విగ్రహారాధనకు సంబంధం లేని ఆదివాసీ ప్రజల చెట్లు చేమల ఆరాధన పద్ధతులూ, కుల వివక్షను తొలగించిన సంస్కరణవాద హిందూ మతాచారాలు, బుద్ధుని శాంతితత్వాన్ని కలగలిపిన మూడు మతాల అద్భుత సంగమాన్ని మనం ఒడిశాలోని పూరి జగన్నాథ పూజా విధానంలో చూడవచ్చు. మానవ చరిత్రలో విభిన్నమైన మూడు మతాలు శాంతిపూర్వకంగా పాలునీళ్లలా సమ్మేళనమై జన జీవనంలో భాగమై, ఇప్పటికీ ఆ సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తున్న ఏకైక ఉదాహరణ- పూరి జగన్నాథ్ ఆరాధనా విధానాలు.
వేదాలను, యజ్ఞయాగాలను అంగీకరించని బుద్ధుడు హిందువుల ఆరాధ్యదైవమైన విష్ణువు 9వ అవతారంగా హిందూమతంలో స్థానం పొందడమేగాక, ఇక్కడే బౌద్ధం హిందూమతంలో విలీనమైపోయింది. తద్వారా హిందూ మతంలోని కుల వివక్షలను, ఆదివాసుల పట్ల చిన్నచూపును తొలగించి, దేవుని పట్ల భక్తికి కులం, జాతి, మతాలు అడ్డుగోడలు కావనే ఆ కాలం నాటి భక్తి ఉద్యమాల లక్ష్యాన్ని నెరవేర్చింది.
క్రీస్తుశకం 12వ శతాబ్దంలో పూరిలో పుట్టిన ప్రఖ్యాత సంస్కృత కవి జయదేవుడు రాసిన గీతగోవిందం, బౌద్ధ హిందూ మతాల సంయోగానికి అద్దం పడుతుంది. యావత్ భారతదేశాన్ని కృష్ణ భక్తి ఉద్యమంలో ఉర్రుతలూగించిన ఈ సంస్కృత గీతంలో బుద్ధుని విష్ణువు 9వ అవతారంగా కీర్తిస్తాడు. వేదాలను నిందించి, శ్రుతులకు విరుద్ధంగా జంతు బలులను నిరాకరించిన బుద్ధుడు కేశవుడేనని ఇలా భజిస్తాడు.
నిన్దతి యజ్ఞ విధేరహహ శ్రుతిజాతం,
సదయ హృదయదర్శిత పశుఘాతం,
కేశవా ధృత బుద్ధ శరీరా, జయ జగదీశ హరే.
క్రీస్తుశకం 14వ శతాబ్దంలో వైష్ణవ భక్తి ఉద్యమ ప్రముఖ గురువు చైతన్య ప్రభువు బెంగాల్ నుంచి పూరికి తన నివాసాన్ని మార్చి అక్కడే చనిపోయేంతవరకు ఉన్నాడు. ఈ మూడు విభిన్న మతాల విచిత్ర సంగమం ఎలా సాధ్యమైనదో తెలియజేసే గాథ ఆసక్తికరంగా ఉంటుంది. ఆధునిక ఒడిశా నిర్మాతల్లో ఒకరైన పండిత నీలకంఠ దాస్ పూరిజగన్నాథ ఆరాధనా పద్ధతుల గురించి వ్యాఖ్యానిస్తూ హిందూ, బౌద్ధ మతాలు పరస్పరం సమన్వయంతో సమ్మిశ్రితం కావడం బహుశా ప్రపంచ మతాల పరిణామక్రమంలో మత సామరస్యానికి, సమ్మేళనానికి గొప్ప ప్రతీక అని అన్నారు. మహావిష్ణువు బుద్ధునిగా ఎలా అవతరించాడో పద్మ పురాణంలో వివరించడాన్ని పండిత నీలకంఠదాస్ తన రచనల్లో విశ్లేషించారు.
