భాషా సాహిత్యాల అధ్యయనం, అధ్యాపనం, అనువాదం, సామాజికావసరాలలోంచి తెలంగాణ పదకోశాలు రూపొందుతున్నాయి. తద్వారా తెలంగాణ భాష వాడకాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటానికి కావాల్సిన శక్తియుక్తులను పొందడానికి ఈ పదకోశాలు ఎంతో ఉపయుక్తాలవుతా యి. తెలంగాణ భాష ప్రాచీనతను, వైభవాన్ని లోకానికి చాటిచెప్పటానికి పదకోశ కర్తలు కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావన రాజకీయ రూపం తీసుకున్న 2001 తర్వాత తెలంగాణ భాషకు సామాజిక గౌరవా న్ని, పత్రికా భాషగా కొనసాగుతున్న తెలుగుతో సమానత్వాన్ని సాధించటానికి పదకోశాలను నిర్మించడం మొదలైంది.
1986లో ఆచార్య రవ్వా శ్రీహరి కూర్చి న ‘నల్గొండ జిల్లా ప్రజల భాష’ నిఘంటు వు తెలంగాణ పదకోశాల వరుసలో మొదటిది. ‘తెలంగాణ మాండలికాలు-కావ్య ప్రయోగాలు’ తెలంగాణ భాష కావ్య ప్రయోగార్హత నిరూపణకు పనికొచ్చే విలువైన కోశం. అంతకుముందు తెలుగు అకాడమీ వారు ఉమ్మడి ఏపీలోని అన్ని జిల్లాలకు బులెటిన్లు వేసి, చివరలో కొన్ని పదాలను కోశంగా (Glossary) ఇవ్వడం కనిపిస్తుంది. ఆ తర్వాత వేముల పెరుమాళ్ళు ‘తెలంగాణ జాతీయాలు’ (1998) వెలువరించారు. ఈయన తన పరిశోధనలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి జాతీయాలు సేకరించారు. ఇది తెలంగాణ ప్రజల ఆలోచనా విధానాన్ని, వారి జీవన తాత్త్విక తను పట్టిచూపించే ప్రయత్నం చేసింది.
డాక్టర్ నలిమెల భాస్కర్ 2003లో వెలువరించిన తెలంగాణ పదకోశం నాటి తెలంగాణోద్యమ తక్షణ సంస్కృతికావసరాన్ని తీర్చడం లో భాగంగా వచ్చింది. ‘తెలంగాణలోని భాషా కోశాలూ ఉద్యమాలు చేస్తాయి’ అనే మాటకు మంచి ఉదాహరణ ఈ గ్రంథం. ఇది ఉద్యమ అవసరాలకు ఒక రెఫరెన్స్ గ్రం థంగా పనిచేసిందనడం అతిశయోక్తి కాదు.
ఈ గ్రంథానికి ముందు వెలువడిన ‘నల్గొండ జిల్లా ప్రజల భాష’, తెలంగాణ జాతీయాలు’ కోశాలు భాషా పరిశోధన, సంరక్షణ నిమిత్తం, వైవిధ్య నిరూపణ కోసం వెలువడిన తర్వాతి కాలంలో ఉద్యమ భాషావసరాన్నీ తీర్చాయి. నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశం ఉద్యమకాలంలోనే పురుడుపోసుకొని తెలంగాణ భాషా ఆత్మగౌరవ పతాకను నలుదిశలాఎగురవేసింది.
భూతం ముత్యాలు ‘మాండలీకం తెలంగాణ కులవృత్తి పదకోశం’ (2013), డాక్టర్ కాలువ మల్లయ్య ‘తెలంగాణ వాడుక భాషా పలుకులు, పలుకుబడుల గుమ్మి’ (2016), ముదిగంటి సుజాతారెడ్డి సేకరించి కూర్చిన ‘తెలంగాణ వ్యవహార పదకోశం’ (2018) తెలంగాణ భాషా పరిరక్షణ, కోశస్థం చేయాలనే వ్యక్తిగతమైన సామాజిక బాధ్యతతో చేసినవి. నలిమెల భాస్కర్ ‘తెలంగాణ దేశ్య పదాలు’(2017) తెలంగాణ భాషా ప్రాచీనతను ప్రతిష్టించే ప్రయత్నం చేసిన కోశం. కపిలవాయి లింగమూర్తి కూర్చిన ‘పామర సంస్కృతం’ (2016) పాలమూరు జిల్లా పదాలను పట్టిచూపించేది. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన ‘తెలంగాణ పదకోశము’ (2019) పైన పేర్కొన్న వాటన్నిటికంటే బృహత్తరమైనది.
