వనపర్తి సంస్థాన ప్రభువుల్లో బహరీ గోపాలరాయుడు ప్రసిద్ధుడు. ‘బహరీ’ అనేది బిరుదనామం. ఆయన ‘రామచంద్రోదయం’ అనే శ్లేషకావ్యాన్ని, ‘శృంగార మంజరి’ అనే నాటకాన్ని సంస్కృతంలో రచించాడు. ఆయనకు ‘షట్దర్శనీ వల్లభుడు’ అనే మరో బిరుదం ఉన్నది. ప్రసిద్ధ కవి బిజ్జుల తిమ్మభూపాలుడు గోపాలరాయలకు అల్లుడు. ఆయన ప్రాగటూరు సంస్థాన పాలకుడు. వారి రాజధాని అలంపురం. తిమ్మభూపాలుడు బీజాపూరు రాజునుంచి ఇనాముగా ఈ ప్రాంతాన్ని పొందాడు.
తిమ్మభూపాలుడు ‘అనర్ఘ రాఘవం’ అనే వీర రస ప్రధానమైన ఐదు ఆశ్వాసాల కావ్యాన్ని తెలుగులో రచించాడు. ఈ కావ్యాన్ని కేశవ పంతుల నరసింహశాస్త్రి పండితుని విపుల పీఠికతో 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. నెమలూరి వెంకటశాస్త్రి శతావధాని. వనపర్తి సంస్థాన చరిత్రను పద్యరూపంగా రచించాడు. వనపర్తి సంస్థానంలోనే మానవల్లి రామకృష్ణ కవి (1866-1957) అనే పరిశోధకుడు వనపర్తి ఆస్థాన గ్రంథ్రప్రచురణ నిర్వాహకుడిగా, ఆంతరంగిక కార్యదర్శిగా పదేండ్లు పనిచేశాడు.
ఈ కవి నన్నెచోడుని ‘కుమార సంభవం’, ‘క్రీడాభిరామం’; బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి’, ‘శ్రీరంగ మహాత్మ్యం’, ‘ప్రబంధ మణిభూషణం’; తిమ్మ భూపాలుని ‘అనర్ఘ రాఘవం’, ‘త్రిపురాంతకోదాహ రణం’ మొదలైన అరుదైన గ్రంథాలను తెలుగు ప్రతులను సంస్కరించి ప్రచురించాడు. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను వెలుగులోకి తెచ్చాడు. ‘కుమార సంభవం కవి నన్నెచోడుడు.. నన్నయకు పూర్వం ఉన్న కవి’ అని మానవల్లి ప్రతిపాదించినప్పుడు సాహిత్యలోకంలో పెద్ద సంచలనమే అయ్యింది. అనేక చర్చలకు దారితీసింది.
వనపర్తి సంస్థానంలో చలమ చెర్ల రంగాచార్యులు, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి వం టి ఎందరో పండితులు గౌరవాన్ని పొందారు.
జటప్రోలు (కొల్లాపురం) సంస్థానంలో ‘మహా మహోపాధ్యాయ’ బిరుదాన్ని పొందిన ఎలకూచి బాలసరస్వతి ఉన్నాడు. ఈ కవి సురభి మాధవరాయల ఆశ్రయంలో ఉంటూ 1610లో ‘ఆంధ్ర శబ్ద చింతామణి’కి తెలుగు టీకను రాశాడు. ఈ కవి రచించిన ‘చంద్రికా పరిణయం’ ప్రౌఢమైన కావ్యం. ఈయన ‘మల్ల భూపాలీయం’ రచించి మాధవరాయల తండ్రి వల్ల భూపాలునికి అంకితంగా ఇచ్చాడు. అన్నింటికన్నా ‘భర్తృ హరి’ శతకాలను తెనుగించి కీర్తిని పొందాడు.
సరళమైన శైలిలో ఉన్న ఈ కవి అనువాదం ప్రసిద్ధమైంది. దీన్ని వావిళ్లవారు ముద్రించారు. ఇం కా బాలసరస్వతి కవి ‘ రాఘవ యాదవ పాండవీయం’ అనే త్య్రర్థి కావ్యాన్ని రచించి వేంకటేశ్వర స్వామికి అంకితంగా ఇచ్చాడు. త్య్రర్థి కావ్యంలో బాలసరస్వతి రచించిన ఈ కావ్యమే మొట్టమొదటిది. సంస్కృతంలో ‘నిరోష్ఠ్య రామాయణా’న్ని రచించిన కవి కంఠీరవ కృష్ణమాచార్యులు జటప్రోలు సంస్థానంలో ఉన్నాడు. వీరే గాక ఎంతోమంది సంస్కృతాంధ్ర కవి పండితు లు ఈ సంస్థానంలో ఆదరణ పొందారు.
ఆత్మకూరు (అమరచింత) సంస్థానంలో సురవరం కేశవయ్య అనే కవి ఉన్నాడు. ‘నిరోష్ఠ్య రామాయణా’న్ని రచించి సోమ భూపాలునికి అంకితంగా ఇచ్చాడు. ప్రసిద్ధ కవి పండితుడు బుక్కపట్టణం రంగాచార్యులు ఆత్మకూ రు ఆస్థానకవి. అతని కుమారుడు బుక్కపట్టణ శ్రీనివాసాచార్యులు.. ‘జాంబవతి పరిణయం’ రచించాడు. ఆత్మకూరు ప్రభువు సీతారామారాజుకు తిరుపతి వేంకటకవులు ‘శ్రీనివాస విలాసం’ అనే కావ్యాన్ని అంకితంగా ఇచ్చారు. ప్రభు వు సీతారామరాజు ధర్మపత్ని భాగ్యలక్ష్మమ్మగారి సమాదరణతోనే సురవరం ప్రతాపరెడ్డి కూర్చిన ‘గోలకొండ కవుల సంచిక’ ప్రచురింపబడింది. ఆత్మకూరు ప్రభువులు కూడా అనేక సంస్కృతాం ధ్ర కవి, పండితులను ఆదరించారు.
ముదిగంటి
సుజాతారెడ్డి
99634 31606