తెలుగు సాహిత్యంలో వచ్చిన కవితా ప్రక్రియల గురించి ఆలోచించినపుడు ఇతర భాషల నుంచి వచ్చిన గజళ్ళు, రుబాయిలు, హైకులు మొదలైనవి మినహా నిలదొక్కుకున్నవి తక్కువ. అలాగే తెలుగులో వచ్చిన ప్రక్రియలు నానీలు, రెక్కలు తప్ప మరేవీ అంతగా నిలదొక్కుకోలేదు. దీనికి కారణం తెలుగు కవులు ప్రక్రియలో ఉన్న సారం, తాత్త్వికత, గాఢత అర్థం చేసుకోకుండా కేవలం రూపాన్ని మాత్రమే అనుసరించి కవితా ప్రక్రియను అపరిపక్వంగా సృజించడమే అనవచ్చు.
తెలుగులో వచ్చిన అనేక కవితా ప్రక్రియలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినవే. చాలా ప్రక్రియలు వచ్చినట్టే తెలియదు. తాత్త్విక భూమిక లేని ఏ రచనా కాలానికి నిలబడలేదు. ఏ కవీ ఇది కాలానికి నిలబడుతుందని కవిత్వం రాయడు కానీ, పఠిత మనసులో నిలవాలని మాత్రం రాస్తారు.
నానీల విషయంలో ఇప్పుడు రాస్తున్న కవులు అవగాహనతో, అధ్యయనంతో రాస్తున్నట్టు వస్తున్న పుస్తకాలను చూస్తే తెలుస్తున్నది. అటువంటి కవయిత్రి లహరి. ఈమె తన జీవితానుభవాలను పొందికగా, పొదుపుగా అక్షరాలలో పొదిగింది. నానీల నిర్మాణం అవగతం చేసుకొని రాయడం వల్ల అవి brevityతో పాటు భావార్థాన్ని కూడా ఇముడ్చుకున్నాయి.
అన్నింటికీ చావొక్కటే/ మార్గమా..?
మరి లోకమంతా/ ఎప్పుడో ఖాళీ అవ్వాలే..!
గుడిసెలో/ కొలువైన సరస్వతి
లక్ష్మీ కటాక్షం లేక/ బడి మానేసింది.
కవిత ముగిసిన వెంటనే పఠిత హృదిలో కవిత మొదలవడం ఉత్తమ సృజన. అటువంటిదే పైన చెప్పిన నానీ. మనసును కదిలించడం, హృదయాన్ని చివుక్కుమనిపించడం చేయకపోతే ఆ కవిత ఫలవంతం కానట్టే.
మంచితనం/ బలహీనత కావద్దు
కాఠిన్యమూ/ రక్షణ కవచమే
మా పాత టీవీ/ నాన్న బహుమతి
తీయలేను/ పెట్టుకోలేను.
ఒక దృశ్యాన్ని హృద్యంగా రూపుకట్టిన నానీ ఇది. ఇటువంటి భావసాదృశ్యాలు చాలా వచ్చినయి. వ్యక్తీకరణలో నవ్యత, వస్తువును తీసుకోవడంలో నిపుణత మాత్రమే ప్రక్రియను నిలబెడుతుంది. ఈ నానీలో క్లుప్తత, చిన్నచిన్న పదాల్లో కూర్చిన నాన్న మీద ప్రేమ వల్ల ఈ నానీ వెలిగింది.లహరి నానీల నాన్న ఎన్.గోపీ గారి పుత్రిక. వాక్యాన్ని ఒడుపుగా వాడటంలో సిద్ధహస్తుడైన గోపీ గారి వారసత్వాన్ని లహరి ఈ నానీల్లో చాలావరకు కొనసాగించింది. అన్ని నానీలు అదే కాంతితో మెరవడం ఎవరికీ సాధ్యం కాదు. కావలసినదల్లా…
నానీల నాన్నను
చేరుకోవాలా?
అధ్యయనశీలత
ఒక్కటే దారి.
ఈ స్పృహ మాత్రమే కవిని మంచి కవిత్వదరులకు చేరుస్తుంది. నానీల తీరాన నిలిచి కవిత్వపు అలలతో కాళ్లు తడుపుకొంటున్న లహరిని కవితాంబుధిలోకి అడుగులు వేయమని కోరుతున్నాను.
పి.శ్రీనివాస్ గౌడ్
99494 29449