ప్రసంగాన్ని ప్రారంభించేటప్పుడు ఎంతో పదిలంగా, హృదయంగమంగా, తర్క బద్ధమైన వాక్యాలతో ప్రారంభించాలె. శ్రోతల్లో ఒక విధమైన ప్రభావాన్ని ప్రసరించగలిగే శక్తి ప్రారంభవాక్యాల్లోనే ఉండాలె. వక్త తొలి పలుకులు వినగానే శ్రోతలు ఇది తమకు తెలుసుననీ, ఇందులో కొత్త ఏమీ లేదనీ, మాట స్పష్టంగా లేదనీ ఏవేవో వ్యాఖ్యానాలు చేసుకునే పరిస్థితి కల్పించకూడదు.
వక్తవ్యాంశ హృదయం ప్రసంగం మధ్యలో వ్యక్తం కావాలె. ప్రసంగాంతంలో చాలా స్పష్టంగా, ఉత్సాహంగా, సంక్షిప్తంగా తన నిశ్చితాభిప్రాయాలను ప్రకటించాలె. సందిగ్ధంగా, భయం భయంగా, తొందర తొందరగా ప్రసంగం ముగిస్తే శ్రోతల్లో సదభిప్రాయం ఏర్పడటానికి అవకాశం ఉండదు. వక్తవ్యాంశం స్పష్టంగా శ్రోతలకు బోధపడదు. పలువురు వక్తలు ప్రసంగాంతంలో తమ ఉపన్యాస సారాన్నంతా నాలుగు వాక్యాల్లో చెప్పి ముగిస్తారు. ఉపన్యాసం కల్పించిన మనఃస్థితిని ఈ పద్ధతి గట్టిపరుస్తుంది.
మంచివక్తలుగా తయారు కావడానికి ముందు మంచివక్తలతో స్నేహం చెయ్యాలె. మనకు కలిగిన ఆలోచనలు, అనుభూతులు ఎంతవరకు యథార్థాలు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, నమ్మకంగా మనకేదైనా విషయం పరమ సత్యమని తెలిసినప్పుడే, దృఢంగా దాన్ని ప్రకటించడానికి యత్నం చేస్తూ ఉండాలె. పుస్తకాలలోని ప్రసిద్ధ ఉపన్యాసాలను అధ్యయనం చేస్తూ ఉండాలె. పిల్లల మధ్య నిలిచి మాట్లాడుతూ ఉండాలె. మన భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి ఆయా అక్షరాల ధ్వనులను అనుకరించి స్ఫుటమైన ఉచ్చారణను అలవరుచుకోవాలె.
భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం పుణ్యమన్నారు. శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కును పవిత్రమైన వాణిగా గుర్తించారు. వాక్కు మనిషికి అలంకారం. ఎన్నడూ ఉడిగిపోని అలంకారం. చక్కనిభాష లేనివాడు మంచి వేషం వేసుకున్నా వ్యర్థమే. వాగ్ధార కృపాణధార కంటె పదునైనది. వాక్కు
విశాలమైనది.
వక్తృత్వ కళారాధనం అక్షరాస్యులకు లక్ష్యం కావలె. సంస్కృతి పరిరక్షణకు పునాది కావలె. నిద్రాణమైన మనశ్శక్తి జాగృతం కావాలంటే వక్తృత్వ కళోపాసనం ఒక సాధనం. చక్కగా సంభాషించడం, మనోజ్ఞంగా సంభాషించడం, ఇతర మనస్సులకు హాయిని కలిగేటట్టు సంభాషించడం, చీకటిలో దివ్వె వెలిగినట్టు సంభాషించడం, బర్బరత్వం, అజ్ఞానం, దారిద్య్రం రూపు మాసిపోయేటట్టు సంభాషించడం బుద్ధిమంతుని లక్షణం.
వాగ్భూషణం భూషణం
(డా. ఇరివెంటి కృష్ణమూర్తి రచన నుంచి)