలు జిల్లాకు వలసొస్తున్నారు. దీంతో కరువు జిల్లాగా పేరొందిన పాలమూరు సిరుల జిల్లాగా మారింది.