అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని అన్నారు ప్రజాకవి కాళోజీ. అవును, అది అక్షరాలా నిజం. ఇక అక్షర రూపం దాల్చి లక్ష మెదళ్లను కదలించగల ఆ సిరాచుక్కే గీత రూపంగా కూడా మారగలిగితే, అనంతమైన శక్తిని తనలో నిక్షిప్తం చేసుకొని లక్ష మెదళ్లనే కాదు కోట్లాది మెదళ్లను కూడా కదిలించగలుగుతుంది. ఆ శక్తిని సక్రమంగా వినియోగించుకోగలిగితే అద్భుతాల సృష్టి సంభవమవుతుంది. ఇదే సత్యాన్ని ప్రపంచ చరిత్రలోని ప్రతి మలుపులో నిరూపించింది గీత సాహిత్యం. ప్రపంచంలోని ఏ ఉద్యమాన్ని పరిశీలించినా, దాని వెనుక ఆ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన గీత సాహిత్యం మనకు దర్శనమిస్తుంది.
భారత స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆ ఉద్యమానికి ఒక మంత్రంగా మారిన బంకించంద్ర విరచిత వందేమాతర గీతం, మహోద్యమ జ్వాలని ఆరనీయకుండా కాపాడింది. బ్రిటిష్ వాళ్ల గుండెల్లో భూకంపాల్ని సృష్టించింది. అంతేకాదు, తెల్లవాడి తుపాకి గుండ్లకు బలై నేలకొరుగుతున్న స్వాతంత్య్ర సమరయోధుల పెదాలపై పలికింది. చివరి శ్వాస వరకు వారికి తోడుగా నిలిచింది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు వందేమాతరమంటూ ప్రాణాల్ని వదిలారు. ఖుదీరాం బోస్, మదన్లాల్ ఢింగ్రా, కన్హయ్యలాల్ లాంటి విప్లవ వీరులెందరో ఉరికంబం ఎక్కేముందు వందేమాతరమని గర్జిస్తూ విప్లవకారులందరికీ స్ఫూర్తిదాతలుగా నిలిచారు.
ఉద్యమాన్ని అణచివేయాలని ఆ రోజుల్లో వందేమాతరమన్న ప్రతి ఒక్కరినీ బంధించింది బ్రిటిష్ ప్రభుత్వం. లాఠీలతో కొట్టించింది. కాల్పులు జరిపింది. అయినా స్వాతంత్య్రోద్యమం ఆగలేదు. అందుకు ప్రధాన కారణం వందేమాతర గీతం. అంతేకాదు, ఆ గీతంలోని తొలి చరణాలు, రానురాను భారత జాతి జీవనవిధానంలో అంతర్భాగమైపోయాయి. ఇద్దరు వ్యక్తులు వీధుల్లో తారసపడ్డా.. వందేమాతరం అంటూ పలకరించుకొనేవాళ్లు.
భారత స్వాతంత్య్ర సమరానికి ఊపిరిగా నిలిచి, ఆనాటి ఉద్యమకారులందరికీ ఒక తారకమంత్రంగా మారిన వందేమాతర గీతాన్ని 1875లో బంకించంద్ర చటర్జీ రాశారు. అదే ఏడాది బంగ దర్శన్ పత్రికలో అది ప్రచురితమైంది. ఆ పత్రికలోనే 1880-1881 మధ్యకాలంలో బంకించంద్ర రాసిన నవల ‘ఆనంద మఠ్’ ధారావాహికగా ప్రచురితమైంది. ఆ నవలలోని భవానందుడనే పాత్రతో వందేమాతరం గీతాన్ని పలికించారు చటర్జీ.
ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటాన్ని గమనిస్తే, 1942లో వంశీధర్ శుక్లా రచించిన ‘కదం కదం బడాయె జా’ అన్న గీతం ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాట యోధుల అడుగులో అడుగైంది. వారిలో స్ఫూర్తిని జనింపజేస్తూ తొలి భారత స్వతంత్ర (తాత్కాలిక) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దోహదపడింది. ఆ గీతంలోని ఉద్వేగ భావాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఎవరైనా ఆ గీతాన్ని ఆలపిస్తే వారిని రాజద్రోహ నేరం కింద జైల్లో పెట్టేవారు.
