వార్త చదవకముందే ఒక చిన్న కార్టూన్ మనల్ని ఆలోచనలో పడేస్తే, అది సుభానీ గీతే అయి ఉంటుంది. భారీ వ్యాసాలు, గంటల కొద్దీ ప్రసంగాలు అవసరం లేకుండా సింగిల్ కాలమ్ బాక్స్లో సమాజాన్ని నిలబెట్టి ప్రశ్నించగల శక్తి కార్టూన్కు మాత్రమే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఆ శక్తిని గత 40 ఏండ్లుగా నిర్భయంగా చాటుతూ ప్రయాణం చేస్తున్న ఒకే ఒక్క తెలుగు కళాకారుడు సుభానీ.
సుభానీ కార్టూన్లలో కేవలం హాస్యం, వ్యంగ్యం మాత్రమే కాదు. ఆ నవ్వు వెనుక దాగి ఉన్న సామాజిక వాస్తవాలను శక్తివంతంగా చూపిస్తాయి. రాజకీయాలు, పరిపాలన, సామాజిక వైకల్యాలు, సామాన్యుల కష్టాలు అన్నీ ఆయన గీతల్లో జీవం పోసుకుంటాయి. క్యాప్షన్ అవసరం లేని కార్టూన్లే ఎక్కువగా గీయడం ఆయన శైలి. నాలుగు దశాబ్దాల పత్రికా ప్రయాణం. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూన్ ఎడిటర్గా పనిచేస్తున్న సుభానీ రోజువారీ కార్టూన్ కాలమ్ కౌంటర్ పాయింట్ ద్వారా రోజూ లక్షలాది పాఠకులకు నవ్వులు పంచుతూ, రాజకీయ నాయకులకు చురకలు వేస్తూ పలుకరిస్తారు.
ఏషియన్ ఏజ్ వంటి జాతీయ పత్రికలోనూ ఆయన కార్టూన్లు ప్రచురితమవుతున్నాయి. ఇప్పటివరకు 35,000కు పైగా కార్టూన్లు, 15,000కి పైగా ఇలస్ట్రేషన్లు, పెయింటింగ్స్ ఆయన గీశారు. వాటిలో కొన్ని ఎంపిక చేసి (440 కార్టూన్లు,40 క్యారికేచర్లు, 40 లైన్ డ్రాయింగ్స్) ఒక అందమైన ఆల్బమ్గా ‘40 టు ది పాయింట్’ పేరున ప్రచురించారు.
ప్రతిభకు వచ్చిన గౌరవం తన 40 ఏండ్ల కార్టూన్ జర్నీలో ఆయన చేసిన కృషికి ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు, కార్టూన్ జర్నలిజంలో ప్రతిభకు బాపు అవార్డు, తెలుగు యూనివర్సిటీ పురస్కారంతోపాటు గ్రీస్, జర్మనీ, బెల్జియం, జపాన్, చైనా వంటి దేశాల్లో ఆయన కార్టూన్లు అంతర్జాతీయ కార్టూన్ ప్రదర్శనలకు ఎంపికై ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్టుల ప్రశంసలు పొందాయి.
సుభానీ కాలేజీలో చదువుతున్నపుడే పలు వారపత్రికల్లో సోషల్ కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. ఆ రోజుల్లోనే ప్రఖ్యాత కార్టూనిస్ట్ బాపు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సుభానీ జీవితానికి దిశానిర్దేశం చేసింది. సరళమైన గీత, ఘాటైన వ్యంగ్యం ఆయన గీతల్లో అతిశయోక్తి ఉండదు. మెత్తని మాటలతో సున్నితంగా చెణుకులు ఉంటాయి. రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువ మీద ఆయన వేసిన కార్టూన్లు హృదయాలను తాకుతాయి. 40 ఏండ్ల క్రితం ఆయన గీతల్లో ఉన్న చైతన్యం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. శైలి మారలేదు. బ్రష్ వాడినా, నిబ్ వాడినా ఆయన రేఖలు, హ్యూమర్ ఒక పద్ధతిగా కుదురుగా ఉండటం ఒక ప్రత్యేకత. కార్టూన్ పాత్రల ముఖాల్లో స్పష్టమైన భావాలు, మాటల కంటే బలమైన దృశ్యం…ఆ కార్టూన్ను చూడగానే ‘ఇది సుభానీ కార్టూనే కదా!’ అనిపిస్తుంది.
హైదరాబాద్ నగర చరిత్ర, కల్చర్ సుభానీ కళలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. హైదరాబాద్లో 18వ శతాబ్దం నాటి ఆసఫ్జాహీ నిజామ్లు నిర్మించిన విశిష్ట వారసత్వానికి ప్రతీకలు. మొఘల్, పర్షియన్, యూరోపియన్ శిల్పశైలుల సమ్మేళనంగా చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, కింగ్ కోఠి వంటి అపురూప కట్టడాలు సుభానీ రేఖల్లో కొత్త సొగసులు దిద్దుకొని ‘ఆదాబ్ హైదరాబాద్’ పేరున ప్రత్యేక కార్టూన్ బుక్తో పాటు జేఎన్టీయూలో వాటి ఒరిజినల్ స్కెచ్లతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. అవి కళా ప్రపంచంలో విశేష గుర్తింపు పొందాయి.
ఆయన ఒక కార్టూనిస్ట్ మాత్రమే కాదు. రాజకీయాలను సామాజిక ఆర్థిక పరిణామాల రేఖల్లో బంధించిన చరిత్రకారుడు. ఈ దేశ రాజకీయాలు, సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలంటే పుస్తకం తప్పక చూడాలి. అవి చిరునవ్వుతో మొదలై ఆలోచనతో ముగుస్తాయి. కార్టూనిస్టు కావాలనుకునే నవతరానికి ఈ To The Point బుక్ ఒక దిక్సూచి!
కాపీలకు: సుభానీ 9247458337
– శ్యాంమోహన్ 9440595858