సరిగ్గా వందేండ్ల కిందట ఇదే రోజు ‘స్వరాజ్యరథం’ అనే స్వాతంత్య్రోద్యమ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1922 జూన్ 26న ఈ నాటకాన్ని నిషేధిస్తూ జీవో నెం.466 జారీ చేసింది. అనంతరం రచయిత సోమరాజు రామానుజరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రంగూన్ చేరుకొని రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. జీవితకాలం 38 ఏండ్లే అయినా వివిధ ప్రక్రియల్లో 62 రచనలు చేశారు.
సోమరాజు రామానుజరావు భద్రాచలం వాసి. సమీపంలోని దుమ్ముగూడెం తొలినాళ్లలో ఆయన కార్యక్షేత్రం. ఇక ‘స్వరాజ్యరథం’ విషయానికొస్తే ఇది ఐదు అంకాల పద్య నాటకం. దేవేంద్రుడు, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, మహాత్మాగాంధీ, మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ, అరవింద ఘోష్, భరతమాత, విక్టోరియారాణి, అనిబిసెంట్, పాంచాలి మరో నాలుగు సాధారణ పాత్రలతో సాగే ఈ నాటకం ఆద్యంతమూ స్వాతంత్య్రకాంక్ష, మత సామరస్యం, దేశభక్తి, శాంతి సామరస్యాలను ప్రబోధించింది. దేవతలు, స్వాతంత్య్రోద్యమకారుల సమ్మేళనంతో సంభాషణలు, సందర్భోచితమైన పద్యాలతో రచయిత నాటకాన్ని రక్తికట్టించారు.
ఈ నాటకం కంటే ముందే రచయిత ‘తిలకు రాయబారము’ అనే నాటిక ప్రకటించారు. అది విశేష ప్రేక్షకాదరణ పొందడంతో మరో మూడు అంకాలు విస్తరించి ‘స్వరాజ్య రథము’ను రూపొందించారు. ‘తిలకు రాయబారము’ రెండంకాల చిన్న నాటకం. రచయిత దుమ్ముగూడెంలో నెలకొల్పిన సొంత ప్రెస్ ఎస్.వేంకటేశ్వర అండ్ కంపెనీలో ‘తిలకు రాయబారము’ను ముద్రించారు.
అభినవ నాటక మాలిక ప్రచురణ సంస్థ. కాగా ఆ ప్రతులన్నీ అమ్ముడుపోవడంతో ‘తిలకు రాయబారము’ను విస్తరించి ‘స్వరాజ్య రథము’ను వెలువరించారు. ముద్రణ దశ నుంచే నిర్బంధాలను ఎదుర్కొన్నది ‘స్వరాజ్య రథము’. వివిధ ఆంక్షల నేపథ్యంలో రాతప్రతిని యథాతథంగా ముద్రించడానికి గుంటూరులోని చంద్రికా ప్రెస్ ముందుకురాలేదు.
దుమ్ముగూడెంలోని సోమరాజు రామానుజరావు సొంతప్రెస్ అంతకుముందే ‘తిలకు రాయబారము’ను ముద్రించిన ఫలితానికి ఆంక్షల కోరల్లో చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో‘స్వరాజ్య రథము’ ముద్రణకు ధనసహాయం చేసిన వారి పేర్లు సైతం ప్రకటించలేని దుస్థితి. గుంటూరుకు చెందిన ‘తిలకు నాటక సమాజం’ మాత్రం ధైర్యం చేసి ముందుకొచ్చింది. ‘ఈ నాటకం నేను రాసిన స్వరూపానికి, ముద్రింపబడిన స్వరూపమునకును పోలిక యెక్కడనూ లేదు. నా వ్రాతప్రతిని ముద్రించుటకు ముద్రాలయము వారు సర్కారు శాసన నిర్బంధమున వెనుదీయుట చేత దీనినీ స్వరూపము తోడ బయటకు తీసికొనివచ్చితిని’ అని రచయిత ముందుమాటలో పేర్కొన్నారు.
90 ఏండ్ల తర్వాత 2002 నాటి భద్రాద్రి ఉత్సవాల్లో ఈ నాటకం రెండో ముద్రణ వెలుగుచూసింది. అప్పటి ఖమ్మం కలెక్టర్ గిరిధర్ సహకారంతో, నేను నా శ్రీమతి నాగవాణి పరిష్కరణలో, రచయిత తాలూకు లభ్యమైన ఒకే ఒక ఫొటో ముఖచిత్రంగా పునర్ముద్రితమై అప్పటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుచే ఆవిష్కృతమైంది.
