‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే’ అని ఓ మహనీయుడు చెప్పిన మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ.. విజయం సాధించలేకపోయామని చెప్తూ చాలామంది తమ ్ర పయత్న లోపాలను కప్పిపుచ్చుకుంటారు. మరికొందరు మాత్రం ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
అలా విజయం సాధించినవారిలో కొందరు తమ అనుభవాలను రచనలు, నవలల రూపంలో నేటి యువతకు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తారు. అటువంటి వారిలో ఒకరు భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ వెన్నం ఉపేందర్. ఆయన కలం నుంచి జాలువారిన ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ నవల ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నం ఉపేందర్ స్వగ్రామం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని గుమ్మడవెళ్లి. కాలే కడుపుకు కాసిన్ని నీళ్లు, సలిపించే గాయానికి కాసింత పశుమూత్రం పూత అన్నట్టుగా.. ఉపేందర్ ఆకలి ఆర్తనాదానికి కాసిన్ని నీళ్లే ఊరట. పేదోడికి గాయమైతే గాయం నొప్పి కంటే పైసల కోసం తండ్లాడే నొప్పే ఎక్కువ. ఆశయం కోసం ఆకలిని అదిమిపెట్టిన ఉపేందర్.. అకుంఠిత దీక్షతో పుస్తకాల పురుగయ్యారు. ఆయన జీవన ప్రస్థానం ఇతివృత్తంగా అక్షరీకరించిన నవలే ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’. ఈ నవల ద్వారా యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారాయన. ఈ నవల నేపథ్యమైన ‘ఆకలి భౌతికం-ఆవేదన మానసికం’ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
కాలినడకన రోజూ 16 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తూ ఆయన చదువుకున్న తీరును ‘హైస్కూల్ చదువులు – ఆమ్లపు చినుకుల స్పర్శలు’లో వివరించిన విధానం పాఠకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. చెప్పులు కొనలేని దుస్థితి, కాలికి గుచ్చుకునే ముళ్లు, రోజుకోసారి వచ్చిపోయే ఎర్ర బస్సులను చూస్తే.. మనమూ బాల్య స్మృతుల్లోకి వెళ్లిపోతాం.
నాయనంటే ఏడాదికోమారు వికసించే జ్ఞాపకం. ‘నాయనున్నప్పుడు జుర్రుకోవాలన్న సోయి లేదు, జారిపోయాక జాడ లేదు’ అంటూ పాఠకులను కంటతడి పెట్టిస్తూ.. తన హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోశారు ఉపేందర్. ‘నాయన బతికుండగా ఆయనకు అన్నం పెట్టని నా చదువు.. నాయన తీసుకునే అప్పు పత్రాలు రాయడానికి మాత్రం పనికొచ్చింది’ అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు రచయిత. లోకమంతా సదువు బంద్ చేసి, నాలుగు రూపాయలు వచ్చే పని చేయమన్నప్పుడు.. ‘నువ్వు చదువుకోవాలి బిడ్డ. నువ్వు సదివి పెద్ద కొలువులు జెయ్యాలి. నీ కష్టాలు, నష్టాలు నేను చూసుకుంటా బిడ్డ’ అని నాడు అమ్మ చెప్పిన మాటలను అక్షరీకరించి పాఠకులను ఉద్వేగానికి గురి చేశారాయన.
కష్టపడని తనముంటే కష్టాలను నిందించకు!
కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు!
ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఆటంకాలు ఎదురవడం సహజమే. కానీ, ఆశయం దిశగా అడుగులు వేస్తూ, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే విజయం మీ చెంతకు చేరుతుంది. వాస్తవ ఘటనలను కథావస్తువుగా ఎంచుకుని తనలోని భావాలను కథలోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నేటి యువతకు ఉపయోగపడే మరిన్ని నవలలు వెన్నం ఉపేందర్ కలం నుంచి జాలువారాలని ఒక పాఠకుడిగా ఆకాంక్షిస్తున్నా.
కోట దామోదర్
93914 80475