ప్రాచీన భారత చరిత్రను అవగాహన చేసుకోవడం కష్టం. కానీ, అసాధ్యం కాదు. చరిత్రను కేవలం తేదీలు, దస్తావేజులు, విసుగెత్తించే ఘట్టాలతో గాకుండా సామాన్య జనంలో సైతం వేల ఏండ్లుగా సజీవంగా నిలిచే మహా కావ్యాలుగా (రామాయణం, మహా భారతం, భాగవతం), అతిశయోక్తులతో కూడిన పురాణాలుగా మనకు అందించడం వల్ల వాస్తవ చరిత్రను వాటినుంచి వేరు చేసి గ్రహించడం కష్టంగా మారింది. ఇందువల్ల ప్రాచీన భారతీయ రచయితలకు చారిత్రక రచనా స్పృహ లేదనే అపప్రద పుట్టింది. కానీ, మహాభారత యుద్ధానంతరం నుంచి కశ్మీర్ రాజవంశాల చరిత్రను మనకు అందించిన కల్హణుని రాజతరంగిణి ఇందుకు మినహాయింపు.
ప్రాచీన కశ్మీర్ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక జీవితాన్ని కల్హణుడు యథాతథంగా రాశాడు. అందువల్ల ప్రాచీన భారత ఇతిహాసాలను, మహా కావ్యాలను కేవలం కట్టుకథలని కొట్టివేయడం సరికాదు. అలాగని వాటిలో ఉన్నవన్నీ అక్షర సత్యాలు కాదు. క్రీస్తు పూర్వం 1184లో కశ్మీర్ను పాలించిన 3వ గోనంద రాజుతో మొదలుపెట్టి తాను రచనను ముగించిన క్రీ.శ.1149 వరకు చరిత్రను రాజతరంగిణిలో వివరించాడు. తన పూర్వపు రచయితల రచనలు, రాజ శాసనాలు, చారిత్రక దస్తావేజులు, రాజ దానపత్రాలు మొదలైనవి పరిశీలించి వాటిలోని అతిశయోక్తులను, పరస్పర విరుద్ధ అంశాలను తొలగించాకే నిజమైన చరిత్రను రాశానని కల్హణుడు చెప్పుకొన్నాడు. రాజ తరంగిణిని పరిశోధిస్తే ప్రాచీన భారతంలో అభ్యుదయకర అంశాలు ఎన్నో ఉండేవని స్పష్టమవుతుంది.
ప్రభుత్వ భూ సేకరణ చట్టాలు: సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ సంస్థలు, జాతీయ రహదారుల వంటి ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైన భూములను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి సేకరిస్తుంది. బ్రిటిష్ పాలకులు 1984లో తయారుచేసిన భూ సేకరణ చట్టం వ్యక్తుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తప్పనిసరి భూ సేకరణ చేపట్టేది. మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత కూడా వందేండ్లకు పైగా ఇదే చట్టం అమల్లో ఉండేది. అయితే, దీని స్థానంలో 2013లో న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు, భూ సేకరణ, పునరావాస, పునః సమీక్ష చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టం ద్వారా మూడు ప్రధానమైన మార్పులను ప్రభుత్వం భూసేకరణ చట్టంలో ప్రవేశపెట్టింది. బలవంతపు తప్పనిసరి భూ సేకరణ బదులుగా వ్యక్తులు, ప్రభుత్వం ఐచ్ఛికంగా పరస్పర ఒప్పందం ద్వారా కుదుర్చుకున్న ధరకు భూ సేకరణ చేయడం, భూ సేకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించడం, భూములు కోల్పోయిన కుటుంబాలకు కేవలం ధన రూపంలోనే కాకుండా వారి కుటుంబ, సామాజిక, పర్యావరణ పరిసరాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో పునరావాసం కల్పించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఇలాంటి అభ్యుదయకరమైన చట్టాన్ని తేవడానికి మనకు వందేండ్లు పట్టింది.
