తరతరాల జీవన సంస్కృతులు, సంప్రదాయాలకు పల్లెలు ప్రతీకలు. ప్రతి పండుగ ఆచారాలు, సంస్కృతిని ప్రస్ఫుటిస్తుంది. ప్రకృతి అనే శక్తికి భక్తి అనే ఆచారంతో తమను రక్షించమనే వేడుకోలు ప్రతీ పండుగలో వినిపిస్తుంది. పిల్లలు, పెద్దలు,ఆత్మీయత, అనుబంధాలతో కలసిమెలిసి ఆడిపాడుకునే పండుగ బతుకమ్మ .
బతుకమ్మ పండుగ గురించి తెలంగాణ పల్లెల్లో పాడుకునే పాటల్లో పలు అంశాలతో పాటు, చారిత్రక నేపథ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. జగన్మాత మహిషాసురుడిని వధించిన తర్వాత అలసిపోయి ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి రోజు మూర్ఛపోయిందని, ఆ తర్వాత చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ గుంపుగా తిరుగుతూ జగజ్జనని స్పృహలోకి రావడానికి వివిధ రీతుల్లో గౌరీదేవిని వేడుకొన్నారని అంటారని ప్రతీతి.
మరో కథనం ప్రకారం.. చాళుక్య వంశానికి చెందిన ధర్మాంగదుడు అనే రాజుకు చాలా ఏండ్లవరకు సంతా నం ఉండదు. తర్వాత జన్మించిన బిడ్డకు లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆ బిడ్డ అనేక అనారోగ్య సమస్యలు, గండాలను ఎదుర్కొంటుంది. దాంతో రాజుగారి ఆస్థా న పండితులు శక్తి స్వరూపిణి అయిన గౌరీదేవిని ప్రకృతిలో సహజంగా లభించే పూలతో పూజించాలని చెప్తారు. దాంతో ప్రకృతిలోని పూలతో గౌరీదేవిని నిత్యం పూజించడం వల్ల ఆ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుంది. అప్పట్నుంచి బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారని ఒక కథనం. ఈ కథనమే పాట రూపంలో పరికింపగా ఈకింది విధంగా ఉంటుంది.
రామ రామ రామ ఉయ్యాలో..
శ్రీరామ రామ ఉయ్యాలో..
శ్రీలక్ష్మి దేవియూ ఉయ్యాలో..
సృష్టి బతుకమ్మయె ఉయ్యాలో..
భరతుని దేశమున ఉయ్యాలో..
ధర్మాంగుడను రాజు ఉయ్యాలో..
ఆ రాజు భార్యయూ ఉయ్యాలో..
అతివ సత్యవతి ఉయ్యాలో..
ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు భవిష్యత్తుకు ఎలాంటి ఆపద రాకుండా, నిండు నూరేండ్లు పండుగలా బతుకు సాగాలని, గౌరీ మాతను పూజించడ మే బతుకమ్మ పండుగ. పూలను ఓ ఆకారంగా పేర్చి దేవుడిగా పూజించ డం ఒక్క తెలంగాణలోనే పండుగలా చేయడం విశేషం. అదేవిధంగా
నా నోము నీకిత్తనే గౌరమ్మా..
నీ నోము నాకియ్యవే గౌరమ్మా..
యేమేమి కాయొప్పునే గౌరమ్మా..
యేమేమి పూయొప్పునే గౌరమ్మా..
గుమ్మడి కాయొప్పునే గౌరమ్మా..
గుమ్మడి పూవొప్పునే గౌరమ్మా..
తంగేడు కాయొప్పునే గౌరమ్మా..
తంగేడు పూవొప్పునే గౌరమ్మా.. అంటూ ఆనందంగా పాడుకుంటారు.
ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో జానపదుల పండుగగా వెలసిన బతుకమ్మ నేడు దశ దిశలా తన ప్రాభవాన్ని చాటుతున్నది. తెలంగాణ ప్రాం తంలో ఎంతో జానపద సాహిత్యం, కళలున్నాయి. మానవజాతికి ఎంత చరిత్ర ఉన్నదో, జానపద కళలు, సాహిత్యానికి అంతే చరిత్ర ఉన్నది. మౌఖికంగా ఒకతరం నుంచి మరో తరానికి వారసత్వంగా వచ్చే ఈ తెలంగాణ జానపద సంస్కృతిని పరిరక్షించాల్సిన, బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్న ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని అన్ని ప్రాంతాలు బతుకమ్మ చారిత్రక విశిష్టతను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం గర్వించదగిన విషయం.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-డాక్టర్ ఓరుగంటి సరస్వతి