ఓ వయసుకు వచ్చిన తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నది. పొడుచుకు వచ్చిన పొట్ట ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ, వంశ పారంపర్యత, మందుల దుష్ఫ్రభావాలు, అతిగా మద్యం సేవించడం, సర్జరీలు.. ఈ సమస్యకు కారణాలు. పొట్టచుట్టూ కొవ్వు ఎక్కువైనకొద్దీ.. ఊబకాయం, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, అధిక రక్తపోటు, గుండె వ్యాధులకు దారితీసే ఆస్కారం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వీలుకాకపోవచ్చు. అయితే, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించుకునేందుకు ఓ మంచి చిట్కా ఉంది. చియా గింజలు, నిమ్మరసం, తేనె మిశ్రమం సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయత్నించి చూడండి.
ఇలా చేయాలి..
వేయించిన చియా గింజలు- 2 టేబుల్స్పూన్లు, నిమ్మరసం- 1 టీస్పూన్, తేనె- 1 టేబుల్స్పూన్ చొప్పున ఒక గిన్నెలో తీసుకోవాలి. వాటిని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ బ్రేక్ ఫాస్ట్కు ముందు.. పొద్దున్నే వేడినీళ్లతో రెండు టేబుల్స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వేయించిన చియా గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి.. పేగుల గుండా బయటికి పంపిస్తాయి. నిమ్మ రసంలోని విటమిన్-సి శరీర జీవక్రియల రేటును ఎక్కువ చేస్తుంది. దాంతో కొవ్వు తొందరగా కరిగి పోతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం కొవ్వును కరిగించుకునే సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ఈ చిట్కాకు కొంచెం వ్యాయామం, ఓ మోస్తరు ఆరోగ్యకరమైన ఆహారం తోడైతే మంచి ఫలితం కనిపిస్తుంది. కేవలం చిట్కాలతో ఏమీ సాధించలేం.. ఒక్క కిలో కూడా తగ్గలేం.