ప్రకృతి మాత మనకు దేవుడిచ్చిన వరం. పచ్చని తరులతో,నింగినంటే గిరులతో, గలగలపారే సెలయేర్లతో పరోపకారానికి ప్రతీకలా,పరమార్థంలా ఉంటుంది భూమాత.పోరాటాల పురిటి గడ్డ అయిన తెలంగాణలో మహిళల అస్తిత్వపు పోరాటాల ప్రతిరూపంగా జరుపుకొనే వేడుకలలో సమ్మక్కసారక్క జాతర, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. ప్రకృతిమాత ప్రతిరూపంగా జరుపుకొనే పండుగలలో బతుకమ్మ విలక్షణమైనది, విశిష్టమైనది. పెత్తరమావాస్య నుంచి ఆశ్వయుజ అష్టమి వరకు తొమ్మిదిరోజులు బతుకమ్మ ఆడుతారు. ఈ పండుగ వనితలకు ఆటవిడుపుగానే కాక మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవిగా ఉండటం విశేషం.
కాయకష్టం తెలియకుండా పల్లె ప్రజలు, కష్టజీవులు పాడుకు నే జానపదాల్లో, బతుకమ్మ పాటలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ పాట ల్లో మన పురాణ కథలు, కట్టుబాట్లు, సుద్దులు, పౌరాణిక కథలు, ఆ చార వ్యవహారాలూ, సం స్కృతి సంప్రదాయాలు, మన విధులు, కర్తవ్యాలు, విజ్ఞానం ఇలా తీరొక్క వి షయం అందంగా చెప్తా రు.
భార్యాభర్తలిద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటే శివపార్వతుల్లా, ఆదిదంపతులుగా ఉన్నారంటా రు. అంటే దంపతులు వేర్వేరు వ్యక్తులు కా దు, ఒకే స్వరూపం అని, అదే అర్ధనారీశ్వరరూపం అని, వాక్కు, అర్థంలా కలిసి ఉన్నారని అంటారు. అందుకే శివపార్వతులను ఆదిదంపతులుగా గౌరవించి పెళ్ళికి ముందు కన్యతో గౌరీ పూజ చేయిస్తూ, బతుకమ్మ అంటే గౌరమ్మ అని, గౌరమ్మను(పసుపుతో) చేసి, గౌరమ్మ పాటలు పాడతారు.
రావు రావు గౌరమ్మ ఉయ్యాలో…
మా ఇంటిదాకా ఉయ్యాలో…
రాగి చెంబుతోటి ఉయ్యాలో..
గంగ నీళ్ళు తెచ్చి ఉయ్యాలో…
కాంత నీ పాదాలు ఉయ్యాలో..
కడిగి తడి ఎత్తెదను ఉయ్యాలో…
ఇలా సాగుతుంది పాట. అలాగే ఇంకా గౌరమ్మ మీద పాటలు ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ… ఏమేమి కాయోప్పునే గౌరమ్మ ’ అని, ‘శ్రీ గౌరీ నీ పూజ ఉయ్యాలో చేయబూనితినమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో’ ’అని పాడుతుంటారు.
అలాగే సీతారామ కల్యాణం గురించి,
‘జనకు జనకునింట్ల ఉయ్యా లో
సత్య జనకునింట్ల ఉయ్యా లో’ అని,
‘రామరామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామా ఉయ్యాలో’ అంటూ
బతుకమ్మ గురించి
తెల్లతెల్లని గుళ్ళు ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో.
నల్లని నల్లగొండ ఉయ్యాలో
నరసింహుని గుళ్ళు ఉయ్యాలో’
అని దేవతల గురిం చి పాడతారు.
మకుటంగా ఉయ్యాలో అనే కాక ‘కోల్’ అని ‘గౌరమ్మ’ అని ‘చందమా మ’ అని ‘వలలో’ అని కూడా రకరకాలుగా పాడుతారు. బతుకమ్మ అం టే నే ప్రకృతిలోని పూలన్నీ గుర్తొస్తాయి. ఇలా చెట్లని, పూలను గురించి పాడే పాటలు కూడా చాల ఉన్నాయి.
ఇక చిన్నప్పటి నుండి అంతా వినేపాట, ‘ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమా మా’ అనే శివుని పాట. ఇక అందరికీ చిరపరిచితమైన పాట ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరి కిస్తే ఉయ్యాలో’ అనే పాట.కృష్ణుని గురించిన పాటలు కూడా చాలా ఉన్నాయి.
‘కస్తూరి కాలువల్లఉయ్యాలో కృష్ణుడు ఎదురాయే ఉయ్యాలో’ అని, ‘ఏ తల్లి గన్నాదో ఉయ్యాలో, మాతల్లి యశోద ఉయ్యాలో ’ అని ‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ’ అని అందరు దేవతలు మా వాడల్లనే ఉన్నారు అని, అన్ని దేవతలను పూజించే మన సంప్రదాయం గురించి పాడతారు.
ఇక ఇప్పటికీ పెళ్లికూతుర్ని సాగనంపేప్పుడు, అప్పగింతల గురించిన పాటలో,
‘చల్దన్నం పెట్టి సాదుకొండయ్యా కోల్,
పెరుగన్నం పెట్టి కోల్ పెంచుకొండయ్యా కోల్…’
అంటూ చెబుతారు. అంతే కాదు అత్తగారింట్లో పెళ్లయ్యాక వెళ్లేపడుచు నడుచుకోవాల్సిన విధం గురించి,
‘వాడలోని ఆడవాళ్లు కోల్ వదినా మరదళ్ళు కోల్; వాడ లోని మగవాళ్ళు కోల్ అన్నాదమ్ముళ్ల్లు కోల్ ; వాకిట్లో కురులిప్పి కోల్ ముడవబోకమ్మా కోల్’
అంటూ చెప్పే సుద్దులు హృదయానికి హత్తుకుంటాయి. ఇలా పాటలన్నీ పాడి గౌరమ్మను అత్తారింటికి సాగనంపుతూ అప్పగింతల పాట పాడతారు.
‘పోయి రా గౌరమ్మ పోయిరావమ్మ..
మళ్లొచ్చే యాడాది మళ్ళి రావమ్మా’అంటూ సాగనంపుతారు.
ఇలా మన ఆచార వ్యవహారాలూ, మనం ఉండాల్సిన తీరు తెన్నులూ, అత్తగారింటిలో నడుచుకోవాల్సిన తీ రు, మన ప్రవర్తన, నీతికథలు, పాపపుణ్యాలు సకలం చెప్పే ఆ నాటి పాటలను పరిరక్షించుకోవాల్సిన అవసరం, భావితరానికి అందించాల్సిన అవసరం ఉన్నది.
(అక్షరయాన్ సౌజన్యంతో)
నామని ,సుజనాదేవి
77993 05575