‘తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం చేరుకుందట!… అదేమిటో చెప్పుకోండి చూద్దాం’ అంటూ ‘లేఖ’పై చిన్నప్పుడు పొడుపు కథ వేసుకునేవాళ్లం. లేఖలు జన జీవనంలో భాగమయ్యేవి. అలాంటి ఉత్తరాలు, ఇన్లాండ్ లెటర్లు ఇప్పుడు ఈ-మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో, ఏ మూలకైనా క్షణాల్లో చేరిపోతున్నాయి. పోస్టుమ్యాన్ తెచ్చే ఉత్తరాల కోసం ఇప్పుడు ఎదురుచూపులు లేవు, ఆ మధురోహలు లేవు.
అయితే, ఈ లేఖలు రాయడానికి గల నియమ, నిబంధనలు, చాణక్యుడు తన అర్థశాస్త్రంలో విపులంగా వివరించాడు. తెలుగులో మొట్టమొదటిసారి లేఖను స్వీకరించిన వ్యక్తి సీపీ బ్రౌన్. ‘లేఖ ఒక హృదయం నుంచి సుఖదుఃఖాలను రెండో హృదయానికి అందించే దూత’ అని దోనేపూడి రాజారావు నిర్వచించారు. ఇక లేఖ సాహిత్యం విషయానికి వస్తే, సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక పరమైన అంశాలు కలిగిన లేఖలను లేఖా సాహిత్యంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత పరిధి దాటినప్పుడు, లేఖలకు సామాజిక విలువ ఏర్పడి, అవి మొత్తం సమాజానికి చెందుతాయి.
‘లిఖ్’ అనే ధాతువు నుంచి ‘లేఖ’ అనే పదం వచ్చింది. మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో వచ్చిన మొట్టమొదటి లేఖా సాహిత్యం ఆచార్య నాగార్జునుడు రాసిన ‘సుహ్రుల్లేఖ’. తన మిత్రుడైన యజ్ఞశ్రీ శాతకర్ణికి, ప్రాకృత భాషలో రాశారు. తర్వాత, సంస్కృత సాహిత్యంలో మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల తన భర్త దుష్యంతుడికి తామరాకుపై తన గోటితో లేఖ రాసింది. ఇది భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి లేఖా సాహిత్యం.
ఇక ప్రాచీన తెలుగు సాహిత్యంలో పింగళి సూరన ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’ కావ్యంలో ప్రభావతి, ప్రద్యుమ్నునికి రాసిన ఉత్తరం. తిరుపతి వేంకట కవుల వాగ్వాదం నుంచి ‘గీరతం అనే లేఖా సాహిత్యం’ వచ్చింది. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదరులు, ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటూ చక్కని సాహిత్యాన్ని ఉత్తరం ద్వారా మనకు తెలియజేశారు. గీరతం తెలుగు సాహిత్యంలోఒక విలక్షణమైన లేఖా సాహిత్యం.
1916లో త్రిపురనేని గోపీచంద్ ‘పోస్టు చేయని ఉత్తరాలు’, ‘ఉభయ కుశలోపరి’ అనే సాహిత్య లేఖలు రచించారు. వీటిల్లో భౌతిక-ఆధ్యాత్మికవాద సమన్వయమైన సాహిత్యం చోటుచేసుకుంది. వారి ఉత్తరం నుంచి ఒక చిన్న ఉదాహరణ. ‘కవి మేధా సముద్రం నుంచి పరంపరగా పొంగి పొరలివచ్చు అభిప్రాయ వీచికలకు, సంప్రదాయాలని చెప్పి చెలియకట్ట ఏర్పరచడం సబబు కాదు’ అంటూ కవి స్వేచ్ఛగా తన భావాన్ని తెలియజెప్పాలని స్పష్టంగా సూచించారు. ఇక ‘సంజీవ్ దేవ్’ లేఖా సాహిత్యం మనకు చిర పరిచితమే!. ఈయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్నది. ‘పోస్టు చేసిన ఉత్తరాలు’ అనే 50 లేఖల సంపుటిలో మానవ జీవన కోణాలు, ఆప్యాయతలు, అనురాగాలు అనే అంశాలు ఇందులో ఉన్నాయి.
ఇక ప్రముఖ కవులు, రచయితలైన గుంటూరు శేషేంద్ర శర్మ ‘ప్రేమలేఖలు’, మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ‘దూరం’, బోయి భీమన్న రాసిన ‘జానపదుని జాబులు’, మిత్తింటి మందేశ్వర రావు ‘లేఖా ప్రబంధం’, చలం రాసిన ‘ప్రేమలేఖలు’, కనుపర్తి వరలక్ష్మమ్మ ‘శారద లేఖలు’, తిలక్ రాసిన ‘పోస్టుమ్యాన్’, కే.ఎల్.నరసింహారావు రాసిన ‘నాన్నకు జాబులు’.. ఇలా ప్రసిద్ధ కవులు లేఖా సాహిత్యం రాసి పాఠకులను అలరించారు.
