‘ఆచరణ నుంచి జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం కొత్త ఆచరణకు దారితీస్తుంది. ఆ కొత్త ఆచరణ మరింత కొత్త జ్ఞానానికి, మరింత మెరుగైన ఆచరణలకు దారులు వేస్తుంది’ అంటాడు మావో. జ్ఞానం, ఆచరణ ఒకదానికొకటి పునాది అయితే వాటికి ప్రేరణ మాత్రం సాహిత్యమే. మంచి సాహిత్యం సమాజ మార్పునకు ప్రేరణ ఇచ్చిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ప్రెంచి విప్లవం నుంచి మొదలు భారత జాతీయోద్యమం దాకా, వసంత మేఘ గర్జన మొదలు మొన్నటికి మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం దాకా సాహిత్యం మార్పునకు ఒక ప్రేరణగా నిలిచింది.
ప్రతీరోజూ లక్షల మంది ప్రయాణం చేసే మన హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం వెనుక కూడా సాహిత్య ప్రేరణ ఉంది. అది ఇచ్చిన ఆచరణ ఉంది. అందులోంచి పుట్టిన జ్ఞానం ఉన్నది. అది తెలుసుకోవాలంటే ముందుగా మనం ఈ కథ చదువాలి.
‘హంగరీ సైనిక దళానికి చెందిన రైఫిల్ షూటర్ కరోలిక్స్ ఓ రోజు చేతిలో బాంబు పేలి కుడి చేతిని పోగొట్టుకున్నాడు. ఆ కారణంగా దళానికి దూరంగా ఉన్నాడు. ఏడాది వరకు ఎవరికీ కనిపించలేదు. ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, ఎక్కడికో పారిపోయాడని మరికొందరు అనుకున్నారు. చివరికి అతడిని మరిచిపోయారు. హటాత్తుగా ఒక రోజు ఒలింపిక్ పోటీలకు వచ్చిన అతడిని చూసి పోటీలు చూడటానికి వచ్చాడనుకున్నారు. కానీ అతడు ఆడటానికి వచ్చాడు. చేయి లేకుండా ఎలా ఆడుతాడని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, అతడు ఆడటమే కాకుండా బంగారు పతకాన్ని కూడా సాధించాడు. ఇంతకీ ఎవరికీ కనిపించకుండా ఏడాది పాటు అతను ఏం చేశాడంటే అవిశ్రాంతిగా షూటింగ్ సాధన చేశాడు..’
చదివారు గదా కథ. చిన్నదే కానీ ఇచ్చిన స్ఫూర్తి పెద్దది. ఈ కథ చెప్పింది ఒక టీచరూ కాదు. విన్నది పిల్లలూ కాదు. చెప్పింది హైదరాబాద్ మెట్రో మ్యాన్గా ప్రసిద్ధికెక్కిన ఒక ఐఆర్ఏఎస్ అధికారి. పేరు ఎన్వీఎస్ రెడ్డిగా పేరొందిన నల్లమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి. కథ విన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే గొప్ప పేరున్న ఇంజినీర్లు. భారతీయ రైల్వేలలో వివిధ పదవీ బాధ్యతలు నిర్వహించిన ఎన్వీఎస్ 2007 మేలో హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ సంస్థను స్థాపించి దాని వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్ మెట్రో అనగానే మనకు అందమైన ఆకాశసౌధం కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇంతవరకు ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు మూడు వరుసల స్తంభాలపై పోర్టల్ నిర్మాణాలుగా మాత్రమే జరిగాయి. కానీ, హైదరాబాద్లో మాత్రం పక్షి వెన్నెముక, రెక్కలను ప్రేరణగా తీసుకొని కేవలం నాజూకైన ఒంటి వరుస స్తంభాలపై నిర్మించారు. ఇది అంత సులువుగా జరుగలేదు. దశాబ్ద కాలంగా పిల్లర్ పిల్లర్కు ఒక అవాంతరాన్ని ఎదురైంది. దినదిన గండం దీర్ఘాయుష్షుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. ఎన్నో గండాలను దాటింది. చాలాసార్లు ఆగిపోయి మళ్లీ మొదలైంది. మేటాస్ సంక్షోభం, వైఎస్ అకాల మరణం లాంటి సమయాల్లో పూర్తిగా ఆగిపోయి మళ్లీ పురుడు పోసుకుంది. అలాంటి సందర్భంలో ప్రేరణ ఇచ్చింది, ధైర్యాన్ని నింపింది సాహిత్యం మాత్రమే అంటారు ఎన్వీఎస్. అది ఇచ్చిన స్ఫూర్తితోనే తన టీంను బలోపేతం చేసుకుని నిరాశ నిస్పృహలకు తావులేకుండా ముందుకువెళ్లారు.
