కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. తదాదిగా అనేకానేక రీతుల్లో ‘ప్రత్యేక తెలంగాణ’ రాష్ట్ర అవతరణ కోసం స్వప్నిస్తూ 2001 నుంచి కొనసాగుతున్న తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకొన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అనేక కవితలను పత్రికల్లో ప్రచురించారు. అవి అనేక సంకలనాల్లో, ఇతరేతర మాధ్యమాల్లో కూడా విరివిగా వెలువడ్డాయి. ఆ కవితల్లో కాంచనపల్లి ‘కల’ చాలా బలంగా, ఉజ్జలంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ ‘కల’ రాష్ట్ర సాకారానికి పూర్వం, రాష్ట్ర అవతరణానంతరం కూడా తన ఆకాంక్షలకు అనువైన నైసర్గికతను మార్చుకుంటూ ఒక నిత్యస్వప్నంగా పరిఢవిల్లుతూనే ఉంది. ఎంతో జన సంక్షేమాత్మకంగా, ప్రజారంజకంగా, ఆదర్శవంతంగా వర్ధిల్లగలిగే సమగ్ర స్వరాజ్యాన్ని కోరుతూ కాంచనపల్లి వెలువరించిన కవితల సంపుటి ‘కల ఇంకా మిగిలే ఉంది’. ఈ పుస్తకం 2015 ఆగస్టులో వెలువడింది. కాంచనపల్లి ఆరేండ్ల కింద యాభై కవితలతో ఆవిష్కరించిన ఈ పుస్తకం ఇప్పుడు ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ 2018కి గాను వచనకవితా విభాగంలో ఉత్తమ గ్రంథంగా ఎంపికచేసి పురస్కారాన్ని ప్రకటించడంతో ఒక విశేషమై భాసిస్తున్నది.
1998 ఏప్రిల్లో ఒక దినపత్రికలో వచ్చిన ‘ఇంకా యుద్ధం మొదలుకాలేదు’ కవితతో మొదలై యాభై కవితలుగా విస్తరించిన ఈ పుస్తకం 2015 ఏప్రిల్లో ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వెలువడిన ‘కల ఇంకా మిగిలే ఉంది’ కవితతో సంపన్నమై పరిపూర్ణమైంది.
అంటే 17 ఏండ్లలో కాంచనపల్లి జరిపిన తెలంగాణ మలిదశ కవితాయాత్ర భిన్నమైన రూపాల్లో ఉద్యమ గీతాలుగా ఈ గ్రంథంలో ప్రతిఫలించాయి. అయితే విశ్లేషణాత్మకంగా పరిశీలించినప్పుడు.. ‘ఇంకా యుద్ధం మొదలు కాలేదు/ వీరులు కత్తులకు పదును పెడుతున్నారు/ విషాద జీరను మోస్తున్న ఓ గాలికూన/ మూలుగు తప్ప అంతా మౌనం../ శబ్దం పూయడానికి నిశ్శబ్దం తీగ/ ఉబలాటపడుతున్నది/ ఇక ఒక్కసారిగా తెర లేవాల్సి ఉంది’ ఆశంసతో మొదలైన ఉద్యమ ప్రయాణం కొంగొత్త గాలికూన, నెత్తురు జండా, ఆకుపచ్చ లోయ, అరవిరిసిన చందమామ, అమానస వీణ, వియోగం ఒక మధుర కావ్యం, అగ్నియుద్ధం, రాత్రి ఒక జారిపోతున్న కల, పర్వత స్తనాలు, స్వప్ననది వంటి వినూత్న పదబంధాలతో (పుట 35-42) మొదలై ‘నువ్వు ఎక్కడ చచ్చిపోయావో/ అక్కడే పుడుతావు’ (అర్థం కాని పద్యం- పుట 39) అన్న తాత్తిక ధారగా కొనసాగుతూ ‘ఆకాశం భూమి మెల్లిగా విడిపోయి/ తెలతెల్లని దంత చరణాన్ని/ చూసినట్టే ఉంటుంది/ చాచుకున్న కొమ్మల్లో/ వేర్లతో సహా మబ్బుల/ వైపే పైకి ఎగిసినట్టే ఉంటుంది’ వంటి వాక్యాలతో సర్రియలిస్టిక్ శైలితో ఉధృతిస్తుంది.
1962లో జన్మించిన ఈ కవి తన 35 ఏండ్ల ప్రాయంలో సహజశైలి చాపల్యంతో తనదైన ఒక సొంత గొంతును నిర్మించుకుంటున్న దశలో చేపట్టి ప్రదర్శించిన విలక్షణతా కాంక్ష ఈ మొదటి నలభై పుటల్లో కనిపిస్తుంది. ఇదొక కవితా నది పుట్టగానే పర్వత దశలో పొర్లుతూ, దూకుతూ, గర్జిస్తూ బీభత్సిస్తూ దూసుకుపోవడంగా తెలుస్తుంటుంది పాఠకునికి. అందువల్ల స్పష్టాస్పష్టంగా వస్తు ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న మొదటి ఇరవై కవితలు భిన్నతతో పరిమళించడం గమనిస్తాం మనం. ఈ కాలంలోనే.. అంటే 2000 ప్రాంతంలో కాంచనపల్లి ‘ఆంధ్రాంగ్ల సాహిత్యాలలో కాల్పనిక కవితా ప్రక్రియల పరిణామం’ అన్న అంశంపై పీహెచ్డీ పరిశోధన చేసిన ప్రభావం వల్ల అనుకుంటా ఆయన కవితా నిర్మాణ పద్ధతిలో ఒక గుణాత్మక మార్పు సంభవించి సర్రియలిస్టిక్ నడక నుంచి భావ గాంభీర్యతతో వైశాల్య విస్తృతితో పాటు లోతునూ, సరళ సౌందర్య సాధననూ లక్ష్యించిన ఛాయలు ప్రస్ఫుటమవుతాయి. చివరి ‘కల ఇంకా మిగిలే ఉంది’ కవిత దాకా కవిలో ప్రకటితమైన పరిణతి చదువరికి అనుభవం కావడం తెలుస్తూంటుంది. ఇదొక సృజనాత్మక అక్షరకారునిలో అధ్యయనాత్మక పరిపూర్ణత వల్ల సిద్ధించే సమగ్రతకు ఋజువుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరివర్తన వల్ల ప్రామాణికంగా కవిత్వ ఉదాత్తత ఉన్నతమైన నాణ్యత పెరిగింది. ఈ చివరి ముప్ఫై కవితల వల్ల పుస్తక శ్రేష్ఠతా, విలువ కూడా తురీయమై విలక్షణత సిద్ధించింది.(2018 సంవత్సరానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కాంచనపల్లి రచన ‘కల ఇంకా మిగిలే ఉంది’ కవిత్వ సంపుటికి సాహిత్య పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా..)
రామా చంద్రమౌళి
93901 09993