ఇంతమంది ప్రముఖ రచయితల కలం నుంచి వెలువడిన లేఖా సాహిత్యంలో వారి మనోగత అభిప్రాయాలే కాక, సాహితీవేత్తల వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. భగవాన్ రమణ మహర్షి దినచర్య
గురించి, సూరి నాగమ్మ తన అన్నయ్యకు రాసిన ఉత్తరాలు ఎంతో విలువైన లేఖా సాహిత్య ప్రక్రియలు. ఇక ఈ లేఖా సాహిత్యం ఆధారంగా జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ అనే సినిమా తీశారు. ఒక తెలియని వ్యక్తికి రాసిన ప్రేమ లేఖ ద్వారా సినిమా కథంతా చాలా హాస్యంగా, రమ్యంగా నడిపించారు. కవితిలక తిరునగరి ప్రతి 15 రోజులకొక కార్డు ఉత్తరంలో తాను రాసిన ఒక కవిత, ఇటీవల గ్రంథాల్లో చదివిన చక్కని పద్యం, దానిలోని భావాన్ని, లేఖ ఎవరికి రాశారో, ఆ వ్యక్తికి/ కవికి అన్వయిస్తూ, మీ కలాన్ని ఆగనివ్వకండి కొనసాగించండి అంటూ ఎంతో స్ఫూర్తిదాయకంగా రాసేవారు. ఈ పోస్టు కార్డు లేఖా సాహిత్యం అందుకున్నవారిలో నేను కూడా ఉన్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇది నిజానికి లేఖ సాహిత్యంలో ఒక వినూత్న అధ్యాయం.
2022లో జ్యోతి వలభోజు సంపాదకురాలిగా ‘ప్రియమైన నీకు’ అనే 175 మంది రచయితల లేఖలను సంకలనం చేసి ప్రచురించారు. ఈ సంకలనం తెలుగు బుక్హౌజ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నది. ఈ లేఖల్లో బయటకు బహిర్గతం చేయలేని విషయాలు, స్నేహితులకు, భర్తకు, తల్లికీ, నమ్ముకున్న దేవుడికీ రాసిన ఉత్తరాలున్నాయి. నిజానికి మన ఉత్తరాలకు, సమాధానం వస్తుందని ఆశించకుండా, మనసులోని భావాలు పంచుకోవడం వల్ల మనలోని భారం తగ్గుతుంది. ఈ ప్రక్రియ లేఖా సాహిత్యంలో ఓ మైలురాయి అని చెప్పాలి. దీనిలో నేను నా స్నేహితురాలికి రాసిన ఉత్తరం కూడా ఉంది. అయినంపూడి శ్రీలక్ష్మి ‘కొత్త ప్రేమలోకం’ అనే 56 ఇతివృత్తాలతో లేఖాసాహిత్యం రాశారు. ఆఖరుగా విద్వాన్ మహాకాళి వెంకటేశ్వరరావు శతావధానులు. ఎన్నో శతకాలు, చారిత్రక నవలలు రాశారు. సాహిత్య విలువలతో కూడిన ఉత్తరాలు మాకు రాసేవారు. అందుకే పూల సుగంధం దారానికి అంటినట్టుగా వారినుంచి నాకు కూడా కొత్త సాహిత్యం ఒంట పట్టింది.
హైదరాబాద్ వివేకనగర్లో కొత్తగా ఇల్లు కట్టినప్పుడు మాకు ఆ ఇంటి అడ్రస్ గురించి ఉత్తరం రాస్తూ.. ‘అష్టోత్తర శతనామ దిష్టంబగు గృహము/ శ్రేష్టము వివేక నగరము వింసతి భాగ్యనగర్/ స్పష్టముగా వ్రాసి పంపుడు లేఖల్’ అంటూ పోస్టు కార్డు రాసి పంపించారు. అంటే ఇంటినెంబర్ 108, వివేకనగర్, భాగ్యనగర్-20 అని ఇంటి అడ్రస్ అన్న మాట. ఇలాగే తాను రాసిన వెంకటేశ్వర శతకం నుంచి పోస్టు కార్డు మీద మాకు రాసి, మాకు అర్థం చెప్పి కంఠస్థం చేయించేవారు.
ఇలా సాహిత్యపరమైన, కళాపరమైన లేఖలే కాక ఇతర అంశాలతో కూడిన లేఖల ద్వారా ఆనాటి భాష, సంస్కృతి, వారి భావాలు, ఈనాటి తరం వారు తెలుసుకునేందుకు ఈ లేఖా సాహిత్యం ఎంతో దోహదం చేస్తుంది. ఇదే లేఖా సాహిత్య పరమార్థం.
ఇటీవల పత్రికా సంపాదకులు సింగిల్ పేజీ కథలు, పోస్టు కార్డు మీద కథలు, కవితలు రాసి పంపమని అడుగుతున్నారు. ఇది లేఖ సాహిత్యంలో వస్తున్న కొత్త ఒరవడి. ఇలా సాహిత్యరంగంలో లేఖా సాహిత్యం గణనీయమైన పాత్ర పోషిస్తోందని చెప్పాలి.
– కేతవరపు రాజ్యశ్రీ 85001 21990