6వ శతాబ్దంలో భూ సేకరణ: మరి క్రీ.శ. 6వ శతాబ్దంలోనే మన దేశంలో ప్రజా ప్రయోజనాల కోసం భూ సేకరణలో ఎలాంటి పద్ధతి పాటించారో ఒక ఉదాహరణ చూద్దాం. క్రీ.శ. 724లో కశ్మీర్లో ప్రఖ్యాత మార్కండ దేవాలయాన్ని నిర్మించిన సామ్రాట్ ముక్తాపీడ లలితాదిత్యునికి పూర్వీకుడు చంద్రాపీడుడు. త్రిభువనస్వామి మందిర నిర్మాణానికి అనువైన స్థలంలో చంద్రాపీడుడు భూసేకరణ చేసిన విధానాన్ని కల్హణుడు రాజతరంగిణి 4వ తరంగం (54 నుంచి 76 శ్లోకాలు)లో విపులంగా వర్ణించాడు.
చంద్రాపీడుడు గుడిని నిర్మించతలపెట్టిన ప్రదేశంలోనే ఒక చర్మకారుని గుడిసె ఉంది. రాజాధికారులు ఎంత డబ్బు ఆశచూపినా రాజు నిర్మించదలచిన మందిరానికి అతను తన గుడిసెను ఇవ్వడానికి నిరాకరించాడు. అధికారులు తన స్థలంలోకి రాకుండా అడ్డుకున్నాడు. దాంతో వారు రాజుకు విన్నవించుకున్నారు. బలవంతంగా అతని గుడిసెను ఆక్రమించడానికి ప్రయత్నించినందుకు రాజు తన అధికారులనే తప్పుబట్టాడు. ‘ముందుగా చర్మకారుని అనుమతి లేకుండా అతని నివాస స్థలంలో ప్రవేశించి అధికారులు ముందుచూపు లేకుండా ప్రవర్తించారు. తక్షణమే మందిర నిర్మాణాన్ని ఆపివేయండి. లేదా మరోచోట మందిరాన్ని నిర్మించండి. ఒకరి భూమిని బలవంతంగా లాక్కొని పవిత్రమైన మందిర నిర్మాణాన్ని ఎలా చేయగలం? ఏది న్యాయమో నిర్ణయించే మనమే అన్యాయంగా ప్రవర్తిస్తే, ఇక చట్ట ప్రకారం ఎవరు నడుచుకుంటారు?’ అని ప్రశ్నించాడు.
మరుసటి రోజు చంద్రాపీడుడు ఆ చర్మకారుని రాజ భవనానికి పిలిచి ‘నీకు నీ ఇల్లు అంతగా ఇష్టమైతే, దానికంటే పెద్ద భవంతిని గానీ, పెద్ద మొత్తంలో డబ్బుని గానీ కోరుకో. ఇస్తాను’ అన్నాడు. అందుకు ఆ చర్మకారుడు బదులిస్తూ మహారాజా! మీకు మీ రాజభవంతి ఎంత ప్రీతిపాత్రమో నాకు నా మట్టి గుడిసె అంతే ఇష్టం. నేను పుట్టినప్పటి నుంచి నా కష్టసుఖాల్లో ఈ పూరి గుడిసె కన్నతల్లిలా సాక్షిభూతంగా ఉంది. దీన్ని నేలమట్టమవ్వడం నా కండ్లారా నేను చూడలేను. తాను నివసించే ఇంటిని కోల్పోయిన వ్యక్తి దురదృష్టాన్ని రాజ్యం కోల్పోయిన రాజు దురదృష్టంతోను, విమానంపై నుంచి పడిపోయిన వ్యక్తి దుస్థితితోను పోల్చవచ్చు. ఏదేమైనా, ఒకవేళ మహారాజా వారు నా పూరిగుడిసెకు స్వయంగా వచ్చి కోరితే సభ్యత పాటించి నేను నా ఇల్లుని ఇస్తానని’ అన్నాడు. మహారాజు అతని కోరిక మేరకు అతని గుడిసెకు వెళ్లి అడుగగా చర్మకారుడు తన గుడిసెను తగిన ధరకు స్వాధీనం చేశాడు.
కల్హణుడు పేర్కొన్న చారిత్రక ఉదంతం ప్రభుత్వ భూ సేకరణలో న్యాయమైన నష్ట పరిహారం చెల్లించడం ఎంత ముఖ్యమో నిర్వాసితుల పట్ల ఉదారంగా, సానుభూతి, మానవతా దృక్పథంతో ప్రవర్తించడం అంతే ముఖ్యమని దిశానిర్దేశం చేసింది. మన ప్రాచీన చరిత్రలో మానవత్వాన్ని చాటే సంఘటనలు తెలుసుకొని గర్విద్దాం.
ఆనందేశి నాగరాజు