కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో పద్మనాయక వంశం ముఖ్యమైనది. వీరు రేచర్ల గోత్రోద్భవులు. అందుకే వీరిని రేచర్ల పద్మనాయకులుగా వ్యవహరిస్తున్నారు. కాకతీయులకు సామంతులుగా, దండనాయకులుగా ఉన్న వీరి జన్మస్థలం నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు. కాకతి గణపతి దేవుని కాలంనుంచి వీరి అభివృద్ధి దినదిన ప్రవర్ధమానమైంది. ఈ రాజుల్లో మూలపురుషుడైన బేతాళనాయకునితో పాటు ఎర దాచానాయడు, మొదటి సింగమనేడు, అనపోతానాయకుడు, మాదానా యడు, రెండవ సింగభూపాలుడు, రావు మాదానాయడు మొదలైనవారు పేరెన్నికగన్నారు.
మొదటి సింగమ నాయకుని కొడుకు, అనపోతానాయకుని సోదరుడైన మాదానాయడు దేవరకొండ రాజ్యాన్ని పాలించాడు. ఇతడు తన పాలనా కాలంలో (క్రీ.శ. 1376) ఉమామహేశ్వర శాసనం వేయించాడు. నాలుగు వైపుల మొత్తం 153 పంక్తుల్లో తెలుగు, సంస్కృత భాషలలో వేయించిన ఈ శాసనం చివరలో చక్రబంధం ఉంది.
శాసనం ప్రారంభంలో రేచర్ల వంశ వర్ణన ఉంది. రేచర్ల ప్రభువులు చతుర్థ కులజులు. ఈ వంశంలో దాచయ నాయడు భిల్లమ సైన్యాన్ని ఓడించిన ధీశాలి. అతని కొడుకు సింగ భూపతి. సింగభూపతి కొడుకులు మాధవ నాయకుడు, అనపోతా నాయకుడు. ఇతడే మాదానాయడుగా పిలువబడినాడు. ఈ మాదానాయడు దేవనగ (దేవరకొండ) దక్షిణ ప్రాంతంలో తన పేర మాధవ పురమును నిర్మించి అక్కడి నుంచి పాలన చేశాడు. మాదానాయడు శ్రీపర్వత ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర దేవునికి మహాశిలా సమూహంతో మంటపాన్ని నిర్మించాడు. పదవాక్య ప్రమాణజ్ఞులైన మయీభట్టోపాధ్యాయు లను ఆ విషయమై శాసనం చెప్పుమనగా ఆ శాసనం రూపుదిద్దుకొన్నది.
శాసనంలో రేచర్ల వంశీయుల వర్ణన చాలా విపులంగా ఉంది. అందులో మాదానాయడు ‘శ్రీమన్మహామండలేశ్వర రాయగాయ గోపాల, గజదళ విభాళ భుజబళ భీమఖడ్గ నారాయణ సోమకుల పరశురామ సత్య హరిశ్చంద్ర, శౌచ గాంగేయ అప్రతిహత ప్రతాపోదయ సంతత హేమాద్రి దాన నిరత దాచయ శింగభూపతి సుతుండైన మేదినీరూప నారాయణ శింగమాంబా గర్భ పుణ్యోద య రేచర్ల వంశ దుగ్ధాబ్ది సుధాకరుండైన శ్రీ మాధవేంద్రుడు’ అని వర్ణింప బడినాడు. ఇంకా మాదానాయడు ‘గజదళారాతి, ఖడ్గ నారాయణ, సమర సాత్యకి, రాయగోపాల, సోమకుల పరశురామాది’ బిరుదులు కలవానిగా కీర్తించబడినాడు.
ఈ శాసనం రాయింపవచ్చిన వంగూరి తిప్పాయభట్టు దేవతాస్తుతి చేస్తూ చెప్పిన రెండు శ్లోకాలున్నాయి. శాసనం లిఖించినవాడు పెద్దిరాజు కొడుకు పోతరాజు. శాసనంలో 4వ పక్క ఆరవ లైను తరువాత చక్రబంధం ఉంది. ఈ శాసనాన్ని గమనించినట్లయితే శాసన వేయించిన విధానం తెలుస్తుంది. శాసనం వేయించినవాడు మాదానాయడు. శాసనం చెప్పినవాడు మ యీ భట్టోపాధ్యాయుడు. శాసనం రాయించినవాడు తిప్పాయభట్టు. శాసనం లిఖించినవాడు పోతరాజు. ఇది చాలా విశేషమైన అంశంగా మనం గుర్తించాలి.
– భిన్నూరి మనోహరి