తెలుగులో తొలితరం అభ్యుదయ కవుల రచనల్లో మొదట దళిత స్పృహ కనిపించింది. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా లాంటివారు దళిత దృక్కోణానికి ప్రతీకలుగా, మార్గదర్శకంగా నిలిచినప్పటికీ… ఉద్యమాల నేపథ్యంలోంచి వచ్చిన దళిత సాహిత్యమే ఎక్కువ. దళిత స్పృహను దళితులే వ్యక్తీకరించాలనేది దళితవాదుల వాదన. అరసం, విరసం వంటి సంస్థలు తమ ఆశలు, ఆకాంక్షలను సరిగా ప్రతిబింబించడం లేదని ఆరోపణతో స్త్రీలు, దళితులు ఆయా సంస్థల నుంచి వేరుపడి, తమ అస్తిత్వాలను వ్యక్తీకరిస్తూ సాహిత్యాన్ని సృష్టించారు. దీనికి ప్రపంచీకరణలో వచ్చిన‘డయాస్పొరా’ ప్రేరణను ఇచ్చిందని చెప్పాలి.
ప్రపంచీకరణలో భాగంగా ఆవిర్భవించిన పెట్టుబడిదారీ వ్యవస్థలో తమ భాషా, సంస్కృతులు అణచివేయబడుతున్నాయని బడుగు దేశాల రచయితలు తమ భాషా సంస్కృతులను ప్రతిబింబించే సాహిత్యాన్ని సృష్టించారు. ఆ విధంగా తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఇదే పద్ధతిలో స్త్రీలు, దళితులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి దళిత, స్త్రీ వాద సాహిత్యోద్యమాలు ఆరం భించారు. సాహితీ ప్రపంచంలో వీటికి ‘అస్తిత్వవాదాల’ని పేరు.
‘అస్తిత్వ వాదం’ ప్రధాన లక్షణం ఒక సామాజిక వర్గం తమ వేదనను తామే వ్యక్తీకరించుకోవటం. స్త్రీవాద, దళితవాద రచయితలు చేసింది కూడా ఇదే. అరసం, విరసం కవులు కూడా తమ రచనల్లో దళిత స్పృహను వ్యక్తం చేశారు.
1985లో కారంచేడులో దళితులపై జరిగిన దాడి, ఊచకోత దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. కులవివక్షలో భాగంగానే ఆ దాడి జరిగిందని దళితవర్గాలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఈ నేపథ్యంలోంచే అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థల్లో కూడా దళితుల ఉనికి, స్థానంపై చర్చమొదలైంది. అది విరసం, విప్లవోద్యమంలోనూ కొనసాగింది. ఈ క్రమంలోంచే ‘దళితవాదం’ పుట్టుకొచ్చింది.
దళితుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నది. సంఘ సంస్కరణోద్యమ కాలంలో ప్రగతి కాముకులు కులభేదాన్ని నిరసించారు. గాంధీ జీ జాతీయోద్యమంతో పాటు, అస్పృశ్యత నివారణ కోసం ఉద్యమించారు. సమాజంలో హరిజనులకు సమానతను ప్రబోధించారు. స్వాతంత్య్రానికి పూర్వం వచ్చిన ఉద్యమాలతో కొంతవరకు దళితుల పరిస్థితి మెరుగుపడింది. కానీ దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కుంటుపడినట్లుగానే దళితుల పరిస్థితి కూడా వెనుకపడింది. పరిస్థితుల మీద అసంతృప్తితో దళితులు ఉద్యమాన్ని కొనసాగించారు. నేడు ‘హరిజనులు’ అన్న పదానికి బదులు ‘దళితులు’ అన్నదాన్ని ప్రయోగిస్తున్నారు. దళితులకు ప్రధాన ప్రేరణ అంబేద్కర్. ఆయన మహారాష్ట్రలో 1924లో అస్పృశ్యతా నివారణోద్యమాన్ని ప్రారంభించారు. దళితులు తమ స్థితిని తాము గుర్తించి తమను తామే ఉద్ధరించుకోవాలనే దాన్ని అంబేద్కర్ దళిత ఉద్యమానికి మూలమంత్రంగా ప్రబోధించారు.
