ఒక భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పేది ఆ భాషలో వెలిసిన సాహిత్యమే. సంస్కృతం, తెలుగు, తమిళం మొదలైన భాషలు నేటికీ నిలిచి ఉండటానికి కారణం ఆయా భాషల్లో వెలిసిన అద్భుతమైన సాహిత్యమే. సాహిత్యం అనగానే అందరికీ ముందుగా మదిలో మెదిలేది కావ్యాలే. వేద, పురాణ, ఇతిహాసాలకు అతీతంగా కావ్యాలనే ఎందుకు సాహిత్యానికి ప్రామాణికంగా భావిస్తారు? సాహితీ చరిత్ర రచనకు కావ్య రచనా కాలాన్నే ఎందుకు ప్రామాణికంగా ఎంచుకుంటారు?
నన్నయకు ఐదు శతాబ్దాలకు పూర్వమే రేనాటి చోళుల కాలంలో తెలుగులో తొలి శాసనాలు వెలువడ్డాయి. అద్దంకి శాసనం కందుకూరి శాసనంలో పద్యాలు సైతం కనబడుతాయి. మరి సాహిత్య చరిత్రను నాటి కాలం నుంచి కాకుండా నన్నయ కాలం నుంచే ఎందుకు తీసుకుంటున్నారు? నన్నయనే ఎందుకు ఆదికవిగా పరిగణిస్తారు.. లాంటివి ఆసక్తికరమైనవి, ఆలోచింపదగినవి.
సాహిత్య, చరిత్రకారులు.. వాఙ్మయం, సాహి త్యం, సారస్వతం అన్న పదాలను ఒకే అర్థం లో వాడుతున్నారు. పరికించి చూస్తే గానీ వాటి మధ్య గల నిగూఢమైన వైరుధ్యాన్ని గుర్తించలేం. సాహిత్యంలో కవన ప్రధానమైన అనుభూతి ఆధారిత కావ్యాదులుంటాయి. సారస్వతంలో తార్కిక వివేచన గల, మేధోపరమైన వైజ్ఞానిక అంశాలు మిళితమైన శాస్ర్తాలు, వేదాలు, పురాణాలుంటా యి. వాఙ్మ యంలో సాహిత్యం, సారస్వతం అంతర్భాగాలు. వీటితోపాటు మౌఖిక అంశాలైన పాటలు, మాట లు, సామెతలు, పొడుపు కథలు, నుడికారాలు, ఆటలు మొదలైనవి భాషతో మిళితమై ఉంటాయి.
మానవుడు చేయవలసిన ధర్మాన్ని ఒక ప్రభువు వలె వేదాలు బోధిస్తాయి. కావున వీటిని ప్రభుసమ్మితా లు అంటారు. ఇవి శబ్ద ప్రధానాలు. అంటే వీటిలోని శబ్దాలు నిగూఢార్థ సమ్మితాలు. వీటిని ధర్మ శాసనాలుగా అభివ్యక్తీకరిస్తారు. వేదాల్లో ఉన్న క్లిష్టమైన శబ్దాల వివరణకోసం, అర్థావబోధన కోసం రాయబడినవే వేదాంగాలు. కాబట్టి వీటిని సూత్ర సాహిత్యం అంటారు. వీటి సహాయంతో శబ్దాల వివరణ సులభతరమవుతుంది.
వేద బోధిత అర్థాన్ని విపులంగా, కథారూపంలోవివరించేవే పురాణాలు. ఇవి అర్థ ప్రధానాలు. ముఖ్యంగా భగవంతుని లీలలను కథా రూపంలో వివరిస్తాయి. విషయాన్ని అర్థమయ్యేరీతిలో, సులభమైన పద్ధతిలో వివరిస్తాయి. కాబట్టి పురాణాలను ‘మిత్ర సమ్మితాలు’ అంటారు.
