తెలంగాణ విమోచన కోసం ‘రుద్రవీణ’ను మీటి ‘అగ్నిధార’ను కురిపించిన దాశరథి అభ్యుదయ కవిత్వమే కాదు, భావకవితా విపంచినీ మోగించారు. పద్యం, వచనం, సినీగీతం, గజల్, రుబాయీలతోపాటు వారి ‘లలిత గీతాలు’ సైతం ఎంతో ప్రజాదరణ పొందాయి. దాశరథి ‘లలిత గీతాల’ను ప్రధానంగా ప్రకృతి, ప్రణయం, ప్రబోధం, సంస్కృతి, దేశభక్తి మొదలైన విభాగాల్లో విభిన్న వస్తువుతో, విశిష్ట శిల్పంతో వైవిధ్యభరితంగా రచించి ‘భావ కవి’గా తన ప్రతిభను కనబరిచారు. వారి లలితగీతాలు.. నవమంజరి (1959), తేనెపాటలు (1960), వలపు పాటలు (1963) శీర్షికలతో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి, దూరదర్శన్లలో వారి పాటలెన్నో ప్రసారమై శ్రోతలను అలరించాయి.
1950-59 మధ్యకాలంలో రాసిన దాదాపు 20 లలిత గీతాలతో ‘నవమంజరి’ ప్రచురితమైంది. ఈ సంపుటిలోని పాటలన్నీ రసరమ్య పారిజాతాలే. వస్తువు పాతదైనా కొత్త భావుకతతో, కాల్పనికతతో రాశారు. ‘తారక’ శీర్షికతో రాసిన గీతంలో ఆకసాన మెరిసే చుక్కను నేలపైకి ఆహ్వానిస్తూ రాసిన విధానం పాఠకులను ఎంతో ఆకట్టుకొంటుంది.
‘మెరుపులు పూవుల దండగా/ మబ్బులు మెత్తని దిండుగా గగనము వెచ్చని శయ్యగా/హాయిగా నుందువే తారకా జగతికి రావే తారకా..!’ అని చక్కని భావ చిత్రాలతో దృశ్యమానం చేశారు. ‘కలువల రాజా’ శీర్షికతో రాసిన గీతంలో కలువలు చంద్రుని నేలపైకి వచ్చి తమ విరహబాధను తొలగించమని పిలుస్తూ, బతిమాలుతూ వేడుకుంటాయి. కలువ, తార, చంద్రులను మానవీకరణ చేయటం ప్రబంధకాలం నాటి సంప్రదాయమే అయినా, శిల్పంతో అభివ్యక్తిలో నవ్యతను ప్రదర్శించారు దాశరథి.
ఘంటసాల లలిత సంగీతం తాలూకు ప్రైవేటు రికార్డుగా వెలువడి తదుపరి ఆకాశవాణి ద్వారా ప్రసారమై విశేష జనాదరణ పొందిన గీతం ‘తలనిండ పూదండ దాల్చి నా రాణి’. ఈ గీతానికి ముందు ‘ఆరజనీకర మోహన బింబం’ అని దాశరథి మరో సందర్భం కోసం రాసిన గీతికను ‘సాకీ’గా వాడారు. ఈ పాటలో కవి తన ఊహా ప్రేయసిని ‘పూలవానలు కురిసే మొయిలుగా, మొగిలిరేకులలోని సొగసుగా’ వర్ణించారు.
ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మరో ప్రణయగీతం ‘ఎవ్వరిదోయి ఈ రేయి’. కె.బి.కె.మోహనరాజు గళం ద్వారా జాలువారిన ఈ పాటను చిత్తరంజన్ సుమధురంగా స్వరపరిచారు. ‘ఎవ్వరిదోయి ఈ రేయి’ అని ప్రశ్నతో పల్లవించిన గీతం ‘కన్ను కొసలతో కాంక్షలు రేపే కామినిదోయి యీ రేయి’ అనే సమాధానంతో సాగింది. ఇష్టసఖి సాంగత్యాన్ని ధ్వనించిన లలిత శృంగార గీతమిది. దీనికి స్వరకర్త చిత్తరంజనే.
దాశరథికి దీపం అంటే చాలా ఇష్టం. ‘నాకున్ దీపశిఖా కుమారికకు ఈనాడా శతాబ్దాల ముందే కానుండెను పెండ్లి’ (అమృతాభిషేకం) అని దీపాన్ని ప్రేయసిగా వర్ణించాడు. ప్రేమను దీపంగా భావించి…
‘వెలిగించవే చిన్ని వలపు దీపం ఎందుకే నామీద ఇంక కోపం..’
అని ప్రణయ శృంగార దీపాల్ని వెలిగించారు. ప్రేయసి మోమున గల కుంకుమే దీపమని, దాన్ని చూడగానే తాపం కలిగిందని చెప్పడం దాశరథి కవితా రాసిక్యతకు నిదర్శనం. దీపాన్ని ప్రణయానికే కాదు, ప్రబోధానికి ప్రతీకగా తీసుకొని రాశారు.
