పట్నంలో వైద్యం చేయించాలంటే రోగితోపాటు వచ్చే సహాయకులు తిండికి తిప్పలు పడాల్సిందే! ఇక్కడి ఖర్చులకు జేబులు ఖాళీ అవుతాయన్న సంగతీ అనుభవమున్నవారికి తెలుసు. అలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తుంది ‘జనహిత సేవా ట్రస్ట్’. గాంధీ దవాఖానకొచ్చే రోగి బంధువులకు ఆశ్రయం కల్పించి, మూడు పూటలా తిండి పెడుతూ వారి ఆకలి తీర్చే అన్నపూర్ణ ఇది. మానసిక పిల్లలకు విద్యను నేర్పుతూ గొప్ప పంతులమ్మగా మారింది. పదమూడేండ్లుగా నిరంతరం సేవా మార్గంలో పయనిస్తున్న ‘జనహిత’ విశేషాలను ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నర్సింహమూర్తి సోమయాజులు బతుకమ్మతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
మాది హైదరాబాద్. నాన్న రైల్వే ఉద్యోగి కావడం వల్ల హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో నా చదువు సాగింది. ఆ తరువాత హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరాను. సుమారు నలభై సంవత్సరాలు పనిచేశాను. ఉద్యోగంలో భాగంగా తరచూ పర్యటనలు చేసేవాణ్ని. ఆ సమయంలోనే పేదల కష్టాలు నన్ను కదిలించాయి. కనీసం తిండికి కూడా నోచుకోని వారిని చూసి చలించిపోయేవాణ్ని. అలాంటి వాళ్లకోసం నావంతుగా ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా 2008లో సేవా భారతి స్వచ్ఛంద సంస్థలో చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాను.
ఆ సమయంలోనే పద్మారావు నగర్లోని సేవానంద ఆశ్రమంలో ఉండే స్వామిజీతో పరిచయం ఏర్పడింది. ఆయన రెగ్యులర్గా గాంధీ ఆసుపత్రికి వెళ్లి తోచిన సేవ చేస్తుండేవారు. అలా ఒకరోజు ఆయన రోగులకు చద్దర్లు పంపిణీ చేస్తుండగా అక్కడున్న సూపరింటెండెంట్ ‘స్వామీజీ మీరు నిత్యం ఎంతోమంది రోగులకు సహాయం చేస్తునే ఉన్నారు. నేను దవాఖాన ప్రాంగణంలో స్థలం ఇస్తాను. అందులో ఓ భవనం కట్టి రోగులతో వచ్చే సహాయకులకు ఆశ్రయం కల్పించండి’ అని అడిగారు. కొన్నాళ్లకు అక్కడ స్వామిజీ భవనం కట్టించారు. దాని కార్యకలాపాలు నన్ను చూసుకోమని చెప్పడంతో కాదనలేక ఒప్పుకొన్నాను.

అలా ప్రారంభించాం
రోగుల సహాయకులకు ఆశ్రయం కల్పించేందుకు 2013లో గాంధీ దవాఖానలో ఈ షెల్టర్ను ప్రారంభించాం. ఒకసారి మధ్యాహ్నం కావొస్తుంది కరీంనగర్ నుంచి వచ్చిన ఓ మహిళ తన పిల్లలతో పాటు ఆ షెల్టర్లోనే ఉంది. అదేంటమ్మ బయటికెళ్లి తినిరాకుండా ఇక్కడే ఉన్నావని అడిగాను. తన వద్ద డబ్బులేమి లేవందామె. తన భర్త డయాలసిస్ కోసమని మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పింది. ఆమె మాటల్లోంచి పుట్టిందే మధ్యాహ్న భోజనం. అప్పటినుంచి రోగుల కోసం వచ్చే సహాయకులకు ఉచిత భోజనం అందించాలనే లక్ష్యంతో మా చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టి రోజుకు 50 భోజనాలు పంపిణీ చేసేవాళ్లం.
అలా 2014లో పది మంది ఆకలి తీర్చడం కోసం ‘జనహిత సేవా ట్రస్ట్’ ఏర్పాటైంది. 2014లో గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు కొంతమంది కలిసి మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చులో 75 శాతం సహకరిస్తామని హామీ ఇచ్చి నెలనెలా పంపించడం ప్రారంభించారు. మా సేవలు చూసిన ఓ స్వామిజీ రాత్రిపూట తనే స్వయంగా భోజనం తయారు చేసి పంపించేవారు. ఇలా రోజుకు రెండు పూటలు భోజనం అందిస్తుండగా. ఒకరోజు ఆదిలాబాద్కు చెందిన ఓ వృద్ధుడు ఆకలితో ఉదయం 11 గంటలకే షెల్టర్లో ఎదురు చూస్తుండటం నన్నెంతో కలిచివేసింది. అలాంటి ఇబ్బంది మరెవరూ పడొద్దని ఉదయం టిఫిన్ కూడా ప్రారంభించాం.

విరాళమిచ్చిన స్థలంలో
గాంధీ దవాఖానలో అడ్మిట్ అయిన రోగికి వైద్యులు అందించే గేట్ పాస్తోపాటు సహాయకుల ఆధార్ కార్డు ఆధారంగానే వారికి ఆశ్రయం కల్పించి భోజనం అందిస్తాం. ఒక్కొక్కరు ఆరు నెలలు గడిపిన వారూ ఉన్నారు. మొదట్లో ఉచితంగానే అందించాం. ఉచితమంటే అవసరం లేనివారు కూడా వస్తున్నారని భావించి, రోజుకు పది రూపాయలు ఎంట్రీగా పెట్టాం. గతంలో భోజనాన్ని బయటనుంచి తెచ్చి పెట్టేవాళ్లం. ప్రస్తుతం మేమే వండి తీసుకొస్తున్నాం. ఇందుకు గాను దమ్మాయిగూడలో ఓ మహిళ 1000 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అందులో మానసిక విద్యార్థుల కోసం ఓ పాఠశాల, కిచెన్ ఏర్పాటు చేశాం. 2024 నవంబర్లో నలుగురు పిల్లలతో ప్రారంభించిన మానసిక విద్యార్థులలో ప్రస్తుతం 22 మంది విద్యార్థులు రెగ్యులర్గా వస్తున్నారు. వారిని ఇంటినుంచి వాహనాల్లో తీసుకొచ్చి తిరిగి ఇంటిదగ్గరే దిగబెడతాం. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక బోధన చేస్తున్నాం.
ఇవీ మా సేవలే
సహాయం అవసరమైన వారికి చేయూతనివ్వడమే మా సంస్థ లక్ష్యం. గాంధీలో నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్, దమ్మాయిగూడలో ప్రారంభించిన మానసిక విద్యార్థుల పాఠశాలతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వాటిలో ప్రధానంగా గాంధీ, ఉస్మానియా, ఎంఎన్జే క్యాన్సర్ దావఖానల్లో హెల్స్డెస్క్ నిర్వహిస్తున్నాం. బస్తీ ప్రజల ఆరోగ్యం కోసమని ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. లక్షమందికిపైగా సీపీఆర్ ట్రైనింగ్ ఇప్పించాం. మహిళా సాధికారతలో భాగంగా 3000 మంది మహిళలకు కుట్టుమిషన్ నేర్పించాం. విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. వీటన్నిటితో పాటు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నది నా కల.
…? రాజు పిల్లనగోయిన
ఫొటోలు: కె.సాయిబాబా