మనసులోని అనుభూతులకు ఒక రూపం ఇచ్చి, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే ప్రతీది కవిత్వమే. కవన ప్రధాన రచనే కవిత్వం. అంటే వర్ణనాత్మక నైపుణ్య రచనే కవిత్వం. కవిత్వంలో కవి అనుభూతికే తొలి ప్రాధాన్యం. కవిత్వం ఇతివృత్త రహితం. ఇతివృత్తం గల కవిత్వమే కావ్యం. పురాణేతిహాసాల నుంచి ఒక చిన్న ఇతివృత్తం స్వీకరించి దాన్ని నవరసభరితంగా యోగ్యమైన వర్ణనలను సందర్భానుసారంగా వినియోగిస్తూ కమనీయ గ్రంథంగా తీర్చిదిద్దితే దాన్ని ‘కావ్యం’ అంటారు. ఇందులో కథ మాత్రమే పురాణేతిహాసాల నుంచి లేదా ఇతర గ్రంథాల నుంచి తీసుకుంటారు. కానీ అందులోని కథనం, శిల్పం కవి భావాలకు అనుభూతులకు ఆధారంగానే సాగుతుంది. ఇందులో ఇతివృత్తం అనేది కావ్యానికి శరీరమైతే, వర్ణనలు అలంకారాలు రసానుభూతి కవి ఆత్మీయత మొదలైనవి కావ్యానికి ఆత్మ వంటివి.
వేదాలను ‘అపౌరుషేయములు’ అంటారు. అంటే వీటిని భగవంతుడే ఇచ్చాడని. వీటిని మానవులు రాయలేదనీ, కేవలం తమ సౌలభ్యం కోసమే వీటిని విభజించుకున్నారంటారు. పురాణాలు ముఖ్యంగా భగవంతుని లీలలను వివరిస్తాయి. ఇవి నిర్దేశించబడిన లక్షణాలకు అనుగుణంగా సాగుతాయి. ఇందులో కవి అభిప్రాయాలకు, ఆలోచనలకు అవకాశం ఉండదు. కావ్యంలో ఇతివృత్తమే ఇతర గ్రంథాల నుంచి తీసుకున్నప్పటికీ ‘శిల్పం’ విషయంలో కవి అనుభూతులు, ఆలోచనలకు అనుగుణంగానే రచన సాగుతుంది. ఇందులో కవి ఆత్మీయత ప్రధానంగా కనబడుతుంది. అంటే వీరి ఆలోచనలను, సంస్కృతిని చూపించడానికి అవకాశం కేవలం కావ్యాల్లోనే సాధ్యమవుతుంది. కాబట్టి సాహితీ చరిత్ర రచనకు పునాదిగా కావ్యరచనా కాలాన్నే పరిగణిస్తారు.
సంస్కృత ‘మహాభారతం’ను వ్యాసుడు వైదికశైలిలో రచించారు. అందుకే సంస్కృత మహాభారతాన్ని ‘పంచమ వేదం’ అంటారు. కవిత్రయ కవులు మహాభారత కథను సంస్కృత ఇతిహాసం నుంచి తీసుకున్నప్పటికీ, కథనం, శిల్పంలోనూ తెలుగు సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను మిళితం చేస్తూ, ఒక గొప్ప మహా కావ్యంగా తీర్చిదిద్దారు. తెలుగులో నన్నయకు పూర్వం ఎందరో శాసనకర్తలున్నప్పటికీ తెలుగు సాహిత్యం లో ఆదికవిగా గుర్తించడానికి కారణం తెలుగులో తొలి ‘కావ్యం’ను రచించింది మాత్రం నన్నయే.
శబ్ద ప్రధానమై, నీతి ధర్మ బోధకాలుగా ఉండేవి వేదాలు. అర్థ ప్రధానమై, కథాకథన దృక్పథంలో సాగేవి పురాణాలు. నీతి ధర్మబోధకాలైన ఆదర్శవంతమైన ఇతివృత్తంగా స్వీకరించి, నవరసభరితంగా శోభిత అలంకారయుక్తంగా ఒక కమనీయమైన కథగా మలిచేది కావ్యం. దాని ప్రయోజనం పాఠకులకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ఒక చక్కటి ఉపదేశాన్ని అందిస్తాయి. కళాత్మక హృదయం గలవారు ఎవరైనా కవిత్వంలో రాయగలరు కానీ, సన్నివేశాల మధ్య కళాత్మకమైన అంతఃసౌందర్యాన్ని కూరుస్తూ, రసరమ్య ఇతివృత్తంగా సాగే కావ్యరచన చేయడం సులభం కాదు. అందుకే కావ్యరచన చేయగల ప్రతిభావంతుడినే ‘కవి’ అంటారని భామహుడు అంటారు.