సోమరాజు రామానుజరావు అనగానే ‘రంగూన్రౌడీ’ నాటకాన్ని గుర్తుచేసుకుంటారు. 1934లో వచ్చిన ఆ నాటకాన్ని 1938లో హెచ్.ఎం.రెడ్డి ‘గృహలక్ష్మి’ పేరుతో చలనచిత్రంగా నిర్మించడం, నాటకం నేటికీ ప్రచారంలో ఉండటం అందుకు కారణం కావచ్చు. కానీ, సమకాలీన ప్రసిద్ధ రయితలకు ఏ మాత్రం తీసిపోని 30కి పైగా నాటకాలు, మరో 31 నవలలు, ఒక కథాసంకలనం సోమరాజు సాహిత్య విశ్వరూపం. పరిశోధకులు, అకాడమీలు, విశ్వవిద్యాలయాలు పాక్షికంగానే సోమరాజును దర్శించాయి. ఆయన 62 రచనల్లో ఇంతవరకు 27 మాత్రమే లభ్యమయ్యాయి.
నా మార్గదర్శకత్వంలో సునీత అనే విద్యార్థిని.. ‘సోమరాజు రామానుజరావు జీవితం- రచనలు’ అంశంపై పీహెచ్డీ పరిశోధన వ్యాసం సమర్పించింది. కేయూ ప్రొఫెసర్ బన్నా ఐలయ్య మార్గదర్శకత్వంలో ఒక ఎంఫిల్ ఈ మధ్యకాలంలోనే పూర్తయినట్టు తెలిసింది.
ఎప్పుడో 1990 దశకంలో ‘ఆంధ్రప్రభ’లో సాహితీ గవాక్షంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్రావు సంక్షిప్తంగా ‘స్వరాజ్య రథము’ను పరిచయం చేశారు. కొనసాగింపుగా నా పరిశోధనలో హైదరాబాద్ స్టేట్ ఆర్కైవ్స్లో పుస్తకం లభ్యం కావడం, పునర్ముద్రణకు నోచుకోవడం నేపథ్యంలో సోమరాజు నాటకాల్లో బాలుడి పాత్ర వేసిన, అప్పటికే 85 ఏండ్ల వృద్ధుడైన బైరెడ్డి ముసలి నాయుడు ఈ వ్యాసకర్తకు దుమ్ముగూడెం, భద్రాచలం వీధి వీధి తిరిగి విలువైన సమాచారం అందించాడు. సోమరాజు రామానుజరావు ఉన్న ఒక్క ఫొటోను ఆయన మనమడు ఇందుర్తి రామానుజరావు అందించాడు. ఆ తర్వాత మొదలి నాగభూషణ శర్మ, సంగిశెట్టి శ్రీనివాస్, విజయకుమార్జీ, సుబ్బరాజు తదితరులు ఆ మార్గంలో కొనసాగుతున్నారు.
లభించిన ఆధారాలను బట్టి తెలుగులో తొలి సంపూర్ణ స్వాతంత్య్రోద్యమ నాటకం ‘స్వరాజ్య రథము’. దామరాజు పుండరీకాక్షుడు రచించిన ‘పాంచాల పరాభవం’ తొలి స్వాతంత్య్రోద్యమ నాటకం అన్న వాదన కూడా ఉన్నది. ఏది ముందన్నది పరిశోధకులు తేల్చాలి.
‘ఈ నాటకం నేను రాసిన స్వరూపానికి, ముద్రింపబడిన స్వరూపమునకును పోలిక యెక్కడనూ లేదు. నా వ్రాతప్రతిని ముద్రించుటకు ముద్రాలయము వారు సర్కారు శాసన నిర్బంధమున వెనుదీయుట చేత దీనినీ స్వరూపము తోడ బయటకు తీసికొనివచ్చితిని’ అని రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. 90 ఏండ్ల తర్వాత 2002 నాటి భద్రాద్రి ఉత్సవాల్లో ఈ నాటకం రెండో ముద్రణ వెలుగుచూసింది.
– డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238