‘నీలో దీపం వెలిగించు- నీవే వెలుగై వ్యాపించు..’ అంటూ మనిషి ముందుగా తనను తాను సంస్కరించుకొని, సమాజం కోసం పాటుపడాలన్న సందేశంతో సాగిన ఈ గీతాన్ని డా.ఎం.బాల మురళీకృష్ణ ఆకాశవాణి కోసం ఆలపించారు. దాశరథి లలిత గీతాలలో ప్రబోధ గీతాలతో పాటు, దేశభక్తి గీతాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.
‘ఒత్తవోయి కాహళం-ఎత్తవోయి హలం, దున్నవోయి పొలం- శ్రమయే మన బలం..’ అనే ప్రబోధ గీతంతో పాటు, ‘ భూ ధరమో సాగరమో-భూ తలమో ఆకసమో..’ అనే గీతం ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ గీతంలో రామాయణ, భారతాదులు మొదలు, గౌతమ బుద్ధుని ప్రస్తావించి, గాంధీజీని ప్రస్తుతించారు. భరత ధరణి తన ఇల్లుగా, భరతజాతే తానుగా భావించిన తీరు ఆయన విశాల దృక్పథాన్ని సూచిస్తుంది.
‘నడవాలి నడవాలి నవభారత రథం విడవాలి విడవాలి నైరాశ్య సవిధం’
అన్న గీతాన్ని ఆకాశవాణి బృందగీతం.. కులమత భేదాలు, భాషా విభేదాలు వదిలి అంతా కలిసిమెలిసి ఉండాలని ఈ గీతంలో చెప్పారు.దాశరథి అభ్యుదయ కవిత్వంపై శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్లు, భావ కవిత్వంపై దేవులపల్లి కృష్ణశాస్తి ముద్ర కనిపిస్తుంది. ‘తలిరుమేసి ఎలకోకిల, పలికినదే తోటలో..’, మామిడి కొమ్మ మల్లియ రెమ్మ మంతన మాడినదే..’ మొదలైనవి ఉదాహరణలు. 1970వ దశకంలో ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ‘అలనీల గగనాన తెలిమట్టు చూడు’ గీతాన్ని కాళిదాసు రాసిన ‘మేఘసందేశం’ కావ్యం స్ఫూర్తిగా రాశారు. ఈ గీతంలో మబ్బును హంసగా, గాలిపటంగా, పోల్చి, చివరలో శాంతివర్షం కురిపించే కపోతంగా చిత్రించారు. ఈ గీతాన్ని ఎం.చిత్తరంజన్ ‘మధ్యమావతి’ రాగంలో స్వరపరిచారు.
దాశరథి లలిత గీతాలపై ముఖ్యంగా ప్రణయ గీతాలపై ఉర్దూ గజళ్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ‘వెన్నెల నీ కన్నులలో వెతికి తెచ్చుకొన్ననే/అమృతము నీ మనసు నిండి అంది పుచ్చుకున్నానే..’ అన్న పంక్తులు గజల్ శైలిలో రాసినవే. మనం తరచూ, తెలుగు పాటలలో ‘సాకీ’ అని పల్లవికి ముందు పద్యాన్ని పోలిన ‘వచన పద్యాన్ని’ చూస్తుంటాం. పార్సీ, ఉర్దూ సంప్రదాయానికి చెందిన ఈ సాకీని ప్రియసఖిగా ‘సాఖి’ శీర్షికన…
‘సాఖీ.. ఓ సాఖీ ద్రాక్షా రసాలతో, స్వప్నాల జాడలో చెలియా.. రావేమిటే..!’ ఏకంగా ఓ శృంగార గీతమే రాశారు. దాశరథి బాలల గేయాలను కూడా 1960లో ప్రచురించారు. వాటిలో ‘పిల్లల్లారా పాపల్లారా! రేపటి భారత పౌరుల్లారా..’ అను గీతాన్ని ప్రముఖ గాయకుడు కీ.శే. పీబీ శ్రీనివాస్ ఆకాశవాణి చెన్నై కేంద్రంలో స్వరపరచగా, అనంతరం జాతీయ బృందగీతంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమై జనాదరణ పొందింది. దాశరథి ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’ మొదలైన ఇతర కవితా సంపుటాల్లోనూ మాత్రా ఛందస్సులో గేయాలు రాశారు. ‘ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర’ ఎంతో ప్రాచుర్యం పొందిన గేయం.
కవిత్వాన్ని ఉద్యమంగా చేపట్టి కాళోజీ, సినారెలతో కలిసి తెలంగాణను చైతన్యవంతం చేసినవారు దాశరథి. కాల్పనికతను, అభ్యుదయాన్ని, సామ్యవాదాన్ని, శృంగారాన్ని, అంగారాన్ని తన విశాల కవితా విశ్వంభరలో పొదుగుకున్న కవితామూర్తి దాశరథి. ఆయన కవిత్వ వ్యక్తిత్వాన్ని డా.సి.నారాయణరెడ్డి కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు.
‘తెలగాణమ్ము తమ కవాటముల బందీయైన నిశ్శబ్ద రా త్రులలో మేల్కొని కోటి తమ్ములను మేల్కొల్పన్ మహోల్కాసముజ్జల కాంతి, స్ఫురదగ్ని గీతికల ఫభ్రమ్మంటగా పాడి తెల్గులలో వెల్గుల నాటినట్టి కవితాలోక ప్రభా నీరథి..!’
– డాక్టర్ వి.వి. రామారావు
98492 37663
(జూలై 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి…)