ట్రాన్స్ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్మొదలైంది. ఇక నుంచీ యాచకులుగా భావించాల్సిన పన్లేదు. ఇంకో రూపంలో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లిప్పుడు స్వయం ఉపాధి బాటలో నడుస్తున్నారు. సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంటున్నారు. తెలంగాణ సర్కారు చేయూతతో మార్పు జెండా ఎగరేస్తున్నారు.
ట్రాన్స్జెండర్లు అంటేనే సమాజంలో చులకన భావం. ఆత్మీయులు సైతం చీదరించుకునే దయనీయ స్థితి. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తుల జీవితాలైతే మరీ దుర్భరం. చదువులేక, స్వశక్తితో ఎదిగే స్తోమత లేక, ఎవరూ ఉపాధినివ్వక, జీవనం సాగించే మార్గం తెలియక.. అనేక మంది భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అటు ఇటుకాని ఆ జీవితాలను ఆదుకున్న ప్రభుత్వాలే లేవు. కానీ, దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ట్రాన్స్జెండర్లకు ఉపాధి శిక్షణ ఇచ్చి గౌరవప్రదమైన జీవితానికి అవకాశం కల్పించింది.
ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసింది. రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో.. ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో 23 మందితో శిక్షణ కార్యక్రమానికి నాంది పలికింది. తొలుత ప్రభావన జూట్ అండ్ అలైడ్ ఫైబర్స్ మల్టీస్టేట్ ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీ, ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ అండ్ మౌంట్ ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో కూకట్పల్లిలోని దుర్గాబాయి శిశు వికాస కేంద్రంలో 21-55 ఏండ్ల వయసు ట్రాన్స్జెండర్స్కు జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇప్పించింది. డిజైన్ కటింగ్, స్టిచింగ్.. ఇలా అన్ని విధాలుగా తర్ఫీదునిచ్చింది.
ఉపాధి శిక్షణతో సరిపెట్టకుండా ట్రాన్స్జెండర్లు స్వశక్తితో ఎదిగేందుకు కావలసిన అన్ని చర్యలనూ తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా దివ్యాంగుల, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.54,79,226 వ్యయంతో సూరారంలో జూట్బ్యాగుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ సంస్థ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆర్డర్లను తీసుకుంటున్నది. ట్రాన్స్జెండర్ల ద్వారా ల్యాప్టాప్, షాపింగ్ జూట్ బ్యాగులను ఉత్పత్తి చేయిస్తూ.. మార్కెటింగ్ బాధ్యతలనూ తలకెత్తుకున్నది. ఇక్కడ శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్లకు ఏడాది పాటు ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికే కొందరు సొంతంగా యూనిట్లు పెట్టుకున్నారు. మరి కొందరు విద్యా సంస్థలలో క్రాఫ్ట్ టీచర్లుగా స్థిరపడుతున్నారు. నెలనెలా జీతాలు అందు కుంటున్నారు. దీంతో శిక్షణ కోసం ముందుకు వస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతున్నది. ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీలో ఇదో సరికొత్త పరిణామం.
తొలుత 45 రోజుల పాటు జరిగే జూట్బ్యాగుల శిక్షణ శిబిరంలో రోజుకు రూ.200 చొప్పున ఉపకారవేతనం ఇస్తారు. ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఏడాదిపాటు ఉపాధి కల్పిస్తూ.. ఆ సమయంలో నెలకు రూ.15,600 వేతనం చెల్లిస్తారు. ఇది కాకుండా.. రవాణా, భోజన వసతి అదనం. ఉబెర్, ఓలా తదితర రవాణా యాప్స్ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు పుట్టు కొస్తున్నాయి. వ్యాపార నిర్వహణలో ఓ వాహనం తప్పనిసరి కూడా. దీంతో టూవీలర్, త్రీవీలర్ రైడింగ్లో శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం దుర్గాబాయి శిశు వికాసకేంద్రంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. శిక్షణ పూర్తయినవారు యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలను మంజూరు చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలు నేరుగా అందిస్తుండగా, 80 శాతం సబ్సిడీపై లక్ష, 70 శాతం సబ్సిడీపై 2 లక్షలు, 60 శాతం సబ్సిడీపై 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. ‘సమాజంలో అత్యంత వివక్షకు గురవుతున్న లింగమార్పిడి మహిళలకు అండగా నిలుస్తూ కేసీఆర్ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. జూట్బ్యాగుల తయారీ అనేకాదు.. ఇతర రంగాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు, రుణాలు మంజూరు చేసేందుకు కృషిచేస్తున్నాం’ అంటారు లింగ మార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ ప్రతినిధి శైలజ.
నిన్న మొన్నటి వరకూ ఆ గొంతుకలలో ఆత్మన్యూనత తొంగి చూసేది. ఇప్పుడు అవే స్వరాలు ఖంగుమంటున్నాయి. పడాల నందిని జీవితమే తీసుకోండి. ‘అంతకుముందు భిక్షాటన చేస్తూ అందరిలానే జీవించాను. అంతా చీదరించుకునేవారే. కానీ జూట్బ్యాగుల తయారీలో శిక్షణ తీసుకున్న తరువాత నా జీవితం మారిపోయింది. అక్కడే ఏడాది పాటు పనిచేశాను. ఇప్పుడు సొంతంగా బ్యాగుల తయారీ చేపట్టాను. మరోవైపు ఒక ఎన్జీవోలో బ్యాగుల తయారీ శిక్షకురాలిగా నెలకు రూ.20వేల వేతనంతో పనిచేస్తున్నా’ అంటూ తన కథ వినిపించింది నందిని. ఒకటా, రెండా.. ఇలాంటి గొంతుకలు అనేకం.
…? మ్యాకం రవికుమార్