నవమంజరిగా పల్లవించి
అభ్యుదయమై పరిఢవిల్లి
అగ్నిధారలు కురిపించి
రుద్రవీణలు మోగించి
గాయమై కవితా గేయమై
కవన ఖడ్గమై ధిక్కారస్వరమై
తరాల దాస్యాన్ని
తరిమేసిన కవితాగ్ని గోళమై
మంటలు కురిపించిన పద్యమై
మనిషినే మహితాత్ముడిగా
భావించిన మానవతావాదమై
కోటిరతనాల తెలంగాణమై
కంటికి కనిపించిందంతా
కైతగా రాసేసిన కవితారవి
చితిమంటల యుద్ధానికి ప్రతీకవు
ఒక ఫైర్ బ్రిగేడ్ అనేటి ధీశాలి
అణ్వస్త్రపు గ్రీష్మానికి ప్రతిపద్యం
మబ్బు ముక్క అనేటి మహర్షి
భావప్రకటనలో ఎంతెంతో వైవిధ్యం
కవితా సృజనలో శిఖరమంత ఉద్దీపనం
గిరి మేల్కొన్నది..పురి మేల్కొన్నది
గిరి గుహలో కేసరి మేల్కొన్నదని
జాతిని మేల్కొల్పిన జాగృద్గీతివి
మహాకవీ మహోన్నత కవీ
కవితాశరథీ దాశరథి
– డా. తిరునగరి శ్రీనివాస్ 9441464764