గోవర్ధన సుందర వరదాచారి. ఆయన పేరులోనే సౌందర్యం ఉంది. అది తన జీవితంలో భాషా సౌందర్యమయ్యింది. పదాలనే పరాగాల్ని పలకరిస్తూ, పులకరిస్తూ అక్షరాలకు పట్టం కట్టే ఆయన మేథకు వన్నెతెచ్చిన అద్భుత సౌందర్యమది. అనుక్షణం అక్షరాల్నే శ్వాసిస్తూ, జీవితాంతం అక్షరాలకు అనుసంధానమై జీవించాలని అడుగులు ముందుకేసిన అక్షర హాలికుడి శ్రమైక జీవన సౌందర్యమయ్యింది. ముచ్చటగా మూడే మాటలు మాట్లాడే ఆయన తరహాని 36మంది ఇష్టపడే రీతిలో మలచగలిగే అద్భుతమైన వ్యక్తిత్వ సౌందర్యమది.
ఓమంచి జర్నలిస్టు, భాషావేత్త, సంస్కారి జీఎస్ వరదాచారి. సమాజాన్ని కాచి వడపోసిన మేధా వి. భాషని పంచడంలో, పెంచడంలో, భాషను ప్రేమించేవారికి రకరకాల పాకాలను రుచి చూపించడంలో మహత్తరి. పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయ న.. అధ్యాపకుడిగా అనేకమందికి అక్షరభిక్ష పెట్టిన మహనీయుడు. అందరికీ తలలో నాలుకలా మెలిగే మంచి మిత్రు డు. వయసుతో సంబంధం లేకుండా అన్ని తరాలవారినీ, నా అనుకునే మనసున్న మనిషి.
వరదాచారి తెలుగు జర్నలిజం బోధనకు ఆద్యుడు. 1988 చివర్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో జర్నలిజం శాఖను స్థాపించిన తర్వాత తెలుగు విభాగానికి ఆయన మొదటి శాఖాధిపతిగా నియమితులయ్యారు. అటు జర్నలిజంలోనూ, ఇటు భాషలోనూ మంచి పట్టున్న వరదాచారి బోధన.. గ్రామీణ ప్రాంతాల్లో విలేఖరులుగా పనిచేస్తున్న ఎంతోమందికి ఓ వరమైంది. గ్రామీణ విలేఖరుల కోసం జర్నలిజం శాఖ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలకు అనూహ్యమైన ప్రతిస్పందన లభించింది.
గ్రామీణ విలేఖరుల కోసం పకడ్బందీగా ఓ సిలబస్ను రూపొందించి శిక్షణ ఇచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖకే దక్కింది. దానిలో వరదాచారి గణనీయమైన పాత్రను పోషించారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికల్లో పని చేసిన అనుభవాన్ని కలగలిపి ఆయన తెలుగు జర్నలిజం పాఠాలు చెబుతుంటే విద్యార్థులు చెవులు చేటలు చేసుకుని వినేవారు. ఆయన భాషాపటిమ, అనుభవం
ఎలాంటివో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
తెలుగు జర్నలిజానికి, తెలుగు జర్నలిస్టులకు ఓ నూతన ఒరవడిని, భాషకు సంబంధించిన అస్ర్తాలను అందించిన మేధావి వరదాచారి. జర్నలిస్టుగా ఆయనకున్న అనుభవం అధ్యాపకుడిగా తెలుగు విశ్వవిద్యాలయంలో రాణించడానికి దోహదపడింది. సినిమా, రాజకీయ రంగాలు ఆయనకు కొట్టిన పిండి కావడంతో నవతరం విద్యార్థులకు కష్టం లేకుండా ఇష్టంగా పాఠాలు చెప్పేవారు. ‘రాయడం’ అనే విద్యలో ‘ఎడిటింగ్’ అనే విద్యకూడా కలగలిసే ఉంటుంద ని వరదాచారి విద్యార్థులకు చెప్పేవారు. ఏ అంశం మీదైనా బాగా రాయడం ఎంత అవసరమో, రాసినదాన్ని బాగా ఎడిట్ చేయడం కూడా అంతే అవసరమని చెప్పేవారు.నిజానికి వరదాచారి రాకతో తెలుగు విశ్వవిద్యాలయంలోని తెలుగు జర్నలిజం శాఖ సుసంపన్నమయ్యింది.
వరదాచారి లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్టు. ఏ విషయాన్నైనా కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వా తే కాయితం మీద కలం పెట్టిన వాడు. విశ్వవిద్యాలయ స్థాయిలో జర్నలిజం చదువుకొని ప్రొఫెషనల్ జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన చాలా కొద్దిమంది తెలుగు జర్నలిస్టుల్లో ఆయన ఒకరు. 50వ దశకంలో ఓయూలో జర్నలిజంలో డిప్లొమా చేశారు వరదాచారి.