తెలంగాణ పదకోశాలను నిర్మించేటప్పుడు కోశకర్తలు వేసుకున్న ప్రణాళికలు భిన్నమైనవి. ‘ఒకప్పటి తెలంగాణ ఉద్యమం వల్ల దొరికిన తెరపి నన్ను తెలంగాణ భాషకు దూరం చేస్తే, తెలుగు సాహిత్యంలోని ఇప్పటి స్థానీయత నన్ను మళ్లీ నేను కోల్పోయిన మాటకు దగ్గరచేసింది’ అని నలిమెల భాస్కర్ అన్నారు. ‘తెలంగాణ మాండలికానికి వార్తాపత్రికల్లో కానీ, గ్రంథాల్లో కానీ, పాఠ్యగ్రంథాల్లో కానీ, ప్రసార మాధ్యమాల్లో కానీ స్థానం లభించలేదు..’ అంటూ కాలువ మల్లయ్య కూర్చిన ‘తెలంగాణ పదాల గుమ్మి’కి ముందుమాట రాసిన ఆచార్య రవ్వా శ్రీహరి అభిప్రాయపడ్డారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘తెలంగాణ పదకోశము’ కోసం తెలుగులో వచ్చిన అనేక పదకోశాల నుంచి ‘తెలంగాణ’ పదాలను సేకరించారు. ముఖ్యంగా వృత్తి పదకోశాల్లోని ప్రాంతీయ పదాలను, దినపత్రికల్లో వచ్చిన పదాలను, వ్యక్తులు, భాషా పరిరక్షకులు పంపించిన పదాలను సేకరించారు.
జానపద గిరిజన విజ్ఞానపీఠం బహుముఖాంశాల పేరిట సేకరించిన అనేక సాంకేతిక పదాలను తీసుకున్నారు. అంతేకాకుండా తెలంగా ణ ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని మండలాలను క్షేత్ర పర్యటనకు ఎన్నుకున్నారు. ఆయా క్షేత్రా లకు పద సేకర్తలను పంపించి, భాషా వ్యవహర్తల నుంచి పదాలను సేకరించారు.
సేకరించిన పదాల్లో దొర్లిన ఎన్నో పునరుక్తులను అనేక వడబోతల ద్వారా తొలగించి ‘తెలంగాణ పదకోశము’గా వెలువరించామని సంపాదకులు చెప్పుకొన్నారు. ఇప్పటివరకు వెలువడిన తెలంగాణ పదకోశాల్లో ఇది మాత్రమే ప్రభుత్వ సంస్థ కేంద్రంగా సాగింది.
ఇప్పటివరకు వెలువడిన ఏ తెలంగాణ పదకోశానికైనా ప్రజల తక్షణావసరాలను తీర్చడమే మొదటి లక్ష్యంగా ఉండింది. భాషాకోశాలు విద్యాత్మక అవసరాల కోసం నిర్మాణమైన చరిత్రను చూశాం కానీ, ఉద్యమ అవసరాల కోసం, ముఖ్యంగా భాషాముఖంగా ఆత్మగౌరవ ప్రకటన కోసం వెలువడిన సందర్భాలు తెలంగాణ విషయంలోనే జరిగి ఉండవచ్చు.
ఈ కోశకర్తలు ఎవరికివారు స్వీయ ప్రణాళికలతో పదకోశాలను కూర్చడంలో స్వీయ పరిమితులు ఉండటం సహజం. నలిమెల భాస్కర్ను మినహాయిస్తే మిగతా కోశకర్తలందరూ ప్రాథమికంగా సాహితీవేత్తలు. తమ భాష పై, జీవితంపై, సంస్కృతిపై ఉన్న ప్రేమాభిమానాలే వారు ఈ పనిచేయడానికి పురిగొల్పింది.
పదకోశ శీర్షికలు తెలంగాణ మొత్తానికి ప్రాతినిధ్యం ఇస్తున్నట్టున్నా ఎన్నో పరిమితులున్నాయి. తెలంగాణ తెలుగు భాషను ప్రామాణీకరించుకోవాలనే తపన పదకోశ నిర్మాణాల్లో అడుగడుగునా కనిపిస్తున్నది. కోశకర్తలు వేసుకున్న స్వీయ ప్రణాళికల వల్ల ఇతరుల కోశాల్లోవి చాలా పదాలు పునరుక్తమయ్యే అవకాశం ఉంటుంది. అకారాది ఆరోపాలను అక్కడక్కడా ఎన్నుకొని తులనాత్మకంగా పరిశీలిస్తే చాలా పదజాలం పునరుక్తమైనట్టుగా స్థూలదృష్టికి వచ్చింది. ఇటువంటి పునరుక్తులు లేకుండా చేయాలంటే ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళికతో, నిఘం టు నిర్మాణంలో శిక్షణ పొందిన పద సేకర్తలు శాస్త్రీయంగా పదసేకరణ పద్ధతులను అనుసరించి చేసిన పదాలు, వాటి ఆరోపాది పద్ధతులతో, ఆకరాల వివరాలతో సామూహిక కోశ నిర్మాణాలను చేపట్టాల్సి ఉన్నది. వీటికి గల శాసన, తాళపత్ర, సాహిత్య రచనాదుల్లో చేసిన ప్రయోగాలను, వాటి అర్థ భేదాలకు, అర్థచ్ఛాయలకు సంబంధించిన వివరాలతోనూ, ఆధునిక సామాజికాది రచనల్లోని వినియోగ సందర్భాల్లో ఉన్న ప్రస్తావనలకు అనేక నిఘంటువులను విడివిడిగా కూర్చాల్సి ఉంది. ఇవ న్నీ సమగ్ర తెలంగాణ నిఘంటువులో భాగమవుతాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంచగలిగిననాడు భాషా పరిరక్షణ సంపూర్ణతవైపు సామూహిక అడుగులు పడుతాయి.
డాక్టర్ ఎస్.చంద్రయ్య, 99637 09032
(వ్యాసకర్త: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ , నెల్లూరు; రీసెర్చ్ అసోసియేట్)