సివిల్ సర్వీసెస్.. భారతీయ ఉద్యోగార్థుల శిఖరాయమాన స్వప్నం. ఐఏఎస్ అధికారి హోదా ఎంత ఇష్టమో… ఎంపికవడం అంత కష్టం. ఆ విజయం సాధించడం కోసం ఏటా లక్షలాది మంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లలో వందలమంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అంతటి కష్టమైన పరీక్షలో దృష్టిలోపం ఉన్న మహిళ ఐఏఎస్కు ఎంపికైంది. సివిల్స్కి సిద్ధమవుతున్న వారికి ఆమె ఓ స్ఫూర్తి పాఠం! సివిల్స్ సాధనకు వ్యూహం, ప్రణాళి కాబద్ధమైన అధ్యయనం ఉంటేనే సరిపోదు. విజేతల అనుభవ పాఠాలు కూడా తెలుసుకోవాలి. అలాంటివారిలో తప్పకుండా చదవాల్సింది ఆయుషి డబాస్ గెలుపు కథ!
Ayushi Dabas | ఢిల్లీలోని రాణీ ఖేరా ఆయుషి స్వస్థలం. ఉన్నత విద్య వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదివింది. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం (శ్యామాప్రసాద్ ముఖర్జీ కళాశాల)లో డిగ్రీ చదివింది. తర్వాత జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో బీఈడీ చేసింది. 2012లో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉపాధ్యాయినిగా చేరింది. కొన్నాళ్లకు ఇందిరాగాంధీ జాతీయ దూరవిద్య విశ్వవిద్యాలయంలో ఎమ్ఏ (హిస్టరీ) చదివింది. పీజీలో గోల్డ్ మెడల్ సాధించింది. 2016లో ఢిల్లీ ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో శాశ్వత ఉద్యోగం సాధించింది. 2019లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్గా పదోన్నతి పొందింది. తనకున్న దృష్టిలోపాన్ని అధిగమిస్తూ ఇవన్నీ సాధించిందామె.
వింటూనే చదువుతూ..
పిల్లలకు పాఠాలు చెప్పడం కోసం ఆయుషి నిరంతరం నేర్చుకోవాల్సి వస్తుండేది. దీనికోసం స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాప్టాప్, ఫోన్లలో ఉన్న పుస్తకాలను వినేది. ఇలా పిల్లల కోసం నేర్చుకుంటూనే ఉపాధ్యాయ పదోన్నతి కోసం పరీక్షలకు సిద్ధమైంది. దాంతోపాటే సివిల్స్కి కూడా ప్రయత్నాలు చేసింది. నాలుగు ప్రయత్నాలు విఫలమైనా ఆమెలో పట్టుదల సడలలేదు.
ఉద్యోగం.. చదువు.. సంసారం..
ఆయుషి వాళ్ల అమ్మ ఆశారాణి నర్స్గా పనిచేసేది. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడు. నాలుగేండ్ల క్రితం హర్యానాలోని ఝజ్జర్ గ్రామవాసితో ఆయుషి వివాహం జరిపించారు. ఆయన ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుంటాడు. పెండ్లయిన తర్వాత కూడా ఆయుషి సివిల్స్ ఆశయాన్ని వదల్లేదు. దృష్టిలోపం, ఉద్యోగం, సంసార బాధ్యతల్లో ఉన్నా ఐఏఎస్ కావాలన్న కలను విడిచిపెట్టలేదు. ఆమె పట్టుదల చూసి తన బిడ్డ తప్పకుండా సివిల్స్ సాధిస్తుందని వాళ్ల అమ్మ గట్టి నమ్మకం పెట్టుకుంది. తన కోసం సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. పూర్తిగా బిడ్డ చదువుకే తన సమయం
కేటాయించింది.
బిడ్డ ఆశయం.. అమ్మ ఆశ..
అయిదో ప్రయత్నంలో ఆయుషి కష్టం ఫలించింది. 2021లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో జనరల్ కేటగిరిలో 48వ ర్యాంక్ సాధించింది. అయిదేండ్ల నిర్విరామ కృషి ఫలితంగా దక్కిన విజయం ఇది. ‘అంధురాలిని కావడం వల్ల విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. పాఠాలు చెప్పడం నాకు ఇష్టమైన పని కాబట్టి కష్టమే అయినా ఉద్యోగాన్ని సంతోషంగానే చేశాను’ అంటున్నది ఆయుషి. ‘ఆడవాళ్లకు, దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్లనే నేను నిలదొక్కుకున్నాను. మరో పెద్ద అవకాశం కోసం ప్రయత్నించా’ అని ఆమె ఢిల్లీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నది. ‘మా అమ్మాయి సివిల్స్ సాధించాలని ఆశపడటమే కాదు, సాధిస్తుందనే నమ్మకమూ ఉంది. కాకపోతే 50లోపు ర్యాంక్ రావడమే మాకు ఆశ్చర్యంగా ఉంది’ అని ఆశారాణి బిడ్డ విజయానికి పొంగిపోయింది.
సివిల్స్ స్ఫూర్తి పాఠం!
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు 29 ఏండ్ల ఆయుషి డబాస్ ఎన్నో విలువైన అనుభవ పాఠాలు చెబుతున్నది. దృష్టిలోపంతో పోరాటం చేస్తూ, పాఠశాలలో పాఠాలు చెబుతూ ఐఏఎస్గా నిలిచింది. ఒక ప్రయత్నంలో ఓటమి చెందినా మరో ప్రయత్నం చేస్తూ గెలుపు కోసం ఎదురు చూసింది. మొత్తానికి అయిదో ప్రయత్నంలో ఆమె కల నెరవేరింది.