హిందూ మహాసముద్రపు నీలి తరంగాల ఒడిలో, ఆఫ్రికా ఖండపు ఆగ్నేయ తీరానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలో పచ్చని రత్నంలా తళుకులీనే చిన్న ద్వీప దేశం మారిషస్. కేవలం 2,040 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ దేశం, నేడు ప్రపంచపటంలో తెలుగు భాషా పరిరక్షణకు, సంస్కృతి పరిమళాలకు ఒక సజీవసాక్ష్యంగా నిలుస్తున్నది.
ఈ దేశంలో ఆంగ్లంతో పాటు తెలుగు భాషకు కూడా అధికారిక గుర్తింపు లభించడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ఈ చారిత్రక అద్భుతం వెనుక ఒక మహనీయుని జీవితకాల తపస్సు ఉన్నది. ఆయనే మారిషస్ తెలుగు జాతి అస్తిత్వానికి ప్రాణవాయువుగా నిలిచిన ‘సంజీవ నరసింహ అప్పడు‘. మారిషస్లో తెలుగు చరిత్ర కేవలం నిన్నమొన్నటిది కాదు. 1835లో, అప్పటి బ్రిటిష్ పాలనలో చెరకు తోటల్లో శ్రమించేందుకు ఆంధ్రదేశంలోని ‘కోరంగి’ రేవు నుంచి ముగ్గురు సామాన్య తెలుగు కూలీలు కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య ఓడెక్కారు. వారు తమ వెంట కేవలం శ్రమను మాత్రమే తీసుకెళ్లలేదు;
తమ అస్తిత్వానికి ప్రతీకలైన పలుగు, పారలతో పాటు గుండె పొరల్లో దాచుకున్న ‘పెద్ద బాలశిక్ష’, రామాయణ, మహాభారత గాథలను మోసుకెళ్లారు. పరాయి గడ్డపై, కటిక పేదరికంలో, బానిసత్వపు సంకెళ్ల మధ్య కూడా వారు తమ మాతృభాషను మర్చిపోలేదు. ఆనాడు వారు వేసిన ఆ పటిష్టమైన పునాదిపైనే నేడు అక్కడా తెలుగు వైభవం విరాజిల్లుతున్నది.
ఇటీవల తన భౌతికకాయాన్ని విడిచిపెట్టే వరకు అహర్నిశలూ తెలుగు భాషా వికాసానికే అంకితమైన అప్పడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక నడిచే గ్రంథాలయం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, జర్నలిస్టుగా, రేడియో వ్యాఖ్యాతగా, మారిషస్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలుగు విభాగం అధికారిగా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ముఖ్యం గా మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్లో తెలుగు విభాగాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వా త, మారిషస్లో తెలుగు బోధన ఒక శాస్త్రీయమైన, వ్యవస్థీకృతమైన రూపాన్ని సంతరించుకున్నది.
నేడు మారిషస్లో లక్షకు పైగా ఉన్న తెలుగు వారి కోసం సుమారు 300 పాఠశాలలు, 190 మంది అంకితభావం గల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారంటే, అది అప్పడు తన జీవితకాలమంతా చేసిన అవిశ్రాంత కృషి ఫలితమే. ప్రాథమిక తరగతుల్లో దాదాపు పది వేల మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారంటే, ఆ భాషా చైతన్యాన్ని రగిలించిన ఘనత పూర్తిగా ఆయనదే. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసుల సంకీర్తనలను ఆంగ్ల తాత్పర్యాలతో ప్రచురించి, తెలుగు సరిగా రాని యువతకు కూడా మన సాహిత్య మాధుర్యాన్ని రుచి చూపించారు. మాతృభూమిపై ఆయనకున్న మమకారం అచంచలం. ధర్మపురి నరసింహ శతకం, వేమన పద్యాలు మారిషస్ గడ్డపై ప్రతిధ్వనిస్తున్నాయంటే, అందులో అప్పడు సాహిత్య కృ షి మరువలేనిది. సంజీవ నరసింహ అప్పడు మరణం తెలు గు సాహిత్య లోకానికి, ము ఖ్యంగా ప్రవాస తెలుగు సమాజానికి తీరని లోటు. తన జా తిని, తన భాషను ప్రేమించిన ఒక నిఖార్సయున తెలుగువాడు భౌతికంగా మన మధ్య లేకపోయినా, మారిషస్లోని ప్రతి తెలుగు అక్షరంలో ఆయ న జీవించే ఉంటారు.
– రామకిష్టయ్య సంగనభట్ల 94405 95494