తరాల చేనేత కళ, సంప్రదాయ సేంద్రియ సేద్యం, పాత పంటల పునరుజ్జీవనం.. విజయలక్ష్మి నాచియర్ జీవిత లక్ష్యాలు. చేనేత కార్మికుల సాధికారత కోసం ‘ఎథికస్’ అనే ఫ్యాషన్ బ్రాండ్ సృష్టించిందామె. మార్కెట్నూ మెప్పించిందామె. దేశంలో జన్యు మార్పిడి పత్తిసాగు బాగా పెరిగింది. వస్ర్తాల తయారీలో ఆ పత్తినే వాడుతున్నారు. బట్టల మిల్లుల సంఖ్యా పెరుగుతున్నది. రసాయన సేద్యం మొదలు యంత్రాలతో పనిచేసే మిల్లుల వరకు.. అన్నీ ప్రకృతికి హాని కలిగించేవే. దీంతో కాలుష్యం పెరిగింది. రుగ్మతలు పెరిగాయి. ఈ సంక్షోభాలకు సంప్రదాయ వ్యవసాయం, గ్రామీణ చేనేతలోనే పరిష్కారం ఉందని అంటారు విజయలక్ష్మి.
తమిళనాడులోని పొల్లాచిలో ఉండే విజయలక్ష్మి నాచియర్.. తన భర్త మణి చిన్నస్వామితో కలిసి స్థానిక విత్తనాలతో సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేశారు. పర్యావరణానికి హాని చేయని ఈ పత్తితో నేసిన వస్ర్తాలు ఆరోగ్యకరమని తెలియడంతో.. మార్కెట్లో మంచి ధర పలికింది. అలా ఔత్సాహిక రైతులకు, పారిశ్రామిక వేత్తలకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ‘మన సంప్రదాయం.. మన జీవన విధానం’ విజయమ్మ నినాదం.