ఒడిశా అడవుల్లోని సవర ఆదివాసీలు చెట్టు బోదెలను తమ దేవతగా పూజలు చేస్తారు. మాళవ దేశ రాజు ఇంద్రద్యుమ్నుడు విష్ణు భక్తుడు. అతనికి కలలో విష్ణువు కనిపించి తనను బుద్ధావతారంలో సవర ఆదివాసీలు పూజిస్తున్నారనీ చెప్తాడు. సవరలు పూజించే బుద్ధదేవుని కనుగొనేందుకు రాజు తన మంత్రి విద్యాపతిని పంపుతాడు. అడవిలో సవరలు తమ పూజా విధానాన్ని గోప్యంగాత ఉంచడం వల్ల విద్యాపతి వాటిని కనుగోలేకపోతాడు. అతను ఆదివాసీలతో కొన్నేండ్లు సహజీవనం చేసి వారి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. వారి విశ్వాసం చూరగొన్న తర్వాత అతను సవరలు పూజించే బుద్ధావతార విష్ణు దేవతను తెలుసుకుంటాడు. రాజుకు విషయం తెలిసి అక్కడే మందిరాన్ని నిర్మిస్తాడు.
అదే పూరి జగన్నాథ ఆలయం. ఇక్కడ నివసించే సవర ఆదివాసీలను జగన్నాథుని బంధువులుగా భావిస్తారు. వారిని దైత్యులని పిలుస్తారు. బ్రాహ్మణ విద్యాపతికి అతని సవర భార్యకు పుట్టిన వంశజులు ఇక్కడే ఉంటారు. వారిని పాటి బ్రాహ్మణులంటారు. వైదిక భక్తి ఉద్యమానికి పూర్వం ఇక్కడ బౌద్ధ, జైన మతాలు కూడా ప్రాచుర్యంలో ఉండేవి. బుద్ధుని దేవునిగా భావించి విగ్రహారాధనను అంగీకరించే మహాయాన బౌద్ధ ప్రచారకుడైన నాగార్జునాచార్యుడు క్రీస్తుశకం 3వ శతాబ్దంలో పూరికి వచ్చి ఇక్కడి విగ్రహారాధనకు వ్యతిరేకులైన హీనయాన బౌద్ధ అనుయాయులను మహాయాన బౌద్ధ అనుయాయులుగా మార్చివేశాడు. ఆదివాసీ సవరలు తమ దేవతలను వృక్ష కాండం రూపంలో పూజించే ఆచారాలనూ, వైదిక, బౌద్ధ మతస్థులు విగ్రహారాధనను సమ్మిళితం చేసిన సాంస్కృతిక ఉద్యమ పర్యవసానమే పూరి జగన్నాథ ఆరాధనగా పరిణామం చెందింది.
దీన్ని మనం ఆదివాసీ నమ్మకాల, బౌద్ధ, హిందూ మతాల సమ్మేళనంగా మాత్రమే కాకుండా, జైన పద్ధతుల సమ్మేళనంగా కూడా భావించవచ్చు. పూరి జగన్నాథ ఆరాధన ప్రాథమికంగా జైన ఆరాధన పద్ధతులే అంటూ పండిత నీలకంఠ దాస్ ఇందుకు ఉదాహరణగా జైనులు తమ తీర్థంకరులను నాథ్ పేరున పిలుస్తారని పేర్కొన్నారు.
పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. దేవుళ్లను కొయ్య మానుతో చేసి పూజిస్తారు. ఇవి సాధారణ దేవతా విగ్రహాలకు మల్లే కాళ్లు, చేతులు, ఆయుధాలు, ఆభరణాలు కలిగి ఉండవు. చెట్టు మానులకు విశాలమైన కన్నులు దిద్ది ఉంటాయి. జగన్నాథుని చతుర్థ మూర్తిమంతునిగా కొలుస్తారు. సుదర్శనుడు, బలభద్రుడు, సుభద్ర, జగన్నాథులుగా పిలిచే ఈ నాలుగు కూడా చెట్టు మానుతో చేసినవే. ఆయా మూర్తులలో కొట్టొచ్చినట్టు కనిపించే విశాల నయనాలు తప్ప ఏ ఇతర శారీరక అంగాలు ఉండవు. ఆదివాసీ సవరల వంశజులే ఈ దేవుని ప్రతినిధులు, పూజారులు. ఇక్కడ పాలించిన రాజులు తాము జగన్నాథుని సేవకులుగానే భావిస్తూ అతని రథయాత్ర ముందు చీపురుతో ఊడ్చేవారు.
తమ మతమే అన్ని మతాల కన్నా మిన్న అనే ఈ కాలపు మత నాయకులకు అన్ని మతాలు సమన్వయంతో ఎలా సహజీవనం చేయవచ్చో పూరి జగన్నాథ ఆరాధన పరిణామం ఒక మేలుకొలుపు.
ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అధ్యయనం చేయడంలో, వాటి చారిత్రక, సామాజిక అంశాలను అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమవుతారు. ముఖ్యం గా హేతువాదులు, ఆస్తికులు, నాస్తికులు ఈ పొరపాట్లు చేస్తారు. వీటి అధ్యయనంలో కనిపించే గందరగోళానికి శాస్త్రీయ కారణాలు వివరిస్తూ ప్రపంచ మతాల, పౌరాణిక, కాల్పనిక ఆచారాల తులనాత్మక పరిశీలన చేసిన ప్రఖ్యాత రచయిత జోసెఫ్ క్యాంప్బెల్ ప్రపంచంలో సగం మంది తమ మత గ్రంథాల్లో, పౌరాణిక గాథల్లో వర్ణించిన విషయాలను ప్రతీకలుగా, ఉపమానాలుగా అర్థం చేసుకోకుండా వాటిని అక్షర సత్యాలుగా భావిస్తారు. మిగిలిన సగం మంది ఆయా వర్ణనలను యథాతథంగా అర్థం చేసుకొని అసత్యాలనీ, అభూత కల్పనలని తేలుస్తారు. అందువల్ల, మనం ఒక వైపు ప్రతీకలని, ఉపమానాలను పరమ సత్యాలని భావించే ఆస్తికులనూ, మరోవైపు మతాచారాల ప్రతీకలను తప్పుల తడకలుగా భావించే నాస్తికులను చూస్తామన్నాడు.
మన దేశంలో కూడా చాలామంది చరిత్రకారులు మన ప్రాచీన పౌరాణిక, కాల్పనిక సాహిత్యాన్ని సరైన అవగాహన లేకుండా పుక్కిటి పురాణాలుగా కొట్టిపడేస్తారు. అంతేకాకుండా, దేవీ దేవతల అవతారాల గురించి, వారి ఆరాధన పద్ధతుల పుట్టు పూర్వోత్తరాల గురించి అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒకే సాహిత్య కథనంపై ఆధారపడకుండా అనేక ఇతర ప్రాచీన సాహిత్యాలను కూడా ఒకదానితో మరొకటి సరిచేసుకొని అధ్యయనం చేయాలి.
మన దేశంలో క్రీస్తుశకం 10వ శతాబ్దంలో మహమ్మద్ గజనితో పాటు పర్యటించిన ఇరాన్కు చెందిన ముస్లిం పండితుడు అల్ బెరూని సంస్కృత పౌరాణిక గ్రంథం విష్ణు ధమ్మాని అధ్యయనం చేసి, భారత దేశంలో బౌద్ధ మత ఆవిర్భావం గురించి అందులో పేర్కొన్న అంశాలను ఇలా వివరించాడు. విష్ణువు బుద్ధావతారం గురించి శౌనక ఋషికి చెప్తూ.. ‘కలియుగంలో జనులలో సద్విశ్వాసాన్ని వ్యాపింపజేయడానికి ధర్మపరాయణుడైన శుద్ధోదనుని కుమారునిగా బుద్ధుడిని పంపాను. అయితే, రక్తవర్ణ వస్ర్తాలు ధరించే అతని అనుయాయులు (బౌద్ధ శ్రమణులు) అతని బోధనలను వక్రీకరించి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తొలగిస్తారు. శూద్రులు బ్రాహ్మణులను అగౌరవ పరుస్తారు. వర్ణాశ్రమ వ్యవస్థ నశించిపోతుంది’ అని అంటాడు.
బౌద్ధ మత పుట్టుక గురించి అగ్ని పురాణంలో మరో కథనం ఉన్నది. ఒకానొక కాలంలో సురులకు, అసురులకు జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. దానవుల నుంచి తమను కాపాడమని వారు శివునితో మొర పెట్టుకోగా తాను కలియుగంలో శుద్ధోదనుని కుమారునిగా జన్మించి అసురులను బౌద్ధ అనుయాయులుగా మారుస్తాననీ, వారు వేదాలను తిరస్కరించి పాషండులుగా కలియుగాంతం వరకు జీవిస్తారని చెప్తాడు! అగ్ని పురాణంలో శివుడే బుద్ధునిగా అవతరించాడని చెప్పారు!
ఆనందేశి నాగరాజు