ఒక కావ్యంలో కవి రచనశైలి, అతని సాహిత్య పటిమ, జీవనవిధానం, సమకాలీన సమాజ సంస్కృతి సంప్రదాయాలు అంతర్భాగంగా మిళితమై ఉంటాయి. వీటినన్నింటిని భవిష్యత్ తరాలకు సజీవంగా అందించేవి కావ్యాలు. అందుకే కావ్యరచనను సప్తసంతానాలలో ఒకటిగా భావిస్తారు. పోతన మరణించి శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ అతని పేరు నేటికీ వినబడుతున్నదంటే కారణం అతని కావ్యరచనే. లక్షణాల ఆధారంగా కావ్యాలు రెండు రకాలు. అవి.. ‘నిబద్ధ కావ్యాలు’, ‘అనిబద్ధ కావ్యాలు’. నిబద్ధ కా వ్యాల్లో పూర్వోత్తర పద్యాలకు అంతఃసంబంధం ఉంటుంది. ఇందు లో ఒక ఇతివృత్తం కనబడుతుంది. ఈ లక్షణాన్ని ‘కులకం’ అంటా రు. ప్రబంధాలు, ఇతిహాసాలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ‘అనిబద్ధ కావ్యాల’లో పూర్వోత్తర పద్యాలకు మధ్య అంతఃసంబంధం, ఇతివృత్తాలు ఉండవు. ఈ లక్షణాన్ని ‘ముక్తకం’ అంటారు. శతకాలు, చాటువులు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
కథా కథనశైలి దృక్పథం నుంచి కావ్యాలు వర్ణనాత్మక దృక్పథంలోకి మారేక్రమంలో ఉద్భవించినవే ప్రబంధాలు. పురాణేతిహాసాల్లోని ఒక ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని అష్టాదశ వర్ణనలతోనూ శృంగారరస ప్రధానంగా, కథానాయిక, నాయకుల మధ్య అనుబంధాన్ని, వారి ప్రేమలోని అలౌకిక సౌందర్యాన్ని వర్ణిస్తూ చేసే రచనే ప్రబంధం.
మనుచరిత్ర ప్రబంధం చదివిన పాఠకులను అందులోని కథకన్నా, కవి ఉపయోగించిన వర్ణనలే ఎక్కువ ఆకట్టుకుంటాయి. ప్రబంధంలో కథైక్యం, వస్త్వేక్యం, రసైక్యం వంటి నియమాలు కచ్చితంగా పాటించబడాలి. దీన్నిబట్టి చూస్తే ‘ప్రబంధం’ అనేది కావ్య రచనా, రస భేదమే కానీ ప్రక్రియ భేదం కాదని తెలుస్తుంది.
తెలుగు సాహిత్యంలో క్రీస్తు శకం 1000 నుంచి 1500 వరకు మధ్యకాలాన్ని ‘కావ్యయుగం’గా, 1500 నుంచి 1700 వరకు మధ్యకాలాన్ని ‘ప్రబంధ యుగం’గా అభివర్ణిస్తారు. ఈ ప్రబంధమే ఆధునిక కాలంలో నవలగా రూపాంతరం చెందినది. కావున నవలను ‘వచన ప్రబంధం’ అని కూడా అంటారు.
భావ ప్రధానంగా ప్రారంభమైన కవిత్వం ఇతివృత్తం మిళితమైన కావ్యంగా పరిణతి చెందింది. శృంగారరస ప్రధాన ప్రబంధమైంది. ఆ తర్వాత భావజాల రంగు పులుముకున్నది. ఆధునికకాలంలో కవిత్వం మళ్లీ భావ ప్రధానమైనదిగానే తన అస్థిత్వాన్ని నిలుపుకుంటున్నది.
– ఎం.కురుమయ్య యాదవ్
77995 53493