పాఠశాల అంటే విద్యార్థులను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేస్తూ వారిని పరీక్షలకు సిద్ధం చేసే యాంత్రిక సంస్థ కాదు. అన్వేషణ, సేకరణ, చర్చ, నైతిక విచక్షణ జ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలను అందించి సరైన మార్గదర్శనం చేసే మహత్తర వేదిక. అలాంటిదే జక్కాపూర్ ప్రభుత్వ పాఠశాల.
బాలల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది బాల సాహిత్యం. బాలల చేత కథలు, కవిత లు, గేయాలు రాయిస్తూ బాలల సృజనాత్మకతకు అక్షరరూపం కల్పించి సాహితీ లోకానికి పరిచయం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య.
సాహిత్యానికి సంబంధించి జక్కాపూర్ ఉన్నత పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకు కారణం అక్కడి విద్యార్థులు కథలు, కవితలు, చిత్రలేఖనం వంటి సాహిత్య విషయాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు.
2019 మార్చిలో ఈ పాఠశాల విద్యార్థులు రాసిన 32 కథలతో ‘జక్కాపూర్ బడి పిల్లల కథ లు’ పుస్తకం వేశారు. ఇందులో హైదరాబాద్ మంచిపుస్తకం ద్వారా బహుమతి పొందిన ఆరు కథలున్నాయి. ఈ పుస్తకం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ప్రముఖ బాల సాహిత్యవేత్తల ప్రశంసలు పొందిన ఈ పుస్తకానికి అమెరికాలో కూడా ఆదరణ లభించింది. మార్చి 2020లో విద్యార్థులు రాసిన 74 కవితలతో ‘మధుర పద్మాలు’ తీసుకువచ్చారు. ఇందులోని 53 కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. పలువురు బాల సాహితీవేత్తలు ఈ బడిని సందర్శించి సాహిత్య సమావేశాలు నిర్వహించి బాల కథకులకు సూచనలు అందించారు. 2022 అక్టోబర్లో ఈ పాఠశాల విద్యార్థులు వేసిన 120 బొమ్మలతో ‘జక్కాపూర్ జక్కనలు’ అనే 52 పేజీల రంగుల బొమ్మల పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ చిత్రాలు అన్ని పత్రికల్లో ప్రచురించినవి కావడం విశేషం. ఈ మూడు పుస్తకాలకు భైతి దుర్గయ్య సంపాదకులు.
ఈ పాఠశాల విద్యార్థులు రాసిన 58 కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇందులో చాలా కథలు రాష్ట్ర, జాతీయస్థాయిలో బహుమతులు కూడా పొందాయి. ఈ విద్యార్థులు కథలకు తగిన బొమ్మలు వేస్తారు. బొమ్మలకు తగిన కథలు కూడా రాస్తారు. కథల బడిగా ప్రశంసలు పొందుతున్న జక్కాపూర్ పాఠశాల నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని ఆశిద్దాం.
– వేల్పుల రాజు, 97019 33704