హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో (ఎన్టీఆర్ కళాప్రాంగణం) ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు కొలకలూరి పురస్కారాల ప్రదానోత్సవం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరవుతారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి.కిషన్రావు విశిష్ట అతిథిగా, కావలిలోని వీఎస్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు గౌరవ అతిథిగా, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆంగ్ల శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి సుమకిరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షత వహిస్తారు.
ఈ కార్యక్రమంలో పలు విభాగాల్లో పురస్కారాలు అందజేస్తారు. కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారానికి హుమయూన్ సంఘీర్ రచించిన ‘కామునికంత’, కేవీ మేఘనాథరెడ్డి రచించిన ‘కలుంకూరి గుట్ట’ ఎంపికయ్యాయి. కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి డా.దిలావర్ రచించిన ‘అడవి బతుకులు’, సింహప్రసాద్ రచించిన ‘నిర్మాల్యం’ ఎంపికయ్యాయి. కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారానికి డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచించిన ‘తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం’, వి.రాజా రామమోహనరావు రచించిన ‘నవలా హృదయం’ ఎంపికయ్యాయి. దీంతో పాటు ‘ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం: సామాజిక విశ్లేషణ’పై పరిశోధనలు చేసిన డా.గడ్డం తిరుపతమ్మ, ‘ఆచార్య కొలకలూరి నవలా సాహిత్యం: మానవతా దృక్పథం’పై పీహెచ్డీ చేసిన డా.దుగులూరి సురేఖను సన్మానిస్తారు. ఈ మేరకు ఆచార్యులు కె.ఆశాజ్యోతి జనార్దనం, కె.అనితా శ్రీకిరణ్
తెలిపారు.