నేడు దళితవాదంలో అంబేద్కర్ దృక్పథం, మార్క్సిస్టు దృక్పథం అనే రెండు పాయలు కనిపిస్తున్నాయి. రెండింటినీ సమన్వయం చేసేవాళ్లూ ఉన్నారు. అంబేద్కర్ సామాజిక దృక్ప థం, వర్గ కుల దృక్పథం పునాదిగా చేసుకొని తెలుగులో దళిత తాత్వికత ఎదిగింది. మరాఠీ, కన్నడ భాషల్లో దళిత సాహిత్యం ముందుగా వికసించింది. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం వలె ‘దళిత సాహిత్యం’ వ్యక్తి అనుభూతిని గాక సామాజికానుభూతిని వ్యక్తంచేసింది. దళిత సాహిత్యం ఉత్పత్తి రంగంలో జరిగే శ్రమ దోపిడీని ఎదుర్కోవటం; సామాజికంగా, సాంస్కృతికంగా ఉన్న ఆధిక్యతా భావాన్ని, అహంకారాన్ని బద్దలు కొట్టడం లక్ష్యంగా ముందుకువచ్చింది.
సాహిత్యం, కళల్లో ఉన్న వర్గ దృక్పథాన్ని ధ్వంసం చేయటం, భాషా శిల్పంలో ఉన్న ఉచ్ఛ, నీచ భావాలను ఎదిరించటం, ఆధిపత్య అగ్రవర్గాలు, వర్ణాల వారి సంస్కృతియే మొత్తం సమాజ సంస్కృతిగా చెలామణి కావడం మొదలైన అంశాలను నిరసించింది. ఉన్నత వర్గ సంస్కృతిని ప్రతిఘటించడం, కింది వర్గాల వారి దృక్పథాలను సాహిత్యంలో ప్రతిఫలింపజేయటం దళిత రచయితల ఆశయం.
దళిత స్పృహను దళితుడే వ్యక్తీకరించటానికి సమర్థుడని దళితవా దుల వాదన. జాషువా రచనలు దళిత స్పృహకు చక్కని ప్రతీకలు. కత్తి పద్మారావు దళితవాద దృక్పథంతో ‘మనచరిత్ర-సంస్కృతి’ పేరుతో దేశ చరిత్రను రచించాడు. చరిత్రను కొత్త వెలుగులో విశ్లేషించవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నాడు. తెలంగాణ నుంచి బోయ జంగయ్య అనేక నవలలు, కథలు ఈ స్పృహతో రచించాడు. ‘జాతర’, ‘జగడం’ ఆయన నవలల్లో చెప్పదగినవి. వేముల ఎల్లయ్య- ‘కక్క’ తెలంగాణ నుంచి వచ్చిన దళిత నవల. బోయ జంగయ్య ‘గొర్రెలు-చీమలు’; జాజుల గౌరి-‘మన్ను బువ్వ’; హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి ‘దళిత కథలు’ చెప్పుకోదగిన కథా సంపుటాలు. లక్ష్మీనరసయ్య దళితవాద దృక్పథంతో సాహిత్య వ్యాసాలు రాశారు. ఎండ్లూరి సుధాకర్, సతీష్ చందర్, గూడ అంజయ్య మొదలగువారు దళిత స్పృహతో కవిత్వం రాయగా, దళిత నేపథ్యంతో గద్దర్, మాస్టార్జీ పాటలు రాశారు. ఈ కవులు పురాణాల్లోని ఏకలవ్య, కర్ణ, అరుంధతి, శంబూకులను దళిత వ్యథకు ప్రతినిధులుగా, ప్రతీకలుగా తీసుకున్నారు. ఏసుక్రీస్తును దళిత ఉషస్సుకు ప్రతినిధిగా, దళిత యోధునిగా భావించారు. బుద్ధుణ్ని దళితుల వెలుగుకు ప్రతీకగా తీసుకున్నారు. దళిత కవిత్వంలో ఆవేశం, ఆగ్ర హం, ఆవేదనలతో కూడిన భావాల చిత్రణ కన్పిస్తుంది. చైతన్య స్ఫూర్తిని కలిగించే భావాలున్నాయి. అనేక దళిత కవుల కవితా సంపుటాలు వచ్చాయి. ‘దళిత కళామండలి’ పాటలు, కరీంనగర్ జిల్లా దళిత పాటలు విస్తృతంగా ప్రచురింపబడినాయి.
ముదిగంటి , సుజాతారెడ్డి
99634 31606