కథలు ఎక్కడి నుంచో పుట్టవు. చూసే చూపుండాలే గానీ మనలో నుంచో, ఎదుటవాళ్ల నుంచో, చుట్టుపక్కల వాళ్ల నుంచో బోలెడన్ని కథలు పుడతాయి. అవి తమని కనుక్కోమని మనకు కనీకనిపించని విధంగా సైగలు చేస్తుంటాయి. అటువంటి కథల కోసం జీవితానికి గేలం వేసి కూర్చొని.. కూసింత కదలిక కనపడగానే చురుగ్గా వాటిని లాగి తన బుట్టలో
వేసుకుంటాడు ఈ మేలిమి కథకుడు దేశరాజు. కథల వెదుకులాటలో దేశరాజు దేశముదురే.
కథను ఎంతవరకు చెప్పాలో, కథలో వివరాలు ఎంతవరకు ఉండాలో దేశరాజుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. ఆయన రాసిన కథలను చదివితేనే ఆ విషయం అర్థమవుతుంది. వైవిధ్యమైన కథా వస్తువులను స్వీకరించి, విభిన్నంగా కథ చెప్పాలన్న తపన కథకుడు దేశరాజులో కనపడుతుంది. అందుకు నిదర్శనమే ‘ఆలీబాబా అనేక దొంగలు’ కథల సంపుటి .
ఈ పుస్తకంలోని వేటికవే సాటి. మొదటి కథ ‘కుదుపు’లో పిల్లలు సెల్ఫోన్ వాడటం వల్ల జరిగే అనర్థాల గురించి ప్రస్తావిం చారు. కాలక్షేపం కోసం ఫోన్ను ఆశ్రయిస్తున్న పిల్లాపెద్దా ఏ విధంగా ప్రమాదపుటంచులకు ఒరిగిపోతున్నారో తెలిపే కథ ఇది. ‘కాసేపు మనిషి’ కథలో అవినీతితో అందలమెక్కిన ఒక అధికారి కారుకు ప్రమాదం జరిగి, ఓ వృద్ధురాలి ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. గతంలో ఆ అధికారి వృద్ధురాలికి పరోక్షంగా అన్యాయం చేస్తాడు. చివరికి ఆమె నిస్వార్థ గుణాన్ని చూశాక అధికారిలో కలిగిన పరివర్తన అతన్ని ‘కాసేపు మనిషి’ని చేస్తుంది.
ప్రకృతికి, పశుపక్ష్యాదులకు మనం ఎంతగా దూరమవుతున్నామో తెలిపే కథ ‘సహజాసహజం’. నలగని కథా వస్తువు, నడిపిన కథా సంవిధానం నచ్చి ఖమ్మం ఈస్థటిక్స్- 2022 వారు ఈ కథకు పురస్కారం ఇవ్వడం గమనార్హం.
‘తల్లీ, కూతురు – మధ్యలో ఆమె’ కథ బాలికలు, స్త్రీల పెంపకం గురించి ప్రస్తావిస్తుంది. ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడి, తమ సమస్యలను తామే ఎదుర్కోవాలని ఈ కథ సూచిస్తుంది. సమస్యలను ఎదిరించి నిలబడితే, కొన్ని నిబిఢీకృత సంశయాలు వదులుకొని పోరాడితే.. సమస్య మ నం అనుకున్నంత పెద్దది కాదని ఈ కథ చెప్తుంది.
‘కవి దుర్భేద్య’ కథ ఒక వ్యంగ్య విస్ఫోటనం. తరచి చూడాలే గానీ ప్రతివాడూ ‘బహురూపి’ కథలోని అతడులానో, ఆమెలానో ఉంటారు. కాకపోతే కథలు, వెతలు మారతాయి. ఈ పదమూడు కథల్లో అక్కడక్కడా వచ్చే కథకుడి సునిశిత పరిశీలన ఆశ్చర్యం కలిగిస్తుంది. నేరుగా సందేశాలిచ్చేకాలం కాదిది. చాలా కథల్లో పాత్రలకు పేర్లు లేకపోవడం గమనార్హం.
అనేక పొరలు తొలుచుకుంటూ వెళ్లాల్సిన కథ ‘ఆలీబాబా అనేక దొంగలు’. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని, అధికారమే పరమావధిగా చేసే మతతత్వ ప్రచారాల్లో.. మన వేలితోనే మన కండ్లను పొడుస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోతాం. అజ్ఞానం ఇచ్చే ఆనందాన్ని హాయిగా అనుభవిస్తుంటాం. హిందూ ధర్మం మర్మమెరిగినవాడు, ఇస్లాం మత సహనం తెలిసినవాడు ఈ మత్తులో పడడు. అందుకే ‘కండ్లు తెరవండి’ అంటున్నాడు కథకుడు. తరాలుగా వస్తున్న పొరపొచ్చాలను ఒలుచుకొని, మత విద్వేషాల నుంచి బుర్రలు ప్రక్షాళన చేసుకోవాలని చెప్తూ.. కథకుడు ఈ కథ చెప్పడంలో చాలా మెలకువ ప్రదర్శించారు. కథా సంపుటికి ఈ పేరు పెట్టడం సబబే.
(ఈ కథలను కారా మాష్టారు శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆయనకు అంకితమివ్వడం విశేషం)
పి.శ్రీనివాస్ గౌడ్
99494 29449