(జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా…)
పద్దెనిమిదేళ్ల వయస్సులో
ప్రణయభావాలతో ఊహల్లో విహరించకుండా
వేదనాభరితమైన తన కవితాక్షరాలను
బాధల పలకపై దిద్దుకుంటూ..
‘ఎల్లలు లేని కవితాకాశంలో
ఎవరెవరి బాధలైనా రాస్తా,
క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా’ అంటూ
మెజారిటీ ప్రజల బాధలు, గాథలు ముడిసరుకుగా తీసుకొని
విశాల హృదయంలో రాయడం మొదలుపెట్టాడు అలిశెట్టి ప్రభాకర్!
‘తను శవమై…/ ఒకరికి వశమై…./
తనువు పుండై…/ ఒకరికి పండై../
ఎప్పుడూ ఎడారై…/ ఎందరికో ఒయాసిస్సై..’ అనీ
ఆరు పంక్తుల మినీ కవితలోనే
క్రియా పదం లేకుండా అసంపూర్తిగా వదిలేసి
అనంత బాధాకావ్యమైన వేశ్యా జీవితాన్ని
స్ఫురింపజేస్తూ సమాజం గుండెను కదిలించిన కవి అలిశెట్టి ప్రభాకర్!
చెమట బిందువునూ, కన్నీటి బొట్టునూ పరిశోధించి
బాధలకు పరిధి లేదని చెప్పిన పరిశోధక కవి అలిశెట్టి ప్రభాకర్!
సామాన్యుడి జీవిత వృత్తాంతం
ఎప్పుడూ కష్టాలు ఇమిడి ఉండే ఒక బిందువు
అతన్నాధారం చేసుకొని గీసుకునే
వృత్త వైశాల్యాలే సంపదలు సౌఖ్యాలు సౌధాలు – అని
చరిత్ర చెప్పని గణితాన్ని చెప్పిన గణిత కవి అలిశెట్టి ప్రభాకర్
‘నను తొలిచే బాధల ఉలే
నను మలిచే కవితా శిల్పం’ అని చెప్పి
‘శనివారం/ అదొక షోరూం’ అని మూడు పదాలతో,
‘మెడలు వంచి శ్రమించేవాడిని/
వరించనిదే గోల్డ్ మెడలు’ అని రెండు వాక్యాలతో,
‘సమిష్టి బాధల/ సుదీర్ఘ శ్వాసే/ ఒక/ ఊరేగింపు’
అని నాలుగు వాక్యాలతోనూ
పవర్ఫుల్గా మినీ కవితలు రాస్తూ,
వలపు బాధలు చెప్పకుండా
బాధితుల వగపు బాధలు చెప్తూ
‘సిద్ధాంతగ్రంథ సారమేదీ వడబోయకున్నా
సిద్ధార్థుడు వదిలివెళ్లిన ఈ రాజ్యమ్మీద’
‘ఎర్రపావురాలు’ కవితా సంపుటి మొదలుకొని
‘మరణం నా చివరి చరణం కాదు’ వరకూ
పేదా, నిరుపేదా, కార్మిక, శ్రమ జీవులపై
పెద్ద కవితలూ, దీర్ఘ కవితలూ రాసిన అలిశెట్టి ప్రభాకర్-
‘ఎన్నెన్ని / గాయపడిన ఉదయాల్ని/
సంకలనంగా మార్చినా ఎవరెవరి బాధామయగాథల్ని/
ఈ కలంతో జాలువార్చినా / మిత్రుడా/
నిరంతరం సూర్యుడే నా ముఖచిత్రం’ అని
చెప్పుకొన్న కవి రవి అలిశెట్టి ప్రభాకర్!
అలిశెట్టి ప్రభాకర్ మరణించినా
చిత్రలేఖన స్పష్టరేఖల స్వభావం,
కెమెరా కన్ను నిశితదృష్టీ కలగలిసిన
ఆ కలం సృష్టించిన వాడీ, వేడీ కవితలతో
ఇప్పటికీ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు!!
– పెన్సిల్ డ్రాయింగ్, కవిత: రఘువర్మ