ఉదయం తెల్లవారక ముందే ఆ గ్రామం పొలాల్లో నడిస్తే… నేలమీద మెరిసే మంచు బిందువులు చిన్నచిన్న ముత్యాల్లా కనిపిస్తాయి. కానీ, ఆ మంచు అక్కడ అందం కోసం మాత్రమే కాదు… పంటలకు ప్రాణం కూడా. నీళ్లు లేక ఎండిపోయే భూముల్లో, మంచు తేమనే నమ్ముకుని జొన్నలు, సజ్జలు, రాగులు పండిస్తున్న రైతుల కథ ఇది. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ సమీపంలోని నాగ్వర్ గ్రామంలోని ఈ రైతుల జీవన విధానం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడేవారికి ఒక కేస్ స్టడీలా మారింది.

‘మాకు బోర్లు లేవు… కాలువలు లేవు… అయినా ఏడాదంతా మా పొలాల్లో ఏదో ఒక పంట ఉంటుంది’ అంటూ చిరునవ్వుతో చెబుతుంది రైతమ్మ వినోద. ఆమెకు కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. కానీ దానిలో వరి, చెరకు, పత్తి కాకుండా 25 రకాల చిరుధాన్యాలు, సంప్రదాయ పంటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా మంచు కురిసే కాలంలో నేలపై ఏర్పడే తేమతోనే కొన్ని పంటలు పెరుగుతాయని ఆమె చెబుతారు.
‘జొన్నల్లో నాలుగు రకాలు… సజ్జల్లో ఐదు రకాలు… కొర్రలు, రాగులు ఇలా సీజన్ మారినా పంట ఆగదు. నెలకో పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. మా కుటుంబానికి కావాల్సింది ముందుగా దాచుకొని, మిగిలినదాన్ని మాత్రమే అమ్ముకుంటాం’ అంటుంది వినోద. అయితే ఈ కథలో అసలు ముచ్చట ఆమె చెప్పిన పంటల దగ్గరే ఆగిపోదు. ‘నాకు ముగ్గురు పిల్లలు. ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్లలేదు. మా ఊర్లో చాలామంది అలాగే ఆరోగ్యంగా ఉంటారు. టాబ్లెట్లు కూడా వేసుకోం. రసాయన ఎరువులు లేని ప్రకృతి ఆహారమే మా బలం’ అని ఆమె చెప్పే మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఈ గ్రామంలో రైతులు బయట నుంచి విత్తనాలు కొనరు. వారి పూర్వికుల నుంచి వస్తున్న పాతకాలపు విత్తనాలను ఇప్పటికీ భద్రపరుస్తున్నారు.

ప్రతీ పంట తర్వాత మంచి గింజలను ఎంపిక చేసి నిల్వ ఉంచి, తదుపరి సీజన్లో వాటినే మళ్లీ వాడతారు. ఇది కేవలం విత్తనాల నిల్వ కాదు… తరతరాల సంప్రదాయాన్ని కాపాడుకోవడం. నాగ్వార్ సమీపంలోని మరో గ్రామం మాచునూరు. ఇక్కడ మహిళలు అందరూ కలిసి విత్తన బ్యాంక్ను నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవసరమైన విత్తనాలు ఇక్కడి నుంచే అందుతున్నాయి. మంచి మొలకశాతం, అసలు రకపు లక్షణాలు ఉన్న గింజలనే జాగ్రత్తగా ఎంపిక చేస్తారు.
విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది అంటారు విత్తన బ్యాంక్ నిర్వహిస్తున్న మహిళలు. ఇక్కడి వ్యవసాయంలో మరో విశేషం… రసాయనాలకి పూర్తిగా నో చెప్పడం. ఎరువులు, పురుగు మందులు ఏవీ ఉపయోగించరు. పొలాల్లోనే పశువ్యర్థాలతో తయారయ్యే సేంద్రియ ఎరువులే వాడుతారు. వానాకాలంలో పొలం గట్లపై సహజంగా పెరిగే ఆకుకూరలనే వండుకుంటారు. అందుకే ఈ గ్రామంలో ఎరువుల దుకాణాలు కనిపించవు.
ఖర్చులు తక్కువ… ఆరోగ్యం మెరుగ్గా… భూమి సారవంతంగా… ఇవన్నీ కలిసి ఎకరానికి లక్షన్నరకు పైగా లాభం వస్తున్నదని రైతులు సంతోషంగా చెబుతున్నారు. ‘జహీరాబాద్ రైతులు కేవలం మంచు బిందువులతోనే కాదు, వర్షాకాలంలో నేలలో నిలువ ఉన్న తేమ, నల్లరేగడి నేలల నీటి నిల్వ సామర్థ్యం, దీనికి తోడు జొన్న పంటలో వేడి నిరోధక స్వభావాన్ని ఉపయోగించుకుని తక్కువ నీటితో సాగు చేస్తున్నారు’ అని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న ఈ కాలంలో… మంచు బిందువులను ఉపయోగించుకొని పంటలు పండిస్తున్న సంగారెడ్డి రైతుల జీవన విధానం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ప్రకృతిని జయించడానికి కాదు… అర్థం చేసుకుని దానితో కలిసి సాగితేనే భూమి మనిషిని కాపాడుతుందని ఈ గ్రామం నిశ్శబ్దంగా చెబుతున్నది.
– శ్యాంమోహన్ 9440595858