Pawan Kalyan | ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఒక ప్రముఖ నాయకుడిని ప్రశ్నించినా లేదా తమ రాజకీయ అభిప్రాయాన్ని బలంగా వినిపించినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావడం సర్వసాధారణంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సమాచార హక్కు చట్టం (RTI Act) లోని సెక్షన్ 4.1(బి) ప్రకారం పారదర్శకత, ముందస్తు సమాచార వెల్లడి గురించి ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఆ ట్వీట్ల చివరలో ఆయన “జై తెలంగాణ” అని రాయడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యం కూడా తోడవడంతో ఈ వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్తో విరుచుకుపడ్డారు. అయితే ఈ సైబర్ దాడి మితిమీరడంతో రాహుల్ రామకృష్ణ మొదట ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను’, ‘నా వల్లనే ప్రాబ్లెమ్ అంటే వెళ్ళిపోతా మావా’ అంటూ బదులిచ్చినప్పటికీ.. చివరికి జనసైనికుల ఒత్తిడిని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ని ప్రశ్నించిన ట్వీట్లను రాహుల్ డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ వివాదంపై విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడినైనా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని కానీ సోషల్ మీడియాలో ఒక ప్రశ్న రాగానే దానికి సమాధానం ఇవ్వకుండా సదరు వ్యక్తిపై వ్యక్తిగత దాడులకు దిగడం ఒక ప్రమాదకరమైన ట్రెండ్గా మారిందని వారు అభిప్రాయపడ్డారు. అభిమానం అంధాభిమానంగా మారినప్పుడు, ఒక గుంపుగా ఏర్పడి అవతలి వ్యక్తిని మానసికంగా కుంగదీసేలా దాడి చేయడం వల్ల భవిష్యత్తులో ఎవరూ నోరు విప్పకూడదనే భయాన్ని సృష్టిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ లాంటి సెలబ్రిటీలే ఈ స్థాయి ట్రోలింగ్ను తట్టుకోలేక వెనక్కి తగ్గుతున్నారంటే.. సామన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతుందని ఊహించుకోవచ్చు. సోషల్ మీడియా అనేది ఆరోగ్యకరమైన చర్చలకు వేదిక కావాల్సింది పోయి, కేవలం ఒకరినొకరు అణచివేసే ఒక గుంపుల యుద్ధంలా మారిపోవడం సమాజంలో భావప్రకటన స్వేచ్ఛకు దెబ్బతీయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.