దేవరకద్ర, డిసెంబర్ 4 : మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి బ్రహోత్సవాలు సోమవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను కనులపండువగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్నరాజమూరయ్య బ్రహ్మోత్సవాల ను తిలకించేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
400 ఏండ్ల కిందట వడ్డెపల్లి మండలం రాజోళి గ్రామశివారులోని తుంగభద్ర నదీతీరంలో వ్యాస మహర్షిచే ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు శాసనం తెలియజేస్తున్నది. కాలక్రమంలో విగ్రహం భూస్థాపితమైంది. అయితే కొన్నేండ్ల కిందట ఓ రైతు పొలంలో దున్నుతుండగా, నాగలికి విగ్రహం తగిలింది. అదేరోజు రాత్రి రైతు కలలో ఆంజనేయస్వామి కనిపించి ఎడ్లబండిపై తన విగ్రహాన్ని ఉంచి ఉత్తర దిశగా ప్రయాణించాలని, ఎక్కడైతే బండి విరుసు విరుగుతుందో ఆ ప్రదేశంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు రైతు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తుండగా, చిన్నరాజమూర్ గ్రామశివారులో బండి ఇరుసు విరిగింది. దీంతో ఆ స్థలంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆ రైతు వంశస్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్నారు.
చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను సోమవారం నుంచి 10వ తేదీవరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 5న పంచామృతాభిషేకం, అలంకరణ, హనుమవ్రతం, ధ్వజారోహణం, హోమం, రాత్రికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. 6న పంచామృతాభిషేకం, అలంకరణ, మహానైవేద్యం, శ్రీనివాస కల్యా ణం, రాత్రికి పల్లకీసేవ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 7న రాత్రి అశ్వవాహన సేవ, ప్రభోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 8న పౌర్ణమి సందర్భంగా పంచామృతాభిషేకం, మహాలంకరణ, రాత్రికి గజవాహనసేవ, రథోత్సవం, 9న అవభృదస్నానం, పంచామృతాభిషేకం, అలంకరణ, రాత్రికి పల్లకీసేవ, 10న పంచామృతాభిషేకం, పల్లకీసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అంజన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ అధికారులు దేవరకద్ర నుంచి చిన్నరాజమూర్ జాతర వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించనున్నారు. అలాగే అంజన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై భగవంతురెడ్డి తెలిపారు.