ప్రజలకు సకల వైద్య సౌకర్యాలను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. దీంట్లో భాగంగానే రాజధాని హైదరాబాద్కు నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే గచ్చిబౌలిలో ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) సేవలు అందిస్తుండగా, మరో మూడు టిమ్స్ దవాఖానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ఆరో గ్య సేవల రంగంలో దేశానికే తలమానికంగా ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో వీటిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించటానికి రాష్ట్రప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కేటాయించింది. ఈ నాలుగు దవాఖానల ద్వారా ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నది.
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు చెందిన సకల రంగాలతోపాటు ఆరోగ్యసేవల రంగం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురైంది. తెలంగాణవాసులకు పెద్దదిక్కుగా నిలిచిన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలు మూడూ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకాక ముందు వే. ఆ తర్వాత ఒక్క దవాఖానను కూడా నిర్మించింది లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మళ్లీ ఆరోగ్యరంగం జవజీవాల్ని నింపుకున్నది. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పా టు, దవాఖానల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్యకళాశాలల సంఖ్య పెంపు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి వేతనాల పెరుగుదల వంటి సమగ్ర చర్యలతో ప్రజావైద్యం రూపురేఖలు క్రమంగా మారుతూ వచ్చాయి. అంతవరకూ మూడంచెలుగా ఉన్న వైద్యసేవలను ఐదు అంచెలకు విస్తరించారు. ‘అమ్మో! సర్కారు దవాఖానకా..’ అని గతంలో భయపడిన ప్రజలే క్రమంగా వాటికి పెద్ద ఎత్తున రావటం మొదలైంది. సర్కారు దవాఖానలలో ప్రసవాలు పెరుగడం ఇందుకు ఉదాహరణ.
కరోనా రూపంలో ఎదురైన అతిపెద్ద ఆరోగ్య సవాలును కూడా తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. రోగులకు చికిత్స కోసం గచ్చిబౌలిలో యుద్ధప్రాతిపదికన తొలి టిమ్స్ను ఏర్పాటు చేసింది. ఇతర దవాఖానల్లో పడకల సంఖ్యను, ఆక్సిజన్ సరఫరాను, ఔషధాలను పెంచింది. కరోనా సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి కూడా రోగులు చికిత్స కోసం తెలంగాణకు తరలిరావటం తెలిసిందే. కరోనాను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే దేశానికే మార్గదర్శకంగా మారింది. నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్-4 నివేదికలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలువడం, ప్రజారోగ్య రంగంలో మన రాష్ట్రం సాధించిన విజయానికి సూచిక. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు, పిల్లలకు టీకాలు తదితర అంశాల్లోనైతే అగ్రస్థానం మనదే. హెల్త్ ఇండెక్స్లో మొదటి ర్యాంకును కైవసం చేసుకోవటం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆరోగ్య తెలంగాణ అవతరించి యావత్దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.