రైల్వే మీద క్రిస్టియన్ ఊల్మార్స్ రాసిన ‘బ్లడ్, ఐరన్ అండ్ గోల్డ్’ ఒక గొప్ప పుస్తకం. ఆఫ్రికన్ అడవుల్లో రైలు నిర్మాణం జరుగుతున్నప్పుడు జరిగిన అనుభవాలను వివరిస్తూ రాసిన పుస్తకం అది. ఆఫ్రికాలో అవి కారండపడవులు. కనీసం వెలుతురు పడని, మానవ సంచారానికి అనుకూలంగా లేని దట్టమైన అడవులు. అలాంటి అడవుల్లో రైలు నిర్మాణం జరిగే కాలంలో వర్కర్లు క్యాంపులు నిర్మించుకొని రైలు మార్గాన్ని నిర్మించారు. క్యాంప్ ఆఫీసర్కు తన క్యాంపులో ఉన్న మనుషులు తెల్లవారే వరకు ఉంటారో ఉండరో కూడా తెలియదు. అసలు తాను ఉంటాడో ఉండడో కూడా తెలియదు. రాత్రికి రాత్రే ఏ జంతువో క్యాంపు మీద దాడి చేసి మనుషులను చంపేది. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా భయపడకుండా వేల మంది ప్రాణాలు కోల్పోయినా రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ అనుభవాలే ఈ పుస్తకం. దాన్ని చదివి, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడి రైల్వేలో కష్టాలను అధిగమించారు ఎన్వీఎస్ రెడ్డి.
స్వతహాగా ఎన్వీఎస్ ఒక సాహిత్య జీవి. చిన్నప్పటి నుంచి కవిత్వాన్ని ప్రేమించినవారు. తాను కూడా కవిత్వాన్ని రాసినవారు. కానీ కవిత్వం ఎక్కువగా మానవ సంబంధాలు, మార్పులు, ప్రగతిశీలత, భావోద్వేగాల మీద రాస్తారు. కానీ, తను మాత్రం మెట్రో నిర్మాణంలో తన అనుభవాలను తీసుకొని ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తూ కొత్త పంథాలో ‘మేఘపథం’ అనే కవితా సంకలనాన్ని కూడా రాశారు. ఊల్మార్స్ రాసిన ‘బ్లడ్, ఐరన్ అండ్ గోల్డ్’ తనకు ఆచరణ చూపినట్టే రేపు ప్రపంచంలో మరెక్కడైనా మెట్రో నిర్మాణం జరిగితే ఎన్వీఎస్ ‘మేఘపథం’ కూడా స్ఫూర్తిగా నిలిచి ఆచరణకు దారి తీస్తుంది. ఆ ఆచరణనే ఒక కొత్త జ్ఞానానికి ఊపిరిపోస్తుంది. ఆ జ్ఞానమే ఆధునిక సమాజానికి పునాది వేస్తుంది.
ఎన్వీఎస్ మాటల్లో చెప్పాలంటే.. “మెట్రోలో మేం చేశాం ఎన్నెన్నో అద్భుతాలు… ఒక్కొక్కటి వివరిస్తూ సంకలనం ప్రచురిస్తాం… సంచలనం సృష్టిస్తాం… ఇంజనీర్కు యాది కొచ్చు పోర్టల్ను పక్కనెట్టి, పక్షే మా ప్రేరణగా స్టేషన్లను సౌధాలను ఒకే వరుస కంబాలపై రోడ్డు మధ్య నిలబెట్టాం… ప్రపంచాన్ని ప్రథమంగా రస్తా పై ఏడడుగులు పైనేమో రెండు రైళ్లు… వేల కొద్ది జనం పట్టు అంబరాన అంతస్తులు చూస్తుంటే కళ్లు చెదురు, గొప్ప గొప్ప ఇంజినీర్లు విశ్వమంత ఒక్కటిగా హౌరా ఏ మబ్బురమని శభాషంటూ, సలామంటూ జై కొట్టెను మన ప్రతిభకు…’ ఇదే కదా సమాజానికి సాహిత్యం ఇచ్చే ఒక సరికొత్త జ్ఞానం. సాహిత్యం ఇచ్చిన స్ఫూర్తితో అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేయడమే కాకుండా మరో తరానికి స్ఫూర్తినిచ్చే విధంగా తన అనుభవాలను సంకలనం చేసి కవితలుగా అందించిన ఎన్వీఎస్ రెడ్డికి అభినందనలు.
పెద్దింటి అశోక్ కుమార్
94416 72428