చూపులకు అందంగా.. తడిమి చూస్తే నునుపుగా అనిపించే ఈ సంచులు, బుట్టలు ఎంత బాగున్నాయో! ఇవన్నీ అరటి నారతో అల్లినవే. అరటి పంట చేతికొచ్చాక రైతులు బోదెలను నరికి, శుభ్రంగా తగులబెడతారు. దీనివల్ల కాలుష్యం తలెత్తుతుంది. కాబట్టే, వృథాగా పోతున్న బోదెలను తమదైన పద్ధతిలో ఉపయోగంలోకి తెస్తున్నారు మదురై నారీమణులు.
ప్రపంచీకరణ దెబ్బకు సంప్రదాయ వృత్తులు కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో.. చేతివృత్తుల వారికి చేతినిండా పని కల్పిస్తూనే, అరటి రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ఆలోచన ఇది. స్థానిక మహిళలకు ఎలాంటి ఉపాధి మార్గాలూ లేకపోవడం మురుగేశన్ అనే సామాజిక శాస్త్రవేత్తను ఆవేదనకు గురి చేసింది. దీంతో అరటి బోదెల నుంచి నార తీసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు.
ఆ నారతో మహిళలు సంచులు, బుట్టలు, చిమ్నీలు, చాపలు, గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో.. అయిదుగురితో ఈ స్వయం ఉపాధి ఆరంభమైంది. క్రమంగా చిన్నపాటి పరిశ్రమగా ఎదిగిపోయింది. ఎం.ఎస్. రోప్స్ ప్రొడక్షన్ సెంటర్ (మదురై)లో ఇప్పుడు 350 మంది పనిలో ఉన్నారు. ఏటా 500 టన్నుల అరటి నారతో రూ. 1.5 కోట్ల వార్షిక ఆదాయం ఆర్జిస్తున్నారు. అనేక దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. గుజరాత్ గ్రాస్రూట్ ఇన్నొవేషన్, సుజుకీ రూరల్ ఇన్నొవేషన్ సెంటర్ వీరికి ఆధునిక సాంకేతికతను అందించాయి.