వరదాచారి 58 ఏండ్ల వయసులో జర్నలిస్టుగా పదవీ విరమణ చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రెండు దశాబ్దాలపాటు ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ కాలంలో ఆయన వందలాది మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్ది తెలుగు పత్రికా రంగానికి అందించారు. ఆయన జ్ఞానధారను స్వీకరించిన విద్యార్థుల్లో కొందరు ఇవ్వాళ ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
అవి జర్నలిజం పట్ల యువత బాగా ఆకర్షితులవుతున్న రోజులు. అలా జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించాలనుకునే వాళ్లు ఎంతోమంది వరదాచారి శిష్యరికంలో రాటుదేలారు. జర్నలిస్టులుగా ఇవ్వాల్టికీ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
‘అభ్యాసం’ అనే పేరుతో ఆయన తన బోధనాకాలంలో విద్యార్థుల చేతుల మీదుగా ఓ పత్రికను రూపొందింపజేయడం తెలుగు జర్నలిజం బోధనలోనే ఓ సరికొత్త ఒరవడి. అనువాదం, శీర్షికలు పెట్టడం, పేజీ డిజైన్ లాంటి ముఖ్యమైన విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, అన్ని ముఖ్యమైన సందర్భాల్లోనూ నాలుగు పేజీల పత్రికను ఆయన వెలువరింపజేశారు.
నిజానికి మిగతా సామాజిక శాస్ర్తాలతో పోలిస్తే జర్నలిజానికి గుర్తింపు ఎక్కువే అని చెప్పాలి. అసలీ రంగానికున్న ప్రత్యేకత ఏమిటంటే… నిరంతరాయంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత. జర్నలిస్టుగా కొనసాగాలనుకునే, రాణించాలనుకునే ఏ వ్యక్తికైనా ఇది ప్రాణ సమానం కావాలి. అప్పుడే వాళ్లు ప్రతిభావంతులైన జర్నలిస్టులుగా రాణిస్తారు. గుర్తింపును పొందగలుగుతారు. అలాంటి ఆసక్తి, అభిమానం, జర్నలిజం పట్ల ఆపేక్ష ఉన్న విద్యార్థుల్ని ఎంపిక చేసి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి నిపుణులుగా తయారు చేయడంలో వరదాచారికి వచ్చినంత కీర్తి మరే ఇతర అధ్యాపకుడికీ రాలేదు. అది వరదాచారి నిజాయితీ, నిబద్ధత, కార్యదక్షతలకు నిదర్శనం. వరదాచారి అనే మంచి జర్నలిస్టు.. అధ్యాపకుడి అవతారమెత్తి శిష్యుల్ని ఎంతోమందిని తీర్చిదిద్దారు. అదే విధంగా ఆయన శిష్యులు మేలిమి వజ్రాల్లా తెలుగు పత్రికా రంగానికి గొప్ప సేవలు అందించడం ఆయనకూ, తెలుగు పత్రికా రంగానికీ, బోధనా రంగానికీ గర్వకారణం.
‘పరిణత పాత్రికేయం’ ఆవిష్కరణ
జీఎస్ వరదాచారి జీవన సాఫల్య అభినందన; ‘పరిణత పాత్రికేయం’ గ్రంథావిష్కరణ సభ, 2022 జూన్ 26న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. దాసు కేశవరావు అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా డాక్టర్ కె.వి.రమణాచారి, అల్లం నారాయణ, యం.వి.ఆర్.శాస్త్రి, డాక్టర్ కె. రామచంద్రమూర్తి హాజరవుతారు. డాక్టర్ కె.శ్రీనివాస్ గ్రంథ పరిచయం చేస్తారు. అందరికీ ఆహ్వానం.
-కె.లక్ష్మణరావు, వయోధిక పాత్రికేయ సంఘం
వరదాచారి బోధనంతా సిద్ధాంతాన్ని క్లాస్ రూమ్లోనే ‘ఐప్లె’చేసి ‘ప్రాక్టికల్’గా మార్చే విధంగా సాగేది. అంటే బోధనతో పాటుగా అక్కడికక్కడే, అప్పటికప్పుడే అభ్యాసం కూడా చెయ్యాల్సొచ్చేది విద్యార్థులకు. ఆ విధంగా చదువుకునే రోజుల్లోనే క్షేత్ర స్థాయిలో ఉండే సాధక బాధకాలన్నీ విద్యార్థులకు తెలిసి వచ్చేవి. కాబట్టి వాళ్లు పత్రికా రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించి ప్రగతి పథంలో దూసుకుపోయే చొరవ చూపించగలిగేవాళ్లు. ఒక ముక్కలో చెప్పాలంటే… వరదాచారి క్లాస్రూమ్ ఓ తాలింఖానా. అక్కడ భాషతో విన్యాసాలు చేసే అనేక పట్లు, గుట్లు కూడా బోధనలో భాగంగా ఉండేవి. అందువల్ల పాఠాలన్నీ పూర్తయ్యే నాటికి ఆయన విద్యార్థులు భాషనీ, భావాన్నీ పలికించగల, కలం చివరినుంచి ఒలికించగల నిపుణులైన భాషా వ్యవసాయానికి సంబంధించిన పరిపూర్ణమైన తాలింఖానా వస్తాదులుగా రూపుదిద్దుకునే వాళ్లు.
-ఆచార్య కడియాల సుధీర్ కుమార్
(నేడు జి.యస్. వరదాచారి జీవన సాఫల్య అభినందన సభ సందర్భంగా…)