సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని, భావవాదాన్ని తమదైన గతితార్కిక తాత్విక భూమికతో ఎదుర్కొన్నారు. అయితే అభ్యుదయ కవులైన రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా), రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, చేకూరి రామారావు తదితరుల సాహిత్య విమర్శ కూడా
ఈ కాలంలో ప్రముఖమైనదిగా ప్రస్తావించుకోవాలి.
తెలంగాణ విప్లవ కవులు ఆకలి, అసమానతలు, దోపిడీ, వెట్టిచాకిరి, మహిళలమీద దాడు లు, రాజ్యహింస, భూ సమస్య మొదలు సకల సామాజిక సమస్యలపై సాహిత్య సృజన చేశారు. శివసాగర్- ‘ఉద్యమం నెలబాలుడు’; అజ్ఙాతసూరీడు- ‘పాట వెన్నెలమీద నడుస్తోం ది’; మఠం రవికుమార్- ‘మంజీరా మూడ్స్’; ఎంఎస్ఆర్- ‘కాగడాగా వెలిగిన క్షణం’; సముద్రుడు-‘భూమి నా తల వెల నిర్ణయించు’; కౌముది- ‘చనుపాల ధార’; అలిశెట్టి ప్రభాకర్- ‘మరణం నా చివరి క్షణం కాదు’; వడ్డెబోయిన శ్రీనివాస్- ‘ముఖచిత్రం’; శాఖమూరి రవి- ‘పాదముద్రలు’; బాసిత్- ‘తెహల్కా అద్దంలో సర్కారు-ప్రతిబింబం’; ఉదయమిత్ర-‘కాలి బాట’; కాసీం- ‘పొలమారిన పాలమూరు’… ఇలా విప్లవ కవులు రాసిన కవితా సంపుటాలెన్నో తెలుగు సాహిత్య, సామాజిక రంగంలో సంచలనం అయ్యా యి. సాహిత్య, సామాజిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
అలాగే ఈ కవులు కవిత్వానికి సంకెళ్లుగా ఉన్న ఛందస్సు సంకెళ్లను తునాతునకలు చేసి పద్యం నడు ము విరగ్గొట్టారు. వచనకవితకు, మరీ ముఖ్యంగా పాటకు పట్టం గట్టారు. విరసం రచయితల్లో నేడుకూడా ఎంతో మంది సాహిత్య విమర్శవ్యాసాలు రాస్తున్నారు. ఈ తరం రచయితల్లో పాణి, వరలక్ష్మి తదితరులు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం వెలుగులో విషయ విశ్లేషణ చేస్తూ, సాహిత్య విమర్శ వ్యాసాలు రచిస్తున్నారు. విప్లవ సాహిత్యం 1970ల తర్వాత రెండు దశాబ్దాలు తెలుగు సాహిత్యంలో శిఖరాయమానంగా, ఉన్నతంగా కొనసాగింది. తెలుగు సమాజంపై విరసం కవులు గాఢ ప్రభావం వేశారు.
విరసం తమ సమస్యలను పట్టించుకోవటం లేదన్న ఫిర్యాదుతో అందులో ఉన్న మహిళా సభ్యులు అసంతృప్తితో బయటకు వచ్చారు. అంతకంటే ముందే 1960-70 దశకంలో యూరప్లో ముఖ్యంగా ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల్లో స్త్రీ విముక్తి ఉద్యమం ఒక సైద్ధాంతికతతో బయలుదేరింది. అదే ‘ఫెమినిజం’. అది మన వాళ్లను కూడా ఆకర్షించింది. ‘ఫెమినిజం’ను ‘స్త్రీవాదం’గా ఇక్కడి రచయిత్రులు అనువదించు కొని పోరాటానికి దిగారు. తెలుగులో ‘స్త్రీ వాదం’ అంటే, హిందీలో
‘నారీవాదం’ అన్నారు.
ఇంగ్లండ్లో స్త్రీవాద ఉద్యమం మొదట ఓటు హక్కుకోసం పోరాటంగా ప్రారంభమైంది. మేరీ హోల్స్టోన్ క్రాఫ్ట్ అనే ఆమె మొదట ఫెమినిస్ట్ సిద్ధాంత కర్త. ఆమె ఇంగ్లండ్లో పుట్టింది. 1789లో ‘విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్’ అనే పుస్తకంలో స్త్రీల సమాన హక్కు లు, సమాన అవకాశాలను గూర్చి మొదటిసారిగా మాట్లాడింది. ఆడ పిల్లలకు చదువు కావాలని వాదించింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ‘సార్త్రె’ అస్తిత్వవాదాన్ని ముందుకు తెచ్చాడు. ఆయన సహచరి అయిన సిమోన్ ద బుహి రాసిన ‘ ది సెకండ్ సెక్స్’అనే పుస్తకం స్త్రీవాద భావజాలాన్ని విస్తృత ప్రచారానికి తెచ్చింది.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606