తెనుగునాట స్వాతంత్య్రోద్యమంపై పాటల ప్రభావాన్ని గమనిస్తే, ప్రజా పాటల త్యాగయ్యగా పేరుగాంచిన గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ గేయం స్వాతంత్య్ర సమరయోధుల్లో కొత్త ఉత్సాహానికి, ఆవేశానికి జీవం పోసింది. ఆ గేయ ప్రభావంతో ఆవేశపూరితులైన ఎందరో యువకులు స్వాతంత్య్ర సంగ్రామంలోకి దూకారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ల వెంకట రామారావు కలం నుంచి జాలువారిన ‘వీరులకు కాణాచిరా’ గీతం సాయుధ పోరాట యోధులకు స్ఫూర్తిగా నిలిచింది. బండి యాదగిరి రాసిన ‘బండెనుక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి, ఏ బండ్లో పోతవు కొడుకో నైజాం సర్కరోడా’ అన్న పాట జన బాహుళ్యంలో ఎంతగా ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన దాశరథి రచించిన ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నినుబోలు రాజు మాకెన్నడేని’ గీతం అందరూ ఎరిగినదే. నిజాం ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజాకవి కాళోజీ ‘నల్లగొండలో నాజీ శక్తుల నగ్న నృత్యమింకెన్నాళ్లు..’ అంటూ ప్రశ్నించారు. ప్రముఖ కవి సుద్దాల హనుమంతు రాసిన ‘పల్లెటూరి పిల్లగాడా పసుల గాసే మొనగాడా!’ పాట నిజాం పాలనలో పేదపిల్లల దీనస్థితిని వర్ణించింది.
తర్వాతి కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై పాటల ప్రభావం ఎంతగా ఉందనేది అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో తెలంగాణ అంతటా ప్రతిధ్వనించిన గద్దర్ గజ్జె కట్టి ఆడిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. వీర తెలంగాణమా!’ పాట విని ఆవేశపడని తెలంగాణ బిడ్డ ఉండడు. ఆయన రాసిన మరో పాట ‘అమ్మా తెలంగాణమా! ఆకలి కేకల గానమా!’ ఆ నాటి తెలంగాణ దైన్యస్థితికి దర్పణం పట్టింది. గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ పాట పాలకుల కుట్రల వల్ల పల్లెల్లో కులవృత్తులు ఎలా అడుగంటాయో కండ్లకు కడుతుంది. నందిని సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాలల్ల నా తెలంగాణ..’, అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ తదితర పాటలు తెలంగాణ నలుమూలలా ప్రతిధ్వనించాయి. రామగుండం మండలం మొర్మూరుకు చెందిన మల్లావజ్జల సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేను నీ చెలుక ఎడారి..’ పాట తెలంగాణ రైతుల కన్నీటి గాథకు దర్పణంగా నిలుస్తుంది. గూడ అంజయ్య అనగానే గుర్తుకొచ్చే పాట ‘ఊరు మనదిరా..’. తెలంగాణ పల్లెల్లో దోపిడీకి గురైన సబ్బండ వర్గాలను ఉర్రూతలూగించింది ఈ పాట. కవి జైరాజ్ కలం నుంచి వెలువడిన ‘వానమ్మా’ పాట తెలంగాణ పల్లెల దౌర్భాగ్యాన్ని వర్ణించింది.
ప్రపంచంలోని ఏ ఉద్యమ చరిత్ర చూసినా.. ఆ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తుంది గీత సాహిత్యం. పది పేజీల్లో వర్ణించలేని అంతులేని ఆవేశాన్ని, భావనను, ఆత్మీయతని, అద్భుత సందేశాన్ని గీతం లేదా పాట కేవలం నాలుగు చరణాల్లో వర్ణించగలగడమే అందుకు కారణం. భారతదేశ గొప్పదనాన్ని వర్ణించాలని సి.నారాయణరెడ్డిని ఎవరో అడగగా.. అంతులేని భారతదేశ గొప్పదనాన్ని వర్ణించడం గీతం ద్వారా మాత్రమే సాధ్యమని ఆయన చెప్పారట. చెప్పినట్టే.. ‘నా దేశం భగవద్గీత.. నా దేశం అగ్నిపునీత సీత.. నా దేశం కరుణాంత రంగ.. నాదేశం సంస్కార గంగ’ అంటూ నాలుగు చరణాల్లో దేశ గొప్పదనాన్ని వివరించారాయన. ఇది గీతానికున్న గొప్ప లక్షణం. అంతటి ఘనత ఉన్న గీతం మరుగునపడిపోకుండా కాపాడుకోవడమే మన తక్షణ కర్తవ్యం.
– బసవరాజు నరేందర్రావు 99085 16549