పుట్టిన ఊరుతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకో వటమే ‘నోస్టాల్జియా’. ఆ ఊరితో ఉన్న మర్చిపోలేని జ్ఞాపకాలు.. అభిమానాలే ‘డయస్పొరా’. ఈ రెండూ తెలంగాణ కవుల కవితల్లో బాగా ప్రతిబింబించాయి. ఇదే తెలంగాణ అస్తిత్వ వాదంలోని ఒక విలక్షణం.
తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే జూలూరు గౌరీశంకర్- ‘పొక్కిలి’ (2002), సుంకిరెడ్డి నారాయణరెడ్డి- ‘మత్తడి’ (2002)తో పాటు, ‘ముంగిలి’, ‘మునుము’ మొదలైనటువంటి తెలంగాణ కవితా సంకలనాలు వచ్చాయి. పంచరెడ్డి లక్ష్మణ- ‘యిసిత్రం’, దేవరాజు మహారాజు- ‘గుడిసె గుండె’ కవితా సంపుటాలు 1970లోనే వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో నందిని సిధారెడ్డి, కృష్ణమూర్తి యాదవ్, అమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోజు తదితరులు రచనతో పాటు తెలంగాణ వాదాన్ని నెత్తిన మోశారు.
తెలంగాణ అస్తిత్వ బాధను చిత్రిస్తూ బి.ఎస్.రాములు, బోయ జంగయ్య, పులుగు శ్రీనివాస్, కాలువ మల్లయ్య, ఆడెపు లక్ష్మీపతి, పంజాల జగన్నాథం, బీవీఎన్ స్వామి, కేవీ నరేందర్, పెద్దింటి అశోక్ కుమార్, కాసుల ప్రతాపరెడ్డి, బెజ్జారపు రవీందర్, బోధనం నర్సిరెడ్డి, చొప్పదండి సుధాకర్, అనిశెట్టి రజిత, ముదిగంటి సుజాతా రెడ్డి మొదలైనవారెందరో కథలు, కవితలు రచించారు.
పెద్దింటి అశోక్కుమార్- ‘లాంగ్ మార్చ్’, పరవస్తు లోకేశ్వర్-‘సలాం హైద్రాబాద్’ వంటి నవలలు వచ్చాయి. ఇంకా అఫ్సర్, కె.శ్రీనివాస్, గుడిపాటి, ఎన్.వేణుగోపాల్, సిధారెడ్డి, కేపీ అశోక్కుమార్, ముదిగంటి సుజాతారెడ్డి, జితేంద్రబాబు, సంగిశెట్టి శ్రీనివాస్ మొదలైనవారు పరిశోధకులుగా, విమర్శకులుగా, సమీక్షకులుగా రచనలు చేశారు. గోరటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, దేశపతి శ్రీనివాస్, విమల, సంధ్య మొదలైనవారు పాడే పాటలు తెలంగాణ స్ఫూర్తిని నింపాయి. ప్రజలను పోరాటబాటన నడిపించాయి.
ఈ కాలంలో తెలంగాణ కవులు ఒక ప్రక్రియగా ఎంచుకొని ‘దీర్ఘ కవిత’ను విరివిగా రచించారు. మొదటినుంచి చివరిదాకా ఒకే వస్తువును తీసుకొని గేయపద్ధతిలో రాయటం దీర్ఘ కవిత లక్షణం. జూలూరు గౌరీశంకర్- ‘కాటు’, ‘నా తెలంగాణ’; ఎన్.గోపి- ‘జలగీతం’; అఫ్సర్- ‘తెలంగాణ’; సుంకిరెడ్డి నారాయణరెడ్డి- ‘దాలి’ మొదలైన దీర్ఘకవితలు తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో వచ్చాయి. వీటిల్లో ప్రాంతీయ స్పృహ, అస్తిత్వ పోరాటాల నేపథ్యం కనిపిస్తుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటకాలంలో ముదిగంటి సుజాతారెడ్డి ‘తెలంగాణ తొలితరం కథలు’ (2002) ప్రచురించి తెలంగాణ కథల ప్రాచీన్యాన్ని తెలిపి తెలంగాణ అస్తిత్వం ఎంత గొప్పదో, ఎంత ప్రాచీనమో తెలిపారు. ఆమె ‘ముద్దర’ పేరుతో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శ వ్యాసాల సంకలనాన్ని తెచ్చారు. నిజామాబాద్ నుంచి అమృతలత సంపాదకులుగా తెలంగాణ రచయిత్రుల కవిత్వం, కథలు ‘గాయాలే గేయాలై’, ‘వెతలే కథలై’ (2011) సంపుటాలను ప్రచురించింది. ఈ విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, రచయితలు సృష్టించిన సాహిత్యం ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తెచ్చింది.
తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద ప్రభావంతో అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కూడా సాహిత్య సృష్టి జరిగింది. కానీ ఆ సాహిత్యం వాళ్ల ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని స్థిరపరచలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రేరేపిస్తూ వచ్చిన తెలంగాణ ప్రాంత అస్తిత్వవాదమే చరిత్రను సృష్టించింది. 1990 దశకంలో తెలం
గాణ నుంచి వచ్చిన సాహిత్యం తెలంగాణ అస్తిత్వవాదాన్ని ప్రబోధిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణను ఇచ్చి కొత్త చరిత్రను సృష్టించింది. సాహిత్యం సమాజాన్ని చరిత్రను ఎట్లా ప్రభావితం చేస్తుందో, నడిపిస్తుందో, మలుపు తిప్పుతుందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇట్లా తరతరాల తెలంగాణ పరిణామంలో, పురోగమనంలో సాహిత్యం పాత్ర ప్రధానమైనది, విశిష్టమైనది. ఇంకో అర్థంలో చెప్పుకోవాలంటే.. తెలంగాణ సాహిత్య పరిణామ పురోగమన చరిత్రే తెలంగాణ చరిత్ర.
ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘తెలంగాణ సాహిత్య ప్రస్థానం’ నేటితో ముగిసింది.
-దిగంటి సుజాతారెడ్డి 99634 31606ము